జ్ఞాన దర్శిని

హారతి దీపం


జాతో బ్రహ్మకులే గ్రజోధనపతిర్యః కుంభకర్ణానుజః
పుత్రః శక్రజితః స్వయందశిశిరః పూర్ణాభూజా వింశతిః
స్వేచ్ఛః కామచరోరథాశ్వవిజయీమధ్యేసముద్రంగృహం
సర్వం నిస్ఫలితం తథైవ విధినా దైవే బలే దుర్భలే
     బ్రహ్మదేవుని వంశంలో జన్మించినప్పటికీ, కుబేరుని అన్నగా కలిగి ఉన్నప్పటికీ, కుంభకర్ణుడనే బలశాలి తమ్మునిగా ఉన్నప్పటికీ, ఇంద్రుని జయించిన ప్రతిభాశాలియైన ఇంద్రజిత్తు కుమారునిగా ఉన్నప్పటికీ, పదితలలు, ఇరవై చేతులు కలిగి ఉన్నప్పటికీ, ఆకాశగమనాది సిద్ధులు పొంది ఉన్నప్పటికీ, దుర్భేద్యమైన లంకాపట్టణానికి అధిపతియై ఉన్నప్పటికీ, గొప్ప గొప్ప రథాలు, గుర్రాలు, అస్త్రశాస్త్రాలను కలిగి ఉన్నప్పటికీ, చిత్తశుద్ధిలేని కారణం చేత మనోమాలిన్యం తొలగని కారణంచేత, కామాడులకు హృదయంలో ఆశ్రయం కల్పించినందువల్ల, లోపలి చీకటిని పోగొట్టుకోలేనందున రావణుడు తన జీవితాన్ని నిష్పలం చేసుకున్నాడు.
      కాబట్టి మనిషిలో అజ్ఞానాన్ని, హార్దిక తమస్సును పారద్రోలగల జ్ఞానజ్యోతి అంత్యంతావశ్యకమైయున్నది. అట్టి జ్ఞానజ్యోతికి బాహ్యదీపం ప్రతిక.
దీపస్త్వం బ్రహ్మరూపోసి
జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుర్తాంశ్చ
సర్వాన్ కామంశ్చ దేహియే
ఓ దీప దైవమా! నీవు బ్రహ్మస్వారూపమై ఉన్నావు. మాకు సకల సౌభాగ్యాలను, సుపుత్రులను ఇచ్చి, మా కోర్కెలన్నింటినీ తీర్చుమా.
సౌజ్యం త్రివర్తిసంయుక్తం
వహ్నినా యొజితం మయా
గృహాణ మంగళం దీపం
త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్చామి
దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోరా
దివ్య జ్యోతిర్నమోస్తుతే
   శ్రేష్ఠమైన నేతిలో మూడు వత్తులతో వెలుగొందుచూ, మూడులోకాల యొక్క గాడాంధకారాన్ని పోగొట్టగల మంగళప్రదమైన జ్యోతిత్రయాన్ని వెలిగించి సర్వాంతర్యామియైన నీకు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. దివ్య జ్యోతి స్వరూపమైన ఓ దైవమా! నన్ను ఈ ఘోర నరకం నుండి రక్షించు.
    ఇలా స్వామిని వేడుకుంటూ దీపారాధన చేస్తూ హారతులనిస్తుంటాం. హారతి భక్తునిలోని ఆత్మకు ప్రతీక. హారతి భక్తునిలో ఓ దివ్య తేజాన్ని కలిగిస్తుంది. ఆ పరంధామునిపై మనసును లగ్నం చేయడానికి హారతి ఉపకరిస్తుంది.
దీపాలను పట్టుకుని దైవం ముందు తిప్పే విషయాలను గురించి ఆగమాలలో చెప్పబడింది. దీప షోడశోపాసన అంటూ రకరకాల హారతి పద్ధతులను గురించి వివరించబడింది. 3,5,7 నుంచి 251 వరకు తిప్పే హారతుల పద్ధతులున్నాయి. హారతిని దైవం ముందు వెలిగించి తిప్పడాన్ని దీప నిరంజనమని కూడ అంటారు. కర్పూరాన్ని వెలిగించడం ద్వారానో, లేక మూడు, ఐదు, ఏడు వత్తులను నేతిలో ముంచి వెలిగించిన దీపంతోనో హారతిని ఇస్తుంటారు. సాధారణంగా హారతి, పూజకు ముగింపు సమయాలలో ఉంటుంది. ఈ హారతి సేవను చూసినవారి జీవితాల నుంచి, లేక హారతి సేవను చేసినవారి జీవితాల నుంచి పెనుచీకటి తొలగిపోయి వెలుగురేఖలు వెల్లివిరుస్తాయనేది పెద్దలవాక్కు.
    హారతులను ఇచ్చేందుకు రకరకాల హారతి పళ్ళాలను తయారు చేస్తుంటారు. కుంభ (బిందె), కూర్మ (తాబేలు), నాగ (ఏడుతలలపాము) గోపుర రూపాలలోనున్న హారతి పళ్ళాలను మనం చూడగలం. సాధారణంగా హారతి ఇచ్చేందుకు వెడల్పాటి పళ్ళెం ఉపయోగించబడుతుంటుంది. కొన్ని కొన్ని సార్లు చిన్న పళ్ళాలు లేక గరిటెరూపంలో హారతి వస్తువులను ఉపయోగిస్తుంటారు.
     అసలు స్వామికి హారతిచ్చే దీపస్తంభమే ఒక మోస్తరు దైవమనే చెప్పాలి. దీపస్తంభపు పైభాగం అగ్నికి ప్రతిరూపం కాగా, పిడిభాగం ఈశ్వర ప్రతిరూపం, అడుగుభాగం ప్రజాపతికి ప్రతిరూపం. ఆ దీపపుస్తంభాన్ని పైకి, కిందికి తిప్పుతున్నప్పుడు సూర్యుడు, అగ్నికి ప్రతిరూపంగా చెప్పా బడుతుంది. అలా హారతి ఇస్తూ తిప్పే దీపాలలో రకాలున్నాయి. ఒకే ఒక దీపం ఏకహారతి, ఇంకా రెండు, మూడు ఐదు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది దీపాలతో కూడిన హారతీ దీపపు సెమ్మెలుంటాయి. పాము ఆకృతిలో ఉండే దీపపు సెమ్మెలను నాగదీపమని, రథాకారం రథదీపం, మనిషి పురుషదీపం, కొండ మేరు దీపం, శివపంచాకృతులు పంచబ్రహ్మదీపం, ఏనుగు ఆకారం గజ దీపం, ఎద్దు ఆకారం వృషభ దీపం, కుండ కుంభ హారతి దీపం అని అంటారు. అదేవిధంగా దీపపు సెమ్మెల సంఖ్యను బట్టి, ఆకారాన్ని బట్టి వాటికి సంబంధించిన అధిదేవతలను కూడా పేర్కొన్నారు.

ఏకహారతి  మహేశ్వరుడు
ద్విహారతి  ఉమా మహేశ్వరులు
త్రిహారతి  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
పంచహారతి  పంచభూతాలూ
సప్తహారతి  సప్త ఋషులు
అష్టహారతి  అష్టమూర్తులు
నవహారతి  తొమ్మిది గ్రహాలు
దశహారతి  దిశానాయకులు 
నాగదీపహారతి   వాసుకి 
రథదీపహారతి  సదాశివుడు
మేరుదీపహారతి  బ్రహ్మ
వృషభదీపహారతి  నంది
పురుషదీప హారతి  శరభేశ
పంచబ్రహ్మాదీప హారతి  పంచముఖశివుడు
    అదేవిధంగా మనం హారతి పళ్ళాలను, లేక దీపాలను త్రిప్పుతున్నప్పుడు, ఏ పద్ధతిలో త్రిప్పాలన్న విషయమూ చెప్పబడింది. ముందుగా హారతితో దైవం ముందు త్రిప్పు తున్నప్పుడు, దైవం యొక్క తల భాగం నుంచి పాదాలవరకు దీప హారతిని త్రిప్పాలి. రెండవసారి తిప్పే హారతి స్వామి ముఖం నుండి మోకాళ్ళవరకు, మూడవ సారి తిప్పే హారతి మెడ, నడుము భాగాల మధ్య త్రిప్పాలని చెప్పబడింది.
     దైవం ముందు ఒకటికి లేక మూడు, ఐదు, ఏడు తొమ్మిది దీపాలతో కూడిన హారతులిస్తుంటారు. కొన్ని శాస్త్రాల ప్రకారం తొమ్మిది దీపాలహారతి నవగ్రహాలకు ప్రతీక అని, ఏడు దీపాలహారతి సప్తమాతృకలకు, ఐదు దీపాల హారతి పంచభూతాలకు ప్రతీకలని చెప్పబడుతున్నాయి. దేవాలయాలలో  దీపహారతిని ఇచ్చేముందు మంత్రజలాన్ని చిలరించి, హారతిపళ్ళెం పిడి పై ఒక పుష్పాన్ని ఉంది, తగిన హస్త ముద్రతో హారతిని స్వామి ముందు తిప్పుతూ ఆముఖ దేవతాభ్యో నమః దీపం సమర్పయామిఅనే మంత్రాన్ని పఠిస్తారు. హారతి పళ్ళానికి పిడి తప్పనిసరి. సాధారణంగా హారతి పళ్ళాలను ఇత్తడితో చేస్తుంటారు. వెండి హారతి పళ్ళాలను విరివిగా ఉపయోగిస్తుంటారు. కొన్ని కొన్ని దేవాలయాలలో దీపపు హారతులను ఏక, పంచహారతి సంఖ్యలుంటాయి.

ఏకహారతి: ఏక హారతి విధానంలో ఒక దీపపు సెమ్మెలో ఒకే ఒక వట్టి ఉంటుంది.
పంచహారతి: పంచహారతిలో ఐదు దీపపు సెమ్మెలలో ఐదు వత్తులుంటాయి. శైవాలయాలలో ఐదు పడగల ప్రతిమతో కూడిన దీపపు సెమ్మె ఉంటుంది. ఇందులో ఒక పడగ రాహువుకి ప్రతీక కాగా, మిగతావి కేతువుకి ప్రతీకలని అంటారు. ఇలాంటి హారతిని నాగహారతి లేక నాగదీపమని అంటారు. శ్రీరంగంలో పంచహారతి జరుగుతుంటుంది.
కూర్మహారతి: తాబేలు ఆకారంలో చేయబడిన హారతి పళ్ళానికి పదహారు వత్తులు అమర్చే వీలుంటుంది. ఈ హారతి పళ్ళాలను వెండితో చేస్తారు.
రథహారతి: దీపపు సెమ్మెలు రథాకారంలో అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్కవరుసలో ఐదు వత్తులుంటాయి. పుష్పాకృతులతో అలంకరించబడిన పిడి ఉంటుంది. ఈ రథహారతి హిందూ దేవాలయాలతోపాటు జైన దేవాలయాలలో కూడ చూడగలం.
చంద్రదీపం: ఈ దీప హారతి నెలవంక ఆకృతిలో ఉంటుంది.
నారాయణహారతి: పదిహేను వత్తుల వెండిహారతి పళ్ళెం.
కుంభహారతి: అన్ని రకాలైన హారతులను ఇచ్చిన తరువాత కుంభహారతితో ముగింపు పలుకుతుంటారు.
ధూపహారతి: సాంబ్రాణి పొగతో ఇవ్వబడే హారతి.
కర్పూరహారతి: కర్పూరాన్ని వెలిగించి ఇచ్చే హారతి.
---------------------------------------------

సర్వదేవతా స్వరూపుడు

     మహాగణపతి శబ్దం బ్రహ్మస్వరూపం. అంటే ఓంకారానికి ప్రతీక. మంత్రాలకు ముందు ఓంకారం ఎలాగైతే ఉంటుందో, అలాగే, అన్ని శుభకార్యాలకు ముందు గణపతి పూజ తప్పనిసరిగా ఉంటుంది. వినాయకుడు ఆదిదేవుడు. సకలదేవతాస్వరూపుడు. ఆందుకే ఆయనకు ప్రథమపూజ.
     ఎవరు ఏ దేవతను ఉపాసించినప్పటికీ, ముందుగా గణపతిని పూజించవలసిందేనని నియమం. ఆయన సర్వదేవతాస్వరూపుడు. మంత్రశాస్త్రాలు, ఆ స్వామిలో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను, రతీమన్మథులను, భూమీవరాహులను, మిథున దేవతలు ఉన్నారని చెబుతున్నాయి. ఇక, వేదాలకు ఆదిస్వరమైన ఓంకారమే గణపతి గణాలు. వాటి నాయకుడు గణపతి.
   గణమయమైన ఈ విశ్వానికి ఆయన అధిపతి కనుక గణపతి. గజ వదనునికి వర్ణం ప్రీతిపాత్రం. అనే అక్షరం నుండి మనోవాణీమయమైన ఈ సమస్త జగత్తు ఆవిర్భవించింది. అందుకే భావాత్మకమైన ఈ జగత్తంతా శబ్దవాచ్యం. కారం పరతత్త్వానికి సంకేతం. కారం సగుణ సంకేతమైతే, ‘కారం నిర్గుణ సంకేతం. ఆయన రూపం మనకు ఎన్నో నిగూఢమైన సత్యాలను బోధ పరుస్తుంటుంది.
భారీకాయం
   గణ + ఈశః = గణేశః ఈ సమస్త విశ్వానికి పతి కనుక గణపతి. ప్రకృతిలో చరాచరాత్మక సృష్టి మొత్తం ఉన్నట్లుగా లెక్కింపబడి (గణింపబడి) ఎవరైతే పాలిస్తున్నారో ఆ పరమేశ్వరునే గణపతిఅని అన్నారు. ఆ స్వామి ఈ సమస్త విశ్వమంతటా వ్యాపించి వున్నాడు.
లంబోదరుడు
   లంబమైన ఉదరంగలవాడు లంబోదరుడు. ఈ అండపిండ బ్రహ్మాండమంతా ఆయన బోజ్జలోనే నిక్షిప్తమై ఉంది. అందుకే ఆ స్వామికి ఆ పెద్ద పొట్ట. మరొక కథనం ప్రకారం, విష్ణుదత్తమైన నైవేద్యాలతో, శివుడు ఇచ్చిన నైవేద్యాలతో నిండిన పెద్ద పొట్టగలవాడని చెప్పబడుతోంది.
ఏకదంతుడు
‘   దంతశబ్దం బలవాచకం. ఏకఅంటే ప్రధానమని అర్థం. ఈ ఏకశబ్దం విశ్వమంతా ఏకస్వరూపంలో వ్యాపించిన మాయాశక్తికి సంకేతం. అదేవిధంగా ఆయన దంతం త్యాగానికి ప్రతీక. ఓ సత్కార్యం కోసం, తనకు చెందిన దానిని త్యాగం చేయడం గొప్ప గుణం. ఆ స్వామి పరశురామునితో జరిగిన ఓ యుద్ధంలో దంతాన్ని ఆయుధంగా ప్రయోగించాడని ఓ కథ. మరొక కథ ప్రకారం, వ్యాసుడు భారతాన్ని చెబుతున్నపుడు, వ్యాసుడు చెప్పినంత వేగంగా భారతాన్ని లిఖిస్తున్న వినాయకుని ఘంటం విరిగిపోయిందట. అప్పుడు వినాయకుడు తన దంతాన్ని విరిచి ఘంటంగా ఉపయోగిస్తూ భారతాన్ని ముగించాడట.
చేటల వంటి చెవులు
    చేటల వంటి చెవులు జ్ఞాన సంపదకు ప్రతీకలు. ఆయన తన విశాలమైన చెవుల ద్వారా భక్తుల కష్టాలను ఓపిగ్గా విని, వారికి ఎటువంటి కష్టనష్టాలు ఎదురుకాకుండా కాపాడుతుంటాడు. అదేవిధంగా అతి తక్కువగా మాట్లాడుతూ, ఎక్కువగా వినమని ఆయన చెవులు మనకు చెబుతున్నాయి.
చతుర్భుజుడు
   గణపతి అనంతమైన రూపాలను ధరించిన స్వామి. అందులో చతుర్భుజరూపం ఒకటి. ఆయన నాలుగు చేతులు ధర్మార్థకామమోక్షాలనే చతుర్విథ పురుషార్థాలను సూచిస్తున్నాయి. గణపతి, దేవలోకం, మానవలోకం, అసురలోకం, నాగాలోకాలను నియమిస్తున్నాడని ప్రతీతి.
ఆయుధధారి
అదేవిధంగా ఆయా సందర్భాలనుబట్టి ఎన్నో రూపాలను ధరించిన గణేశుడు రకరకాల ఆయుధాలను ధరించి మనకు దర్శనమిస్తుంటాడు. ఆయన చేతులలోని ఆయుధాలు కూడ ఎన్నో లోలైన విషయాలను విడమరచి చెబుతున్నట్లుగా గోచరిస్తుంటాయి.
శ్లోకం:
తొలుత నవిఘ్నమనుచు
ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య
నిను బ్రస్తుతి జేసెద నేకదంత మా
వలపలి చేతిగంటమున
వాక్కుననెప్పుడు బాయకుండు మా
తలపుల లోన నీవెగతి దేవ,
వినాయక, లోకనాయకా
    శివపుత్రుడా! అవిఘ్నమస్తు అంటూ మొట్టమొదటగా నీకు మొక్కుతున్నాను. నాకు చక్కని ఫలితాలను ఈయవయ్యా. నిన్ను పొగుడుతున్నాను. ఓ ఏకదంతా! నా కలంలో, వాక్కులో నువ్వే నెలకొని వుండు. నిన్నే నమ్ముకుని ఉన్నాను. ఓ దేవా! వినాయకా! లోక నాయకా!!

పాశం: పాశాన్ని పై ఎడమ చేత్తో పట్టుకుని దర్శనమిస్తుంటాడు. రాగద్వేషాలను అదుపులో ఉంచుకోమని స్వామివారి చేతిలోనున్న పాశం మనకు అవగతపరుస్తోంది. ఈ పాశం మనకు ఆయన అవతారాలలో పలువిధాలుగా గోచరిస్తుంటుంది. కొన్ని విగ్రహాలలో నాగపాశంగా కనబడుతుంటుంది.
అంకుశం: స్వామి చేతిలో నున్న మనకు అంకుశం దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఉంటుంది.
యుద్ధగొడ్డలి: ఇది మనలోని చెడుభావాలను దూరంగా ఉంచమని చెబుతోంది.
గండ్రగొడ్డలి: ఈ ఆయుధాన్ని గణేశునికి పరశురాముడు బహుకరించాడని ప్రతీతి. పరశురామునికి ఈ ఆయుధాన్ని శివుడు బహుకరించాడు. వీర, సిద్ధి, విఘ్న, హేరంబ, నృత్య గణపతుల చేతుల్లో ఈ గండ్రగొడ్డలి చూడగలం.
విల్లు: ఒకసారి పార్వతీదేవి దగ్గరనుంచి శివుని విల్లు పినాకమును తీసుకున్న గణపతి, దానిని భూమిపైకి విసిరేసాడని ఒక కథ. అలా ఆయన విల్లంబును ధరించాడని ప్రతీతి. ఒక్కొక్కసారి ఆయన చేతిలో చెఱకుగడ విల్లును కూడ చూడగలం. ఈ విల్లు చెడుకు దూరంగా ఉండమని మనకు చెబుతోంది.
బాణం: స్వామి చేతిలోని బాణం, మనలను చీకటి నుండి వెలుగులోకి పయనించమని చెబుతోంది. ఒకసారి త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి వెళ్ళిన శివుడు, గణపతిని స్మరించకుండానే ఆ పనికి ఉద్యుక్తుడయ్యాడు. ఫలితంగా ఎంతగా ప్రయత్నించినప్పటికీ శివుని చేతిలో త్రిపురాసురుడు హతమవడం లేదు. కొంతసేపటి తర్వాత విషయాన్ని గ్రహించిన శివుడు గణేశుని ప్రార్థించగా, ఆయన ఓంఅనే బీజమంత్రాన్ని బాణంపై వ్రాసి ప్రయోగించామన్నాడట. శివపరమాత్మ అలాగే చేయగా త్రిపురాసుర సంహారం విజయవంతంగా జరిగింది.
కత్తి: స్వామివారి గంధక ఖడ్గప్రియ అనే కత్తి మన మనసులోని తలెత్తే చెడు ఆలోచలనలను మొగ్గలోనే తుంచేయమని చెబుతోంది.

గునపం: వ్యవసాయదారులు ఉపయోగించే గునపం పలువిధాలుగా ఉపయోగపడుతుంది. తద్వారా పంటలు బాగా పండించుకునేందుకు వీలవుతుంది. అలాగే మనలోని భావనలను ఆలోచన అనే గునపంతో తిరగేసి జీవితంలో పురోభవృద్ధి సాధించమని గునపము పేర్కొంటుంది.
శతధరవరాయుధం: ఈ ఆయుధం మంచి చెడులను వేరు చేసి చూడమంటోంది.
గద: వినాయకుడు గణాధిపత్యం పొందకమునుపే పార్వతీదేవి ఆజ్ఞప్రకారం, ఆమె భవనానికి కాపలాకాస్తూ శివగణాలతో యుద్ధానికి దిగుతాడు. అప్పుడు ఆయన చేతిలో గదాయుధం ఉంది. ఈ ఆయుధం సమస్యలను ఎదిరించి నిలబడి పోరాడమని మనకు సూచిస్తోంది.
త్రిశూలం: వీర గణపతి చేతిలో త్రిశూలాన్ని చూడగలం. ఈ త్రిశూలం ఆపదలు, లేక విపత్తులు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి పోరాడమని మనకు సూచిస్తోంది.
డాలు: ఈ ఆయుధం ఇతరులు మనకు చేసే చెడు నుంచి రక్షించుకోమని సూచిస్తోంది.
మనకు వినాయకుడు మూశికవాహనుడుగానే తెలుసు. కానీ ఆయనకు తేలు, పాము, రథం,వంటి వాహనాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

మూషికవాహనుడు
    పూర్వం క్రౌంచుడనే గంధర్వుడు సౌభారి అనే ముని ఆశ్రమానికి వచ్చి వెళ్తుండేవాడు. క్రౌంచునికి గంధర్వ లోకం కంటే సౌభారి ఆశ్రమమే చాలా బాగా నచ్చుతుండేది. అందుకు కారణం మున్యాశ్రమం కాదు. సౌభారి మహర్షి భార్య మనోమయి. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమెను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనుకున్న క్రౌంచుడు, సమయం, సందర్భం కోసం వేచి చూడసాగాడు. ఆ సమయము రానే వచ్చింది. ఒకరోజు ఆశ్రమమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిద్రిస్తున్న మనోమయిని క్రౌంచుడు భుజాన వేసుకుని పరుగులు తీయసాగాడు. చటుక్కున మేల్కొన్న మనోమాయి కేకలు వేయడంతో, ఆశ్రమంలోని శిష్యగణమంతా ఒక్క ఉదుటున లేచి మనోమయిని కింద పడేసి పారిపోబోతున్న క్రౌంచిని పట్టుకుని గురువుకు అప్పగించారు. సౌభారి మహర్షికి జరిగిన సంగతి అంతా అర్థమైంది. గురుపత్నిని తల్లిలా భావించక, కామాంధ కారంతో ప్రవర్తించిన క్రౌంచుని గజముఖంతో నిశాచరుడవై బ్రతుకును వెళ్ళదీయమని శపించాడు. అప్పటికీ సౌభరి మహర్షి కోపం చల్లారక పోవడంతో రాక్షస జన్మనుంచి విముక్తి పొందినప్పటికీ ఎలుకవలె మిగతా జన్మలన్నీ వేల్లదీయక తప్పదని శపించాడు. గజముఖ రూపునిగా మారిన క్రౌంచుడు, శివుని ప్రార్థించి అనేక వరాలను పొంది, దేవతలను బాధించసాగాడు. దేవతలు విఘ్నవినాయనకుని దగ్గర మొరపెట్టుకోవడంతో గజముఖుని సంహరించాడు. అయినప్పటికీ గజముఖుని రూపం నుంచి విముక్తి పొందిన క్రౌంచుడు సౌభరి మహర్షి మరో శాపం ప్రకారం, ఎలుకగా మారి, వినాయకుని శరణు వేడి, ఆయన వాహనంగా స్వామి సేవను చేసుకుని, తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ఇంకా పలు పురాణాలలో ఈ మూషిక వాహనం కథ రకరకాలుగా గోచరిస్తుంటుంది. అణిగిమణిగి ఉండటమే అత్యుత్తమం అన్న విషయాన్ని వినాయకుని మూషికవాహనం మనకు తేటతెల్లం చేస్తోంది.

రథా రూఢుఢు
   గణేశపురాణంలో వినాయకుడు రథంపై ఆసీనుడై ఉండగా, ఆ రథాన్ని ఎలుక లాగుతోందన్నట్లుగా ఉంది.

సింహవాహనుడు
పంచముఖ హేరంబ గణపతి సింహవాహనుడు.

మయూర వాహనుడు
ఓ రాక్షసుని నెమలివాహనంపై వచ్చి వినాయకస్వామి సంహరించాడు. అందుకే ఆయన్ని మయూరేశ్వరుడు అని కూడ పిలుచుకుంటారు.

సర్వవాహనుడు
అత్యంత కిరాతకుడైన ఓ రాక్షసుని సంహరించేందుకై వినాయకుడు సర్పవాహనంపై అరుదెంచాడని ముద్గలపురాణం తెలియజేస్తోంది.

ఆశ్వవాహనుడు
రాక్షస సంహారం కోసం ఒకానొకప్పుడు గణపతి గుర్రంపై స్వారీ చేసుకుంటూ వచ్చాడట.

గజవాహనుడు
ఒకానొక సమయంలో గణపతికి తండ్రి శివునీతోనే పోరు మొదలవుతుంది. అప్పుడా స్వామి గజవాహనంపై తండ్రి ఎదురుగా వచ్చి నిలబడ్డాడని కథ. ఇలా ఆ స్వామి పలురకాలైన వాహనాలపై ఆసీనుడై కనబడుతుంటాడు. తేలువాహనంపై, చిలుకవాహనంపై, మేషవాహనంపై కూడ ఆయన్ని దర్శించుకోగలరు.

--------------------------------------------- 

పరమేశ్వరుని ఆరాధన


     సృష్టి మొత్తం ఒక నియమ పూర్వకమైన సువ్యవస్తతకు లోబడి నడుస్తోంది. గ్రహాలు, నక్షత్రాలు తమ తమ కక్ష్యలలో ఇరుసుమీద ఈమాత్రం అటూఇటూ దారి తప్పకుండా పరిభ్రమిస్తాయి. దివారాత్రులు, ఋతువులు మొదలగు వాటిలో ఒక నియమం ఏర్పడి ఉన్నది. కర్మ ఫలాలు ఒక దైవవ్యవస్తకు సంబంధించినవే. పాలు పెరుగుగా మారటానికి, విత్తనం మొక్కగామారటానికీ కొంతసమయం పడుతుంది. అదే విధంగా కర్మలననుసరించి మంచిచెడుల ఫలితం కొంతసమయం వెనుకా ముందుగానైనా నిశ్చితరూపంలో అందుతుంది. అలాకాని పక్షంలో ప్రపంచమంతా ఆటవిక న్యాయం రాజ్యమేలేది. నోరున్నవాడిమాటే చెల్లుబాటవుతూ, బలమున్నవాడిమాటే సాగుతూ వుండేది. కానీ అలాజరగటంలేదు.
     విధ్వాంసులు, ధనవంతులు కళాకారులూ పహిల్వానులు కాగలగాలి అనుకొంటే కృషిసాధన చేసి తీరాలి. కృషికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది. ఏజాతి విత్తనాలు నాటుతామో ఆ జాతి పంటనే కోరుకుంటాము. మధ్యం తాగినవాడికే నిషా తలకెక్కుతుంది. విషంతాగినవాడు ప్రాణాలు పోగొట్టుకొంటాడు. ఇదే కర్మఫలం యొక్క సునిశ్చిత వ్యవస్తకు ప్రత్యక్ష ప్రమాణం.
      ఏపనికైనా తాత్కాలంలోనే ఫలితం కనబడుతూ ఉంటే - అనగా దొంగతనం చేసిన వారి చేతులు చచ్చుపడి పోతుంటే, వ్యభిచారం చేసినవారి చేతులు చచ్చుపడి పోతుంటే - ఈ ధర్మాలు, కట్టుబాట్లు అవసరం అయ్యేవి కావు . భగవంతుని సాక్ష్యం పెట్టుకోవలసిన పనీ ఉండదు. మరి అటువంటప్పుడు ఈ అవకాశం మనిషికి ఎందుకు లభించింది? అతడు తన బుధ్ధి కుశలతను ఉపయోగించి వ్యవహరించాలని, తన గౌరవ గరిమను దృష్టిలో ఉంచుకొని సదాశ్యాన్ని కనపరుస్తూ, దుష్యర్మలకు దూరంగా ఉండాలని, కానీ జరిగేదంతా దానికి వ్యతిరేకం. మనిషి తప్పులమీద తప్పులు చేస్తూనే ఉంటాడు. మతి మరుపు అనే గుణం, నిర్లక్ష్య ధోరణి మనిషికి అనేక ఇక్కట్లను తెచ్చిపెడుతున్నాయి. మత్తు పదార్ధాల వల్ల కలిగే దుష్పరిణామాలను అనుభవిస్తున్న వారిని చూస్తూ కూడా, జంకులేకుండా ఆ వ్యసనాలకు తాను కూడా బానిస అవుతుంటాడు మనిషి. ఏది మనిషి తెలిసి చేస్తున్న గొప్ప పొరపాటు.
     ఆత్మ వికాసం అంతగా జరగక పోవడంతో - మనిషి ఉచితానుచితాలను తేడాను పట్టించుకోకుండా, వెనుకా ముందూ చూడకుండా మనసుకు ఏది తోస్తే అది చేయడమనే మరో పెద్ద తప్పు జరుగుతున్నది. స్వేచ్చాచరణ ఉదృత అహంకారానికి ప్రతిరూపం. పొగరుబోతు వ్యక్తి నియమాలను, ఆంక్షలను ఉపేక్షించి సంకుచిత స్వార్ధభావనా ప్రేరితుడై, ఏది చేయకూడదో అదే చేస్తుంటాడు. ప్రగతికి కావలసిన సమస్త సదుపాయాలు, సమస్త సంపదలు ఉన్నప్పటికీ జనులు వ్యధలలో, కష్టాలలో మునిగి తేలుతూ ఉండటానికి కారణం ఇదే. ఇతర ప్రాణులు హాయిగా సుఖజీవితాన్ని గడుపుతుండగా, మనిషిమాత్రం ప్రతినిమిషం సమస్యలతో , ఉద్విఘ్నతతో బ్రతక వలసి వస్తున్నది. ఈ స్వేచ్చారణ ఎలా ఆగుతుంది? వ్యక్తి సభ్యతతో అనుబంధితుడై ఎలా ఉండాలి? సమాజంలో పరస్పర సహకారం, సత్భావన ప్రసారం ఎలా ఉండాలి? ఏ ప్రశ్నలన్నింటికీ కలిపి ఒకే సమాధానం వస్తుంది. ఒక నియామక సత్తా యొక్క అస్తిత్వాన్ని నిజాయితీగా అనుభవం లోనికి తెచ్చుకోవడం, దానిని సర్వవ్యాపకమైనదిగా, సర్వ దర్శిగా భావించి, దాని న్యాయ నిష్టలపై స్తిరమైన విస్వాసముంచడం, వీటితోపాటు ఆసత్తాకు భగవంతునిగా పూజనీయతం ఇవ్వడం - ఇదే నిజమైన ఆస్తికత.
     భగవంతుని ఉనికిని అంగీకరించేవారు, అతడిని ఆరాధించేవారు అసంక్యాకంగా ఉన్నారు. అయితే, వారి పూజలు భ్రాంతులతో నిండి ఉంటాయి. అందువల్ల వాటికి సజ్జనత, ఉదారత మొదలైన రూపాలలో రావలసిన ఫలితాలు తగినంతగా రావడం లేదు.
     భగవంతుణ్ణి మానవులకుండె అన్ని దుర్భలతలు కలిగిన వ్యక్తిగా సామాన్యంగా మనుషులంతా ఊహించుకొంటారు, ప్రలోభాలతో ఆయనను ఉబ్బేయవచ్చని ఏమార్చవచ్చని భావిస్తారు. తధ్వారా తమ కోర్కెలు తీర్చుకోవడానికి రకరకాల పన్నాగాలు పన్నుతుంటారు. స్తోత్రపాటాలు చదువుతూ పూజ పేరుతో పూలు, పళ్ళు, కానుకలూ వంటివి అర్పిస్తుంటారు. అతడు తమవంటి గుణాలున్న వాడిని నమ్ముతారు కనుక - లంచాలకు లొంగుతాడని, పొగడ్తలకు పొంగిపోతాడని, తమకోర్కెలు తప్పక తీరుతాయని ఊహించుకొంటారు. ఒకపక్క పూజలు చేస్తున్నా, మరోపక్క మనసులో భగవంతుని ఉనికివల్ల అపనమ్మకం ఉండటం వల్లనే ఇన్నిరకాలు పూజా విధానాలు, మూఢాచారాలు ఏర్పడ్డాయి. ఎటుపోయి ఎటువచ్చినా కనీసం చెడు జరగకుండా వివత్తులేవీ మీదపడకుండాయఅయినా ఉంటాయని వాటిని పాటిస్తుంటాయని వాటిని పాటిస్తుంటారు తప్ప నిజమైనవిశ్వాసంతోకాదు. ఒకవేళ ఏదైనా మంచి జరిగితే, అదివారి భక్తి ప్రదర్శనకు ప్రతిఫలంగా భగవంతుడిచ్చిన వరదానమని అనుకోరాదు. ఎందుకంటే - భగవంతుని వద్ద అన్యాయానికి తావు లేదు. ఆయనవద్ద ఉన్నతులాదండం కచ్చితమైన న్యాయ సూత్రాలను అమలుచేస్తుంది. ప్రతిపనికీ నిస్పక్షపాతంగా ఫలితాలను నిర్ణయిస్తుంది కనుక వీరితప్పుల తడక వ్యవహారాలను, దురాలోచనలును ఆయన పట్టించుకోడు. పూజలకు ఆయన పొంగిపోడు.
     భగవంతునికి కొందరి యందు ప్రేమా మరి కొందరి యందు ద్వేషమూ ఉండదు. కొందరిని ఆశీర్వదిస్తూ మరి కొందరిని శపించదు.ఆయన విధించిన నియమాలను పాటించేవారు సుఖ సంతోషాలతో ఉంటారు. భగవంతుడు వారి యందు ప్రసన్నత కలిగి ఉన్నడన్నదానికి గుర్తు అదే. ఆయన పెట్టిన కట్టుబాట్లను ఉల్లంగించినవారు, చెడుమార్గం పట్టినవారు తమకర్మల దుష్పలితాలను అనుభవిస్తున్నారు, దీనిని భగవంతుని అప్రసన్నతగా భావించాలి. నిజానికి భగవంతుడు సర్వమునూ సర్వులనూ నియమిత అనుసాసనంలో బందించాడు. ఇతర ప్రాణులన్నీ ఈ అనుశాసనాన్ని సహజ సిధ్ధంగా పాలిస్తున్నాయి. మనిషిమాత్రమే వక్రమార్గం పట్టి అశాంతికి లోనవుతున్నాడు. భగవంతుడు ఎవరితోనూ ఖటినంగా వుండడు, మృదువుగానూ వ్యవహరించడు. కానుకలు మొక్కుబడులు ఇచ్చి ఆయనను పక్షపాత ధోరణిలో వ్యవహరింపచేయలేరు. అందుచేత ఆస్తికులైన వారి కర్తవ్యమేమిటంటే - భగవంతుని సర్వవ్యాపకునిగా న్యాయ నిర్ణేతగా అంగీకరించి, తమ అలోచనలు, సీలం విచ్చలవిడిగా ఉండకుండా, ఇతరులను విశృంఖలంగా నడుచుకొన నివ్వకుండా చూచుకోవాలి.
     భగవంతుని సామర్ధ్యాలు అనంతములు, ఆయన విభిన్న ప్రయోజనాల కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. వాటిలో మనిషి అంతరంగాన్ని ప్రభావితం చేసే ధార సజ్జనత, సదాశయత. దానిని సత్ప్రవృత్తుల సముచ్ఛయిని అని చెప్పవచ్చు. సూర్యుని వెలుగు, వేడి సోకుతూనే కమలములు వికసిస్తాయి. అదేవిధంగా పరబ్రహ్మయొక్క సాన్నిధ్యంకలగగానే మనిషి గుణ, కర్మ, స్వభాలు ఉత్కృష్టత అనే పరిమళం సోకి సుగంధభరిత మవుతుంది. భక్తి అంటే భావావేశం కాదు. అందులో భగవంతునికి చేరువకావాలన్న, ప్రగాఢమైన ఆకాంక్ష నిండి ఉండాలి. సర్వవ్యాపకమైన, అణువణువునా నిండి ఉన్న ఆ శక్తి సహజంగా తన వద్ద కూడా ఉంటుంది. వెలుపలి వాతావరణంలోనూ, అంతరంగంలోపలా కూడా నిండిఉన్నది. ఆఙ్ఞానం వల్ల ఆ శక్తి ఎక్కడో తమకు దూరాన ఉన్నట్లు భావించుకున్నారు. వివేకం, విఙ్ఞానం మేల్కొనగానే అది సర్వత్రా దృష్టిగోచరం అవుతూ ఉంటుంది.
     సర్వవ్యాపక సత్తా యొక్క వాస్తవిక రోపం నిరాకారమే అయినప్పటికీ, ధ్యాస ధారణ అనే ఆధ్యాత్మిక సాధన పూర్తి కోసం ఏదో ఒక రూపం ఉండక తప్పదు. మనిషి కల్పన దైవమును కూడా తనలాంటి అవయవాలు గలవిగా ఊహించుకొన్నది. అనేక సాంప్రదాయాలలో భగవంతుడు అనుయాయూల భక్తికి ప్రతిరూపంగా సృజింపబడ్డాడు. అందుకనే "ఏకం సధ్ విప్రా: బహుదావదంతి" అన్నట్లు- ఏకము అనేక రూపాలుగా దృష్టి గోచరమయ్యేది అని చెప్పబడినది. ఈ జగత్ భగవంతుని విరాట్ దృశ్యమాన స్వరూపం. అర్జుననకు, యశోదకూ, కౌసల్యకూ ఈరూపంలోనే భగధర్శనమయినది. భర్మ చక్షులతో ఈ రూపాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చూడవచ్చు. ఈ విరాట్ బ్రహ్మ పూజను స్వచ్చత, ప్రగతి, అలంకరణ రూపములలో చేయవలసి ఉంటుంది. అనగా ఈవిశ్వంలోని పరిసరాలను అందంగా రూపొందించడం, పంచభూతాలను (భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, జలం) కాలుష్య రహితంగా పరిశుభ్రంగా కాపాడుకోవడం, మానవులలో సమత, మమత, మానవతలను పెంపొందించడం మొదలైనవి భగవంతునికి ప్రీతికరమైన ఆరాధనలు - పూజలు.
     ఇప్పటికన్నా రాబోయే కాలం మరింత సమృధంగా, సమున్నతంగా, ప్రగతి శీలంగా, సుసంస్కృతంగా ఉంటుంది. అటువంటి కాలంకోసం అందరూ కలసి కృషిచేయాలి. అటువంటి భావనాశీల ప్రపంచాన్ని భగవంతుని ఉధ్యానవనంగా భావించి, తాను కర్తవ్య పరాయణుడైన తోటమాలిగా మారి, దాని ఉత్కర్షలో, అభ్యుదయలో తన కాలాన్ని, శ్రమను ఏకాగ్రతను, సాధనను వినియోగించాలి. దీనినే కర్మయోగమని అంటారు. గీతలో దీనిగురించి ప్రత్యేకంగా చెప్పబడినది.
    ఆస్తికతా భావన మనిషి విశృంఖలత మీద అంకుశంవలే పనిచేస్తుంది. ఒంటెను ముక్కుతాడుతో, గుఱాన్ని కళ్ళెంతో, ఏనుగును అంకుశంతో అదుపు చేస్తారు. సర్కసులోని జంతువులను రింగుమాస్టారు కొరడాతో భయపెట్టి కావలసిన పనులను నేర్పుతాడు. చెప్పినట్లు వినేలా చేసుకొంటాడు. అదేవిధంగా భగవంతుని యందున్న నమ్మకం మనిషిని చెడుమార్గాన నడవకుండా అదుపుచేస్తుంది. దేవుడు శిక్షిస్తాడన్న భయంతో మనుషులు తప్పుచేయడానికి జంకుతారు. సన్మార్గాన్ని ఎంచుకుంటారు. దానివలన సమాజపు వ్యవస్త సుస్తిరంగా ఉంటుంది.

--------------------------------------------- 

ఆధ్యాత్మిక వనంలో ఐదు ప్రాముక్యత!!

మన పురాణాలలో ఐదుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పంచాక్షరీ మంత్రంతో మొదలై పంచభూతాలు, పంచనదులు, పంచయజ్ఞాలు అంటూ ఐదు సంఖ్యతో కూడిన సంగతులు అనేకం! వాటిలో కొన్ని వివరాలు:
పంచామూర్తులు: శ్రీగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీపరమశివుడు, శ్రీపార్వతీదేవి, శ్రీచండీకేశ్వరుడు మొదలైన ఐదుగురు మూర్తులను శైవక్షేత్రాలలో పంచామూర్తులుగా పూజిస్తుంటారు.
పంచాయతనం: ఒకే పీఠం పై ఐదుగురు దేవతలను ఆవాహన చేసుకుని పూజించడం.
పంచమాతలు: తన తల్లి, గురువు భార్య, రాజు భార్య, తన భార్య తల్లి (అత్త)లను మాతలుగా భావించి పూజిస్తారు. అందుకే వీరిని పంచమాతలు అనంటారు.
పంచపితృమూర్తులు: జన్మనిచ్చిన తండ్రి, విద్య బోధించిన వ్యక్తి, మంత్రోపదేశం చేసిన వ్యక్తి, అన్నంపెట్టిన వ్యక్తి, భయాన్ని పోగొట్టిన వ్యక్తులను పంచపితృమూర్తులుగా భావిస్తారు.
పంచప్రతిష్ట: పాంచరాత్రాగమాన్ని అనుసరించి ఐదు రకాలైన ప్రతిష్ఠలు జరుగుతుంటాయి.
స్థాపన: నిల్చున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ
ఆస్థాపన: కూర్చున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ
మైస్థాపన: పడుకున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ
పరస్థాపన: వాహనాలపై పలు భంగిమలలో చేసే ప్రతిష్ఠ
ప్రతిష్ఠాపన: షణ్మార్చనతో చేసే ప్రతిష్ఠ
శివపంచాయతనం: మధ్యలో శివలింగాన్ని ప్రతిష్టించి చుట్టూవున్న ప్రదక్షిణంలో సూర్యుడు, వినాయకుడు, అంబిక విష్ణువులను ప్రతిష్టించి పూజించడమే శివ పంచాయతనం.

పంచయజ్ఞాలు: జల్లెడ, రుబ్బురోలు, చీపురు, రోలు, కుండ ఈ ఐదింటిని వాడటంవల్ల పాపం వస్తుంది. వీటి నివారణకు చేసే యజ్ఞాలను పంచమహాయజ్ఞాలనంటారు.
దేవయజ్ఞం: అగ్నితో హోమం చేయడం.
పితృయజ్ఞం: పితృకార్యాలను చేయడం.
భూతయజ్ఞం: జంతువులకు ఆహారాన్ని అందివ్వడం
మానుషయజ్ఞం: విందును ఇవ్వడం
బ్రహ్మయజ్ఞం: రోజూ వేదపఠనం చేయడం
పంచాహోమాలు:
గణపతి హోమం: అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరేందుకై చేసే హోమం.
చండీహోమం: దరిద్రం, భయాలు తొలగేందుకు చేసే హోమం.
నవగ్రహ హోమం: గ్రహదోషం తొలగేందుకు నవగ్రహ హోమం.
సుదర్శన హోమం: సమస్త దోషాలు తొలగేందుకు చేసే హోమం.
రుద్రహోమం: అయుర్ వృద్ధి, ఆరోగ్యం కోసం చేసే హోమం.

పంచయాగాలు:
కర్మయాగం:భగవంతునికి పూజ చేయడం.
తపయాగం:వ్రతం చేయడం.
జపయాగం:మంత్రాలను జపించడం.
ధ్యానయాగం:భగవన్నామాన్ని ధ్యానించడం.
మంత్రయాగం:వేదగ్రంథాలను పఠించడం.

పంచాతాండవం: ఆనందతాండవం, సంధ్యాతాండవం, త్రిపురతాండవం, ఊర్థ్వతాండవం, ముని తాండవం

పంచనాథ స్థలాలు:
కాశీ – శ్రీవిశ్వనాథుడు
గుజరాత్ – శ్రీసోమనాథుడు 
పూరి – శ్రీజగన్నాథుడు 
రామేశ్వరం – శ్రీ రామనాథుడు 
వైదీశ్వరం – శ్రీవైథీశ్వరుడు

పంచభగవతి స్థలాలు:
కొల్లూరు – మూకాంబిక
వడగరా  లోకాంబిక
పాల్ ఘాట్  హోమాంబిక
కొడూంగబారు – మహాభగవతి
కన్యాకుమారి – బాలాంబిక

పంచదేవి: దుర్గ, రాధ, లక్ష్మీ, సరస్వతి, సావిత్రిలను పంచదేవిలు అనంటారు.

పంచనదం: దూతపాప, కిరాణానది, ధర్మనది, గంగ, యమునా నదులను కలిపి పంచనదాలంటారు. ప్రస్తుత పంజాబ్ కూడ ఒకప్పుడు పంచనదం అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఐదు నదులు ప్రవహిస్తుంటాయి.

పంచపర్వాలు: ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానాలు.

పంచబ్రహ్మాసనం: భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. దృశ్యమానప్రపంచం వీటి వల్లే ఏర్పడుతోంది.

పంచలింగాలు:
పృథివీలింగం – కంచి

ఆపల్లింగం  జంబుకేశ్వరం
తేజోలింగం  అరుణాచలం
వాయులింగం – శ్రీకాళహస్తి 
ఆకాశలింగం – చిదంబరం

పంచవటం:  గోదావరి తీరంలో ఉంది. ఇక్కడ ఐదు వటవృక్షాలు (మర్రిచెట్లు) ఉండటంతో పంచవటి అని అన్నారు. ఈ ఐదు మర్రివృక్షాలు గత జన్మలో గంధర్వులు. అగస్త్యుడిని ఎటూ కదలకుండా చేయాలని ప్రయత్నించి, అతని శాపానికి గురై వృక్షాలుగా మారుతారు. శ్రీరామదర్శనంవల్ల శాప విమోచనమవుతుందని చేయుతాడు. ఇక్కడే రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు.

పంచాక్షరీ: నమశ్శివాయ అనే ఐదాక్షరాల మంత్రం.

పంచాయతనం: కాశీలోని శివుని విగ్రహం. శివుని ఐదు ఆత్మలు ఐదు ఆయతనాలు అవి: శాంతి, అతీత శాంతి, పరాపర విద్య, ప్ర్రతిష్ట, నివృత్తి.

పంచపాండవులు: పాండురాజు కుమారులు.

పంచత్రంత్రం: చిన్న పిల్లలకు జీవితమ పట్ల అవగాహన కలిగేందుకు విష్ణుశర్మ రాసిన కథల పుస్తకం.

పంచద్వారక: బద్రీనాథ్, పూరీ, అయోధ్య, ద్వారక, పండరీపురం.
---------------------------------------------
పంచాక్షరీ

        ఈశ్వరుని పంచముఖాల నుండి శ్రీశివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు (న శి వా య) అందులో నుండి పంచభూతాలు, వాటి నుండి ఈ సమస్త జగత్తు పుట్టిందని చెబుతారు. అందువల్లనే ఈ లోకాలన్నింటికీ పంచాక్షరీ మహామంత్రం తల్లిగా నిలిచి శుభాలను కలిగిస్తోంది.

దిశ
పేరు
మండలం
బీజాక్షరం
నిర్వహణ
శివుని ఊర్ధ్వముఖం
ఈశానం
ఆకాలమండలం
మోక్షం
శివుని పూర్వముఖం
తత్పురుష
వాయుమండలం
విరక్తి
శివుని దక్షిణముఖం
అఘోర
అగ్నిమండలం
సంహారం
శివుని ఉత్తరముఖం
వామదేవ
ఉదక మండలం
వా
పాలన
శివుని పశ్చిమ ముఖం
సద్యోజాత
భూమండలం
శి
సృష్టి
     
     ఆసేతు హిమాచలం శివారాధన వ్యాప్తమై ఉన్నది. వేదాలు, పురాణాలు, ఆగమాలు, కావ్యాలు, ధర్మశాస్త్రాలు కూడ శివతత్త్వాన్ని, శివయోగాన్ని బహువిధాలుగా విశదపరిచాయి.
       ఓంకారవదనే దేవి ’ ‘కార  భుజద్వయీ శికార దేహమధ్యాచ ’ ‘కార పదద్వయీ పంచాక్షరీ మంత్రానికి ఓంకారం ముఖం వంటిది. కార, ‘కారాలు బాహువులు. శికారం నడుము అయితే, ‘’, ‘కారాలు పాదయుగ్మములు.

నమశ్శంభవే చ మయోభవేచ నమశ్శంకరాయ చ
మయస్కరాయ చ నమశ్శివాయ చ శివ తరాయచ

అని నమకంలొ శంభు శంకర శివ అంటూ మూడు దివ్యనామాలతో, ఆ పరాత్పరుని కీర్తించాయి. శివయోగంసర్వోత్కృష్టమని, శాస్త్రాలు చెప్పడమేకాదు, కాశ్మీరశైవం, శుద్ధ శైవసిద్ధాంతం, వీరశైవం, పాశుపతం, మిత్రశైవం వంటి అనేక సంప్రదాయాలు మన భారతదేసమంతా వ్యాప్తి చెంది ఉన్నాయి.
     ‘శివశబ్దానికి అనేక నిర్వచనాలున్నాయి. శుభం, క్షేమం, శ్రేయం, మంగళంఅని కొన్ని అర్థాలు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీతమైన ధ్యానావస్థలో గోచరించే తురీయతత్త్వమే శివుడు. శాంతమే శివుడు. అదే శివతత్త్వం. అన్నింటికీ ప్రకాశవంతం చేసే మూలచైతన్యమే శివుడు. వశి శివ సమస్తాన్నీ తన వంశంలో ఉంచుకున్న వాడే సర్వేశ్వరుడు. అతడే ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులతో కూడిన పరమేశ్వరుడు, సర్వ జగత్కారణుడు, ఆ తత్త్వమే ఆయన పంచాముఖాలలో గోచరిస్తుంటుంది. 

--------------------------------------------- 

శ్రీ పంచముఖాంజనేయ అవతారం
 


ఈస్వామి ఐదుముఖాలతో, పది భుజాలతో, పది ఆయుధాలను ధరించి దర్సనమిస్తుంటాడు. తూర్పున వానరముఖం, దక్షిణాన నారసింహ ముఖం, పశ్చిమాన గరుడముఖం, ఉత్తరాన వరాహముఖం, పైభాగంలో హయగ్రీవ వదనంతో ఈ స్వామి విలసిల్లుతుంటాడు. ప్రతి ముఖంలో త్రినేత్రుడై ప్రకాశిస్తుంటాడు. స్వామి పది చేతులలో 1.కత్తి,
2.ఢాలు,
3.పుస్తకం,
4.అమృత కలశం,
5.అంకుశం
6.గిరి,
7.హలము,
8.కోడు,
9.సర్పము,
10.వృక్షము కనిపిస్తుంటాయి. ఈ ఆయుధాలన్నీ శత్రువుల గర్వాన్ని అణచి, జ్ఞానదీపాన్ని వెలిగించి, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసేవే. ఇది ఆంజనేయుని పరిపూర్ణరుద్రావతారం. ఈ అవతార మూర్తిని విభీషణుని కుమారుడైన నీలుడు లంకారాజ్యానికి యువరాజుగా పరిపాలన చేస్తున్న సమయం. అత్యంతబల సంపన్నుడైన నీలుడు సమస్త విద్యలలో పండితుడు. ధర్మాచరణంపట్ల అనురాక్తిగాలవాడు. సంపదలలో కుబేరునికి దీటైనవాడు. అయినప్పటికీ నీలునికి తృప్తి కలుగలేదు. అతని మనసులో ఇంకా ఐశ్వర్యాన్ని సేకరించాలన్న తపన, ఒకరోజు నీలుడు తండ్రి విభీషణునితో, “తండ్రీ! మనకు సంపదలకు, వైభావాలకు లోటు లేదు. కానీ, ఎంత ఉన్నప్పటికీ, మన దగ్గర చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు లేవు. అవి లేకపోవడం నా మనసెంతో వేదనకు గురవుతోంది. విష్ణుస్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తికి నువ్వు భక్తుడవు. నీకు ఆ మహనీయుడు ఆరాధ్యదైవం. అయినప్పటికీ, నువ్వు వాటిని సాధించాలేకపోయావు. వాటిని నువ్వెందుకు పొందలేకపోయావు? అయితే, నువ్వు నాకిప్పుడు అనుమతినిస్తే క్షణకాలంలో వాటిని సాధించి తీరుతాను. నన్ను ఆశీర్వదించు తండ్రీ!అని పలికాడు.

    కొడుకు మాటలు విన్న విభీషణుడు, “పుత్రా! రామభక్తిని మించిన సంపదలు మనకెందుకు? ఆ మహనీయుని అనుగ్రహం ఉంటే చాలు, అదే మనకు సర్వానందదాయకమైంది. దానిని మించిన సిరిసంపదలతో మనకేమి పని? అంతకు మించి పేరు పెన్నిధులు మనకెందుకు? చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు రామభక్తికి సరితూగేవి కావు. అందువల్లనే వాటి పట్ల నాకు అనురక్తి లేదు. వాటిపై నీకు అమిత ఇష్టం అయినట్లయితే, వాటిని నువ్వు సాధించుకో. అయితే ఒక విషయం, మన భూలోకవాసులం కనుక అవి మనకు సులువుగా లభించవు. వాటిని పొందాలంటే దైవశక్తిని సంపాదించాలి. దైవశక్తి కావాలంటే దేవతలను ఆరాధించాలి. అందుకై ముందుగా గురువులను ఆరాధించి, వారి ఆశీస్సులను పొందాల్సి ఉంటుంది. తద్వారా లోకోత్తరశక్తులను పొందగలిగితే, అటుపై నీ కోరిక నెరవేరుతుందిఅని హితవచనాలను పలికాడు.
     తండ్రి ఆజ్ఞను శిరసావహించిన నీలుడు, తండ్రికి ప్రదక్షిణ నమస్కారాలను చేసి, కులదైవమైన శుక్రాచార్యుని ఆశ్రయించి పన్నెండు సంవత్సరాలు భక్తిప్రపత్తులతో సేవించి, గురువును ఆనందపరిచాడు. నీలుని మనసులోని కోరికను మన్నించిన శుక్రుడు, “నాయనా, నీలా! నీ కోరిక నెరవేరాలంటే, అందుకు తగిన పరమాద్భుతమైన మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రం శ్రీరామచంద్రుని పరమభక్తాగ్రేసరుడైన ఆంజనేయుని పరమ పవిత్ర మంత్రరాజము. దానికితోడు ఒక వ్రతం గురించి కూడ చెబుతానూ. ఆంజనేయుని అవతారాలలో పంచముఖ ఆనంజనేయుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, ఎంతటి అసాధ్యమైన పని అయినప్పటికీ సుసాధ్యమవుతుంది. అంటే, సాధించలేనిదంటూ ఏమీ ఉండదు" అని తెలిపి, దివ్యమైన హనుమ మంత్రాన్ని నీలునికి బోధించి, వ్రతం కూడ చేయించాడు. నీలుడు శుక్రుని ఘనంగా సత్కరించి, ధ్యాన నిమగ్నుడయ్యాడు.
    కొంతకాలం తరువాత నీలుని ప్రార్థనకు సంతుష్టుడైన హనుమంతుడు, పంచాముఖాంజనేయ రూపంలో నీలునికి దర్శనమిచ్చాడు. నీలుని బహువిధాలుగా స్వామిని స్తుతించగా, నీలుని మనసెరిగిన ఆంజనేయుడు, “భక్తా, నీలా! నీ కోరిక త్వరలో నేరావేరుతుంది. నువ్వు నా పరమభక్తుడవు. నీ తండ్రి అత్యంత మిత్రుడు. ఆత్మబంధువుకంటే ఎక్కువ. ఆందుకే నువ్వు నాకు అత్యంతప్రీతి పాత్రుడవు. నువ్వుకోరుకున్న విధంగానే చింతామణి మొదలైన దివ్యసంపదలు నీకు సొంతమవుతాయి. వాతితొపాటు శీలసౌందర్యాది విశేషగుణ  నిధియైన వసుందరిని కూడ పొందగలవు. అందుకే ఈ పవిత్రక్షేత్రం నీ పేరుతో నీలాద్రిగా వ్యవహరింపబడుతుందిఅని నీలుని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. తన కోరికలను సిద్ధింపజేసుకున్న నీలుడు గురువు శుక్రుడు, తల్లిదండ్రులకు మొక్కి, వారి ఆశీర్వాదాలను అందుకున్నాడు. అనంతరం దేవలోకంపై దండయాత్ర చేయ సంకల్పించిన నీలుడు, ఇంద్రుని వద్దకు దూతను పంపి తన ఉద్దేశ్యాన్ని వినిపింపజేసాడు. ఓయీ ఇంద్రా! గతంలో మా పెద్దనాన్న కొడుకు చేతిలో పరాజితుడవై బందిపబడ్డావు. ఇప్పుడు విభీషణుని కుమారుడనైన నేను, నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను.  నాతో యుద్ధం చేసి పరాభింపబడతావా? లేక చింతామణి, కామధేనువు, కల్పతరువు మున్నగు సంపదలను ఇస్తావా? ఏది ఏమైనా, నువ్వు నాతో యుద్ధం చేయలేవు కనుక, ఆ దివ్యరత్నాలను నాకివ్వు, బ్రతికిపో. నీలుని సందేశాన్ని విన్న ఇంద్రుడు మండిపడ్డాడు. ఎంతోమంది రాక్షసులను తుదముట్టించాను. ఈ నీలుడు నాతో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. నీలునికి నా వజ్రాయుధసామర్థ్యం తెలిసినట్లు లేదు. వందల, వేల కోట్లకొలది రాక్షసులను నా వజ్రాయుధం సంహరించింది. అదలావుంటే, నీలుడొకలెక్క?! అందుకే ఈ దూతను శిక్షించి, పరాభావించి పంపించండి" అని ఇంద్రుడు ఆజ్ఞాపించడంతో దేవతలు రాయబారిని పంపారు. రాయబారి నీలునికి ఈ ఉందంతాన్ని చెప్పగా, ఆగ్రహించిన నీలుడు దేవలోకంపై యుద్ధభేరిని మోగించాడు.
     దేవతలకు, రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. కామరూప విద్య పాండిత్య ప్రవీణులైన దానవుల మాయోపాయాలకు దేవతలు ఎదురొడ్డి నిలువలేకపోయారు. ఇంద్రుడు రెట్టించిన పౌరుషంతో నీలుపైకి ఉరికి, “ఓయీ! నీలా! వాలి నా పుత్రుడు. అతడు నీ పెదనాన్న చంకలో పెట్టుకుని సప్త సాగరాలలో ముంచగా, ఎలాగో ప్రాణాలను దక్కించుకుని బ్రతికిన విషయం నీకు తెలియదా?!” అని ఇంద్రుడు చెబుతుండగా, నీలుడు మరింతగా రెచ్చిపోయి యుద్ధాన్ని చేయసాగాడు. నీలుడు ప్రయోగించిన అస్త్రాలను ఇంద్రుడు భగ్నం చేయగా, ఇంద్రుని వజ్రాయుధాన్ని నీలుడు ఒక్క బాణంతో అణిచి వేశాడు. ఇంద్రుడు అంకుశంతో విజృభించగా, నీలుడు దానిని గదాఘాతంతో ఖండించాడు. అనంతరం నీలుడు పదునైన కత్తిని చేతబూని ఇంద్రుని శిరస్సును ఖండించేందుకు ముందుకు ఉరకగా, అక్కడ ప్రత్యక్షమైన బ్రహ్మ నీలునితో, "ఓయీ నీలా! నీ తండ్రి రామభక్తుడు, రాముడంటే శ్రీమహావిష్ణువే. ఆ మహావిష్ణువుకు సోదరుడు. ఈ ఇంద్రుడు. అందువల్ల ఇతడు నీకు మిత్రుడేగానీ, శత్రువుకాదు. ఇతనితో తగవులాట వద్దు. ఇద్దరూ స్నేహితులుగా మసలండి. నీ కోరికను నేను నెరవేరుస్తాను. చింతామణి వంటి దివ్య వస్తువులన్నింటిని నేను అనుగ్రహిస్తాను. నీకు మరో విషయాన్ని చెబుతాను. శ్రద్ధగా విను.
    పూర్వం అత్రిమహాముని హిమాలయ పర్వత సానువుల్లో సంచరిస్తుండగా, ఆ మహనీయుని నేత్రాల నుండి దివ్యతేజస్సు వెలువడింది. ఆ తేజస్సు, అందులోని వృక్షాలతో కూడి పలురీతులుగా వ్యాపించింది. వాయుదేవుడు ఆ దివ్యతేజాన్ని రెండు రాశువులుగా విభజించగా, అందులో నుంచి సౌందర్యనిధియగు చంద్రుడు ఉద్భవించాడు. రెండవ రాశి నుంచి త్రిభువన సుందరియైన వనసుందరి జనించింది. ఆ సౌందర్యవతి మధువుతో పెంచబడింది. అమృతస్వరూపిణి కాబట్టి దివ్యమణులతో పాటుగా కన్యామణి కూడ గ్రహించి సుఖించు. నువ్వు పంచముఖ ఆంజనేయుని ఆరాధించనందువల్ల మాకు కూడ గౌరవ పాత్రుడవయ్యావు అని చెప్పాడు.  బ్రహ్మ ఇలా చెప్పడమే కాక, మహత్తర శక్తి సంయుతమైన హనుమద్ర్వతాన్ని ఉపదేశించాడు. ఇంద్రునిచే చింతామణి మొదలైన దివ్యమైన వస్తుసంపదల తోడుగా సౌందర్యరాశియైన వనసుందరిని కూడ అర్పింపజేసాడు. ఆవిధంగా హనుమదనుగ్రహం వలన ప్రాప్తించిన సంపదలతో నీలుడు హనుమద్భక్తులలో అగ్రగణ్యునిగా వెలుగొందాడు. నీలునికి హనుమంతుడు మాఘమాసం ఆర్ధ్ర నక్షత్రంతో కూడిన దినంలో ప్రత్యక్షమయ్యాడు. అలాగే లంకలో సీతాదేవికి పంచాముఖాంజనేయ రూపాన్ని స్వామి ప్రదర్శించినట్లు మనకు తెలుస్తోంది. రావణవధ జరిగిన అనంతరం, లోకాలకు దుష్టరాక్షసపీడ విరగడైందని శ్రీరామచంద్రుడు తృప్తిపడుతున్న సమయంలో ఆకాశవాణి ఈ తీరుగా పలికింది. శ్రీరామచంద్రా! రావణసంహారం జరిగిందని నువ్వు తృప్తి పడుతున్నావు. అంతటితో నీ కర్తవ్యం ముగియలేదు. గగనతలాన వేలవేల యోజనాల దూరంలో శతకంఠుడనే రాక్షసుడు తిరుగూన్నాడు. కడు దుష్టుడైన ఆ రాక్షసుడు, మహాబలశాలి. ఎవరినైనా ఎదిరించి నిలువగల అసాధ్యుడు. నువ్వు వాడిని కూడ సంహరించితేనే నీ అవతారానికి పూర్ణత్వము సిద్ధించినట్లవుతుంది”. ఆకాశవాణి పలుకులను విన్న రాముడు దీర్ఘాలోచనలో పడి, చివరకు ఆ రాక్షస సంహారానికి అంజనేయుడే తగినవాడని నిర్ణయించి, హనుమను పిలిచి, “హనుమా! ఆకాశవాణి పలుకులను విన్నావు కదా! రావణ సంహార విషయంలో నీవెంతో సాయపడ్డావు. శతకంఠుని సంహార విషయం గురించి కాస్త ఆలోచించు, ఇందుకు నువ్వు సమర్థుడవు" అని ప్రేరేపించాడు.
      శ్రీరామ ఆజ్ఞను తలదాల్చిన ఆంజనేయుడు శతకంఠుని సంహరించే కార్యక్రమానికి ఉపక్రమించాడు. వెంటనే తన తోకను వేయి యోజనాల దూరానికి పెంచాడు. తన రూపాన్ని విపరీతంగా పెంచడంతో, సముద్రాలన్నీ కప్పి వేయబడి, భువి నుంచి దివికి దారి ఏర్పడటమేకాక, ఆకాశంలో నక్షత్రాలన్నీ హనుమంతుని శరీరంపై, దర్భలపై నీటిబిందువుల్లా గోచరించాయి. అప్పుడు ఆంజనేయునికి అంతరీక్షంలోగల శతకంఠుని నగరం కనబడింది. దాని ప్రాకారాలు భగభగమని మండే అగ్నిగోళాలవలె ఉన్నప్పటికీ, వాయునందనుడు దానిని పెకలించి సముద్రంలోకి విసిరేసాడు. శ్రీరామచంద్రుని సైన్యమంతా తన తోకపై నడిచేత్లు చేసి అంతరిక్షపురానికి చేరుకునేట్లు చేసాడు. అలా అందరూ శతకంఠుని నగరానికి చేరుకున్నారు. అప్పుడు శ్రీరామునికి, శతకంఠునికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో ఆ రాక్షసుని తలలను ఖంఢిస్తున్నప్పటికి, ఆ తలలు తిరిగి జనించసాగాయి. అప్పుడు ఆ రాక్షసుని రక్తపుబొట్లు నేలపై పడుతుండగా, వాటి నుంచి లెక్కకు మిక్కిలిగా శతకంఠులు ఉద్భవించసాగారు. వాతితో పోరాడిన శ్రీరాముడు విసికి వేసారిపోయాడు. ఆయన పరివారం నీరసించింది. అనేకులు మూర్చిల్లారు. అప్పుడు శ్రీరాముని చూసిన సీత భయపడింది. మార్గానంతరం తెలియక చింతించసాగింది.
      సరిగ్గా అక్కడకు గర్గముని వచ్చాడు. ఆయన సీతను చూసి, హనుమంతుని ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి భయాన్ని పోగొట్టాడు. సీతాదేవి ఆ మంత్రాన్ని నిష్టతో జపించగా, హనుమంతుడు శక్తియుక్తులతో పరిపూర్ణుడై విజృభించాడు. ఆంజనేయస్వామి పంచముఖం మూర్తియై వెలుగొందుతూ రాక్ష్సుని మాయాశక్తులను వీక్షిస్తూ, అతని కదలికలన్నింటిని అరికట్టేడు. ఆయన ప్రతి వదనంలో మూడేసి కళ్ళున్నాయి. దశ భుజాలలో దశ విధ ఆయుధాలను ధరించి ప్రళయకాల రుద్రుడై విహరించాడు. శతకంఠుడు పలువిధాలైన రూపాలను ధరించగా, ఆంజనేయుడు కూడ అన్ని రూపాలను ధరించాడు. సీతామాతను కూడ యుద్ధం చేయాల్సిందిగా ప్రార్థించాడు. ఆంజనేయుని అభ్యర్థనను విన్న సీతాదేవి పతిదేవుని తలచుకుని శక్తి స్వరూపిణియై, శక్తివంతమైన అస్త్రాన్ని సంధించింది. శతకంఠుడు స్త్రీ చేతిలో మరణించాల్సి ఉన్నందున, సీత వదిలిన దివ్యాస్త్ర ప్రభావానికి నేలకొరిగాడు. ఇదే పంచముఖాంజనేయస్వామి మహిమాన్విత గాథ.
---------------------------------------------
జ్ఞాననేత్రం!
       మన కళ్ళతో చుట్టూ పరికించినపుడు, సూక్ష్మపరిశీలను చేస్తే సృష్టిలోని సూక్ష్మాతిసూక్ష్మాలన్నీ గోచరిస్తాయి. అలాగే బ్రప్మండంగా ఆలోచిస్తే, ఈ సృష్టిలో అతి పెద్దదైన శూన్యం కనబడుతుంది. కొన్ని ప్రదేశాలు నక్షత్రమండలాలతో ఉంటూ మిగతా విశ్వమంతా అనంతశూన్యమే కనబడుతుంది. ఆ శూన్యం అందరి దృష్టికి రాదు. ఆ అనంత శూన్యమే శివఅనబడుతుంది. నేతి ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడ ప్రతీ వస్తువు శూన్యంలోనుంచే ఉద్భవించి, శూన్యంలోనే లయమవుతున్నట్లు చెబుతోంది. ఇది శివుని విషయంలో పరిశీలించగా, ఈ అనంత శూన్యమే మహాదేవుడు అని తెలుస్తోంది.
      మనం శుభం కోరుకుంటూ భగవంతుని ఓ వెలుగుగా భావిస్తాము. కానీ, మనం ఆ పరిధి దాటి జీవితాన్ని శొధిస్తే, శూన్యంలో ఉండే దైవత్వం తెలుస్తుంది. ఈ భూమిపై మనకు తెలిసిన కాంతి సూర్యుడు మాత్రమే. ఆ సూర్య కాంతిని కూడ చేతిలో ఆపి, చీకటిని లేక చీకటినిఛాయను చేయవచ్చు. కానీ, చీకటి అన్నిచోట్ల అల్లుకుని ఉంటుంది.
       కొందరు ఈ చీకటిని భూతంగా వర్ణిస్తారు. కానీ,  దైవత్వం అన్నిచోట్ల వ్యాపించి ఉన్నదని తెలిసినవాడు, ఆ దైవత్వమే ఈ అందకారమని తెలుస్తుంది. ఎందుకంటే, విశ్వమంతా అంధకారం కనుక, వెలుగు అనేది ఒక మూల నుంచి వస్తుంది. ఆ మూలం మండుతుంటుంది. ఆ మంటకు ఆద్యంతాలున్నాయి. ఆ మూలకు ఓ నియమిత పరిమాణం ఉంది. కానీ, చీకటికి మూలం లేదు. దానికి అదే ఆధారం.
    అందువల్ల శివఅంటే విశ్వంలోని శూన్యం. ఈ శూన్యం నుండే సృష్టి వచ్చింది. అంటా శివమయం.
      శివరాత్రిరోజు శివుడు చలనరహిత, నిశ్చల, నిర్మల స్థాణువైనరోజు, కనుక సన్యాసులు మహాశివరాత్రి అచేతన దినంగా భావిస్తారు.
       మహాశివరాత్రిరోజు, సంవత్సరంలోని మిగిలిన రోజులన్నింటినీ తలపించేరోజు. ప్రతినెల కృష్ణపక్షంలో 14వ రొజు శివరాత్రి దినమని మనకు తెలుసు. ఆధ్యాత్మికులు ఈరోజు ప్రత్యేక సాధనలు చేస్తారు. ఎందువల్లనంటే, నెలలో వచ్చిన ఈరోజున అనేక శక్తులు శరీరంపై ప్రభావాన్ని చూపుతాయి.
        మహాశివరాత్రి రోజున నడుమును నిటారుగా వుంచి స్థిరాసనంలో కూర్చున్నవారు స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆరోజున నడుమును అడ్డంగా ఉంచి, శయస్థితిలో ఉన్నట్లుగా చేస్తే ఏటువంటి ఫలితం ఉండదు. ఆరోజున సహజంగా మన శర్శేఎరంలో జీవశక్తి (ప్రాణశక్తి) ఊర్థ్వముఖంగా పయనిస్తుంది. అప్పుడు పంచభూతాలు మనకు సహకరిస్తాయి. అలా ప్రాణశక్తి ప్రవహించడం వల్ల మానవునికి సర్వవికాసాలు, శక్తులు సిద్ధిస్తాయి. మానవుడు అప్పుడు అమితానంద స్థితిని చేరుకుంటాడు. ఆధ్యాత్మిక సాధనలో చేసే ప్రతిసాధన, ఇలా ప్రాణాధారశక్తి శరీరంలో ఊర్థ్వముఖముగా ప్రవహించడానికే.
       ఈ దైవత్వాన్ని మనం అనుభవించాలంటే మనలోని శక్తులను అతి బృత్తర రూపంలోనూ, అతి సూక్ష్మరూపంలోనూ దర్శించగలగడమే. మహాశివరాత్రినాడు భూమి యొక్క ఉత్తరగోళంలో ప్రత్యేకమైన స్వాభావిక మార్పులు ఏర్పడతాయి. వాటిని మన శరీరంలోని ప్రాణాధార శక్తి ఊర్ధ్వముఖంగా పయనింపజేయడాన్నిగమనించవచ్చు. ఈ శక్తిని పొందడానికి నిశ్చలంగా నడుమును నిటారుగా ఉంచి స్థిరంగా కూర్చోవడమే. జీవశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం జీవరాశులకు అడ్డంగా, మానవులకు నిలువుగా వెన్నెముకను పెట్టి నడవడం. ఆ తర్వాతనే మానవునిలో తెలివి వచ్చింది. కనుక శివరాత్రినాడు నడుమును నిటారుగా ఉంచి మేల్కొని ఉంటే సత్పలితాన్ని పొందగలం. ఈవిధంగా ఉండి జీవశక్తిని ఉపయోగించు కుంటే మరియు మంత్రోచ్చారణ లేక ధ్యానం చేస్తే దివ్యత్వానికి దగ్గరగా చేరుకోగలం.
       అలాగే భారతీయ సంస్కృతిలో ఒకానొకప్పుడు ఒక సంవత్సరంలో 365 పండుగలు ఉండేవి. అంటే, సంవత్సరంలో ప్రతిరోజూ పండుగే. ఈ పండుగలు అనేక కారణాలవల్ల, అనేక జీవితావసరాల కోసమై ఏర్పడినాయి. అనేక పండుగలు చారిత్ర్యాత్మక సందర్భాలలో, శత్రువిజయాలకో, జీవిత పరమార్థాలకో, లేక పంటలు చేతికి వచ్చిన సందర్భాలలోనో జరుపబడుతున్నాయి. విత్తనాలు ఇంటికి వచ్చినప్పట్నుంచి, పంట చేతికి వచ్చేంతవరకు పండుగలు ఉండెవి. కానీ, మహాశివరాత్రి ప్రత్యేకత, ఆవశ్యకత వేరు.  మహాశివరాత్రి ఆధ్యాత్మికావాదులకు, ప్రపంచాభిలాషగల వారికి చాలా అవసరం. మనం శివఅనగానే ఓ దేవుని రూపాన్ని ఊహించుకుంటాం. అది అన్నింటికన్నా అతీతం. శివపురాణంలో శివుని జీవన గమనం మామూలు మనిషి జీవనంవలెనే కనబడుతుంది. ఆయన ఒకే సమయంలో అనేక రూపాలలో కనబడుతుంటాడు. ఆయన అతిసుందరుడు అనాకారి, గొప్పసన్యాసి గృహస్తు కూడ. ఒకే సమయంలో అన్ని కలిగినవాడు. ఆ పరమశివుని నమ్ముకుంటే ఈ జీవితచక్రాన్ని అధిగమించినట్లే. గృహస్తులంతా ఆయన్ని, ఈ మహాశివ రాత్రిని శివుని వివాహదినంగా భావించి కొలుస్తారు. సన్యాసులు, తాపసులు ఈ దినాన్ని శివుని అత్యంత అచేతన రూపదినముగా కొలుస్తారు. అనంతకాల తపఃశక్తి వలన శివుడు అచేతనుడైయ్యాడు. ఆయన చాల అచేతనుడైన శుభదినమే ఈ శుభరాత్రి, మహాశివరాత్రి. కాబట్టి మహాశివరాత్రి నాడు మనం చేయవలసినవి:

1. సాష్టాంగస్థితిలో పరుండరాదు. నడుమును నిటారుగా ఉంచి కూర్చోవలెను.
2. అలా ఉన్నంతమాత్రాన సరిపోదు. మనం మన ఉనికిని గుర్తించలెనంత స్థితికి చేరుకొనవలెను. ఇలా చేసినపుడు మనకు, ఈ జీవితం ఓ కొత్తకోణంలో కనిపిస్తుంది. ఫలితంగా ప్రతి విషయంలో ఓ స్పష్టత ఏర్పడుతుంది. ఇలా జీవితంలొ కొత్తదృష్టిని ఏర్పరచుకోనిదే శివ దర్శనం దుర్లభం. శివరాత్రిన ఆ ఆవకాశం లభిస్తోంది.

--------------------------------------------- 

ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం

సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసం
భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రప్రద్యే
శ్రీశైల శృంగే విబుధాతింసంగే తులాద్రితుంగే పి ముదావసంతం
త మర్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం
అవంతికాయం విహాతావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం
అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం
కావెరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంతమోంకార మీశం శివమేకమీడే
పూర్వోత్తరే ప్రజ్జ్వలికా నిధానే సదా వసంతం గిరిజాసమేతం
సురాసురాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తం మహం నమామి
యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషి తాంగం వివిధైశ్చభోగైః
సద్భక్తిముక్తి ప్రదమీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే
మహాద్రిపార్శ్వే చ తటేరమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్ష మహోరగాద్వైః కేదారమీశం శివమేకమీడే
సహ్యద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్ర దేశే
యద్దర్శనా త్పాతకమాశునాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే
సుతామ్రపర్ణీ జలరాశియోగే నిబధ్యసేతుం విశిఖై రసంఖ్యైః
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి
యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ
సదైవ భీమాది పద ప్రసిద్ధం తం శంకరం భక్తిహితం నమామి
సానంద మానంద వనే వసంత మాననందకందం హతపాపబృందం
వారాణసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం
వందే మహోదారతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే
జ్యోతిర్మయ ద్వాదశాలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ
స్తోత్రం పఠిత్వామనుజోతి భక్త్యాఫ్లం తదాలోక్య నిజం భజేచ్ఛ

   జ్యోతిస్వరూపుడైన మహేశుడు ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని నాలుగుదిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి. సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాతతీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద  ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్ర్యంబకేశ్వర లింగం, నర్మదాతీరానా ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు). ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాలలింగము. తైత్తీరీయోపనిషత్తుననుసరించి 
1. బ్రహ్మ 
2. మాయ 
3. జీవుడు 
4. మనస్సు 
5. బుద్ధి 
6. చిత్తము 
7. అహంకారము
8. పృథ్వి 
9. జలము 
10.తేజస్సు 
11. వాయువు 
12. ఆకాశం 
        ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. ఖాట్మండులోని పశుపతినాథలింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలొ ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలొ ప్రస్ఫుటమవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దలవాక్కు.


1. సోమనాథ జ్యోతిర్లింగం

     స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు. తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్నీ మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్తలోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు. బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించిన చంద్రుడు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొక కళ చొప్పున పెరుగుతుందని అనుగ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర, అతని కీర్తిదిశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ్ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు.

2. మల్లిఖార్జున జ్యోతిర్లింగం
    శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి కోపోద్రిక్తుడై తల్లిదండ్రులను వదలి, క్రౌంచపర్వతానికి చేరుకోగా, కుమారుని వదలి ఉండలేని పార్వతీపరమేశ్వరులు ఈ ప్రాంతంలోనే ఆగిపోయారని పురాణ కథనం. అందుకే "శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండద"ని అంటారు. అలాగే పర్వతుడనే ఋషి తపఃఫలంగా పరమశివుడు ఇక్కడ లింగరూపంలో ఆవిర్భవించాడని మరోకథనం.
కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణా దరుణాచలే
దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే
     కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిదాయకాలు. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో అరణ్యవాసానంతరం పాండవులు, శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామివారిని దర్శించుకున్నట్లు పురాణ కథనం. సీతారాముల రామసహస్రలింగం, సీతాసహస్రలింగాలను ప్రతిష్టించినట్లు ప్రసిద్ధి. ఈ కలియుగంలో ఆదిశంకరాచార్య, ఆచార్యనాగార్జునుడు, కృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వంటివారెందరో స్వామిని దర్శించుకుని పూజలు జరిపించారు.

3. మహాకలేశ్వర జ్యోతిర్లింగం

    పరమేశ్వరునికి స్మశానమంటే అత్యంత ఇష్టం. ఈ భూమిపైనున్న సిద్ధక్షేత్రాలలో నైమిశారణ్యం పుష్కరం కురుక్షేత్రం ముఖ్యమైనవి. కురుక్షేత్రం కంటే పదిరెట్లు కాశీ పుణ్యప్రదమైనది. కాశీ కంటే మహాకాలవనం పదిరెట్లు గొప్పది. తీర్థాలలో అత్యుత్తమైనది ప్రభాసం శ్రీశైలం దారుకావనం. వీటన్నికంటే మహాకాలవనం గొప్పది. ఎందుకంటే, స్మశానం ఎడారి పాలంపీఠం అరణ్యం అంటూ ఐదు ఒకేచోట ఉన్న ప్రదేశం ఉజ్జయిని.
పూర్వం వేదప్రియుడనే శివభక్తునికి దేవ ప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనే నలుగురుకుమారులుండేవారు. ఈ నలుగురు కూడా శివభక్తులే. ఇదిలా ఉండగా, రత్నమాల పర్వతంపై నివసిస్తున్నా దూషణాసురుడనే రాక్షసుడు, వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ, అందరినీ హింసిస్తూండేవాడు. ఆ రాక్షసుని బాధలను తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించాగా, శివుడు మహాకాలుడై ఆవిర్భవించి, దూషణాసురుని,అతని సైన్యాన్ని భస్మం చెసాడు. అప్పట్నుంచి ఉజ్జయినీ నగరంలో విలసిల్లుతున్న మహాకాలేశ్వరుడు త్రిభువన లింగాలలో ప్రసిద్ధునిగా వెలుగొందుతున్నాడు.

4.ఓంకారేశ్వర జ్యోతిర్లింగం
        ఒకసారి వింధ్యపర్వతం తనకంటే గొప్పవారేవారూ లేరని విర్రవీగుచుండగా, నీకంటే మేరుపర్వతం గొప్పదని నారదమహర్షి చెప్పగా, కుపితుడై, ఓంకార క్షేత్రానికెళ్ళి శివదేవుని పార్థివలింగాన్ని భక్తితోపూజిస్తూ తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా, వింధ్యుడు స్వకార్యాన్ని సాధించుకునే శక్తిని ప్రాదించమనివేడుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. అప్పుడు సమస్త దేవతలంతా స్వామివారిని ఓంకారేశ్వరంలో కొలువై ఉండమని ప్రార్థించారు. వారి కోరికను మన్నించిన స్వామి ప్రణవాకారంలో ఓంకారేశ్వరునిగా కొలువైయ్యాడు. ఇదిలా ఉండగా, శివుని నుంచి వరాన్నిపొందిన వింధ్యుడు, వరగర్వంతో ఎంతో ఎత్తుకు పెరిగి సూర్యచంద్రుల గమనానికి కూడా అడ్డుతగలసాగాడు. వింధ్యుని చేష్ట వలన సమస్తలోకాలు అంధకారంలొ తల్లడిల్లాయి. అప్పుడు దేవతల మొరలను ఆలకించిన పరమేశ్వరుడు వింధ్యుని గర్వమణచమని అగస్త్యమునిని పురమాయించాడు. అగస్త్యుని రాకను గమనించిన వింధ్యుడు మర్యాద పూర్వకంగా తన ఎత్తును తగ్గించి గౌరవించగా, తాను తిరిగి వచ్చేంతవరకు ఎత్తు పెరగకుండా ఉండమని దక్షిణాదికి వెళ్ళి మరల ఉత్తరాదికి వెళ్ళలేదు అగస్త్యుడు. ఫలితంగా వింధ్యుడు ఎత్తు పెరలేదు.

5.వైద్యనాథ జ్యోతిర్లింగం

     వైద్యానాథ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేధాభిప్రాయాలున్నాయి. మహారాష్ట్ర పర్లీ గ్రామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని, గంగా ఖేడలోనిలింగం, పంజాబ్ కీరగ్రామం లోని లింగం, హిమాచల్ ప్రదేశ్ లోని పఠాన్ కోట్ కు సమీపంలోని లింగం, కర్ణాటకలోని గోకర్ణ లింగంఇవన్నీ శివుని ఆత్మలింగాలేనన్న వాదన బలంగా ఉంది. అయితే జార్ఘండ్ వైద్యనాథంలో వెలసినదే అసలైన జ్యోతిర్లింగమని విజ్ఞుల వాదన. పూర్వం రావణాసురుడు కఠోరనియమాలతో, ఒక చెట్టుకింద అగ్ని గుండాన్ని ఏర్పరచి, పార్థివలింగాన్ని, ప్రతిష్టించి, శివపంచాక్షరీమంత్రంతో, హవన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా,శివుడు రావణుని కోరికననుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అయితే ఆ లింగాన్ని భూమికి తాకించిన వెంటనే అక్కడే స్థిరపడుతుందని హెచ్చరించాడు. ఆత్మలింగంతో లంకానగరాంకి తిరుగు ప్రయాణమైన రావణుడు సంధ్యావందనం చేసేందుకు ఒక పశువుల కాపరికి (దేవతల కోరికపై వినాయకుడు ఈ వేషాన్ని ధరించాడు) లింగాన్ని ఇవ్వగా, ఆ కాపరి ఆత్మలింగాన్ని కిందపెడతాడు. ఫలితంగా ఆ లింగం అక్కడే స్థిరపడుతుంది. రవణుడు ఎంతగా ఆత్మలింగాన్ని పెకలించి లంకానగరానికి తీసుకెళదామని ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు. వైధ్యనాథ్ దేవాలయంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది కానీ, ఈ ఆలయ మందిర శిఖరంపై పంచశూలం ఉంది. మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో ఇలాంటి అమరిక లేదు. పంచాక్షరీమంత్రంగా కలిగిన పంచముఖ శివునకు పంచప్రాణాలు అంతర్నిహితంగా కలిగిన శివతత్త్వమే ఇందులోని గూఢార్థం.

6. నాగేశ్వర జ్యోతిర్లింగం

    పశ్చిమ సముద్ర తీరాన, దారుకుడనే రాక్షసుడు, ‘దారుకఅనే తన భార్యతో కలిసి ప్రజలను చిత్రహింసలు గురిచేయసాగాడు. యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ, ముని జనులను హింసించసాగారు. వీరి హింసను తట్టుకోలేని ఋషులు ఔర్వమహర్షికి విన్న వించుకున్నారు. ఔర్వమహర్షి ఆ రాక్షస దంపతులను సతీసమేతంగా మరణించునట్లుగా శపించాడు. ఆ మునిశాపం భూమి పైనే పనిచేస్తుంది. కనుక, రాక్షదంపతులు సముద్రమధ్యంలో నివాసమేర్పరుచుకుని సముద్రయానం చేశేవారిని పీడించసాగారు. ఇలా కనబడిన ప్రయాణీకులందరి ధనవస్తువులను అపహరిస్తూ చెరసాలలో బంధించసాగారు. అలా బంధింపబడినవారిలో సుప్రియుడోకడు. ఇతడు పరమ శివభక్తుడు. రాక్షసబాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా, దివ్యతేజః పుంజము కళ్ళు మిరిమిట్లు గొలుపునట్లు ప్రకాశించింది. ఆ కాంతికి దారుకునితోపటు సమస్త రాక్షసులు నేలకొరిగారు. అక్కడ పరమశివుడు నాగరూపమై జ్యోతిర్లింగమైవెలిసాడు. ఈ స్వామికి దర్శించి, సేవించుకున్నవారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుందని ప్రతీతి.


7. కేదారేశ్వర జ్యోతిర్లింగం

     ఒకప్పుడు బదరికావనంలోని నరనారాయణులు అరీంత్యంత నిష్ఠాగరిష్ఠులై తపస్సు చేయసాగారు. వారు కేదారక్షేత్రానికెళ్ళి మందాకినిలో స్నానం చేస్తూ, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజ చేయసాగారు. వారి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, జ్యోతిర్లింగ రూపంలో వెలసి, జనులను గర్భవాసనరకమునుంచి తొలగించి ముక్తిని ప్రసాదించమని ప్రార్థించారు. ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది. నరనారాయణులు, పంచపాండవులు, ఉపమాన్యుమహర్షి, ఆదిశంకరులవారు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు ఆధారాలున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవదిగా ప్రసిద్ధి పొందిన ఈ కేదారేశ్వరలింగం హిమాలయాలపై సముద్రమట్టానికి 11,760 అడుగుల ఎత్తులో ఉంది. కేదారేశ్వర జ్యోతిర్లింగం లింగాకారంగాకాక పట్టక రూపంలో ఉంటుంది. స్వామిని భక్తులు తాకి అభిషేకాలు చేస్తుంటారు. వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు ఆరుమాసాలు మాత్రమే ఆలయ తెరచి ఉంటుంది. దీపావళి రోజునస్వామికి నేటితోవెలిగించిన దివ్యజ్యోతి ఆరుమాసాల తరువాత తెరచినప్పటికీ వెలుగుతూకనిపిస్తుంది. ఆరునెలల పాటూ ఆలయం మూసి ఉన్న సమయంలో కొండదిగువన ఉర్విమఠంలో స్వామి కొలువై  భక్తులకు దర్శన మిస్తుంటాడు. ఇక్కడ స్వామి అర్చనకై బిల్వ దళాలు దొరకనందున రుద్రప్రయాగ నుండి బ్రహ్మకమలాలను తెప్పించి పూజ చేస్తారు. ఇక్కడ అమ్మవారైన కేదారగౌరి ఆలయానికి దక్షిణం వైపు సింహాద్వారముంది. ఆలయ సభామంటపంలో నంది, పాండవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణ భగవానుని విగ్రహాలున్నాయి. దేవాలయం పైభాగంలో కనిపించే మూడు శిఖరాలు త్రిశూలాన్ని తలపిస్తాయి. దేవాలయానికి ఎనిమిది దిక్కులలో రేతకుండం, శివకుండం, భృగుకుండం, రక్తకుండం, వహ్ని కుండం, బ్రహ్మతీర్థం, హంసకుండం, ఉదకకుండం అంటూ అష్టతీర్థాలున్నాయి. స్వామికి అభిషేకం చేసేందుకు ఇక్కడ గంగనీరు దొరకదు. కాబట్టి, భక్తులు హరిద్వార్, రుద్రప్రయాగ వంటి చోట్ల నుండి సీసాలలో గంగను పట్టుకెళ్ళి స్వామికి అభిషేకం చేయిస్తుంటారు.

8. త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం 
     ఈ క్షేత్రాన్ని త్రిసంధ్యాక్షేత్రమని కూడా పిలుస్తుంటారు. త్ర్యంబకేశ్వరుడు స్వయంభువుడు. అమ్మవారు త్ర్యంబకేశ్వరి. స్వామివారి ఆకృతి విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ పానవట్టం మధ్యలో లింగం ఉండదు. ఆ స్థానంలో రుబ్బురోలు లోపలిభాగంవలె గుంటతో లోతుగా ఉంటుంది. పరమశివుడు తిమూర్త్యాత్మకంగా, త్రిగుణాత్మకమన్నట్లు మూడు భాగాలుగా ఉంటుంది. వనవాసంలోనున్న శ్రీరామచంద్రులవారు సీతా, లక్ష్మణ సేమేతంగా పంచవటిలో పర్ణశాలను నిర్మించుకుని ఉంటుండగా, లంకేశ్వరుని సోదరి శూర్పణక శ్రీరాముని కామించాగా, అందుకు తగిన ప్రాయశ్చిత్తంగా లక్ష్మణుడు ఆమె ముక్కుచెవులను కోసి, ఇంటిదారి పట్టించాడు. శూర్పణఖ ముక్కు (నాసిక) కోసిన ప్రాంతమే నేడు నాసిక్గా పిలువబడుతోంది. ఇక్కడే గోదావరి పుట్టింది. ఇక్కడ బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది. ఈ పర్వత శిఖరాగ్రాన గౌతమమహర్షి అహల్యసమేతంగా తపస్సు చేస్తున్న సమయం. జనహితం కోరి, గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భూమికి రప్పించాలని నిర్ణయించిన మునులు అందుకు తగిన పథకాన్ని రచించారు. గౌతమమహర్షి తన ఆశ్రమంలో వరిపైరును సాగుచేస్తున్నాడు. ఆ వరి పైరు పైకి దర్భతో సృష్టించిన ఆవుదూడలను పంపించారు ఆ మునులు. తపస్సులో నున్న గౌతమ మహర్షి ఒక దర్భతో వాటిని తోలగా, దర్భ తాకినంతనే అవి చనిపోయాయి. మునుల పన్నాగం ఫలించింది. గోహత్యాపాతకం నుంచి బయటపడాలంటే గంగను భూమికి రప్పించి, ప్రాయశ్చిత్తంగా స్నానం చేయమన్నారు.  వెయ్యేళ్ళు శివుని ప్రార్థించి గంగను భూమికి రప్పించాడు గౌతమ మహర్షి. గౌతమ మునీంద్రుల తపస్సువలన భూమికి తీసుకురాబడి నందున కారణంగా గౌతమీనదిఅని, గోవు ప్రాణం వదిలిన ప్రదేశం నుంచి ప్రవహించిన కారణంగా గోదావరిఅని ప్రఖ్యాతి చెందింది. ఈ పుణ్య గోదావరీ నది దీనజనోద్ధరణ నిమిత్తమై దారణా, ప్రవరా, అజంతా, ఎల్లోరా గుహలను దాటుకుంటూ ప్రాణహిత, చంద్రావతీ, శబరిప్రాంతాలలో ప్రవహిస్తూ, దక్షిణ వాహినిగా మారి సుమారు 900 కి.మీ. ప్రయాణం చేసి మహరాష్ట్రంలో కోటిపల్లి దగ్గర సాగరుని చేరుకుంటుంది. గౌతమీనది పుట్టిన త్ర్యంబకంలో స్వయంభువునిగా వెలసిన స్వామి, భక్తులను తన కరుణాపూరిత దృక్కులతో కాపాడుతున్నాడు.

9. రామేశ్వర జ్యోతిర్లింగం
     రానణాసురుని వధించిన శ్రీరామచంద్రుడు సీత,లక్ష్మణ హనుమత్సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యానగరానికి తిరిగి వస్తూ, గంధమాదవ పర్వతంపై కాసేపు విమానాన్ని ఆపాడు. అక్కడున్న మునివరులను బ్రహ్మవంశానికి చెందిన రావణుని చంపిన పాపాన్నుండి బయటపడే మార్గాన్ని చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షులు, శివలింగాన్ని ప్రతిష్టించి, పూజించడం కంటే ఉత్తమమైన మార్గం లేదని చెబుతారు. శ్రీరాముడు శివలింగాన్నొకటి తీసుకురమ్మని హనుమను పురమాయించగా, శివలింగాన్ని తెచ్చేందుకు కైలాసానికి బయలుదేరుతాడు ఆంజనేయుడు. అయితే శివలింగాన్ని ప్రతిష్టించేందుకు ముహూర్తం సమీస్తున్న కొలదీ హనుమ రాక ఆలస్యమైంది. వేరే మార్గం లేక మునివరుల సలహాననుసరించి సీతచే సైకత లింగాన్ని (ఇసుకలింగాన్ని) ప్రతిష్టింపజేస్తాడు శ్రీరాముడు. ఈలోపు కైలాసం నుంచి శివలింగంతో తిరిగి వచ్చిన హనుమంతుడు, శివలింగ ప్రతిష్ట జరిగిందని తెలుసుకొని పరిపరి విధాలుగా చింతిస్తాడు. ఆంజనేయుని బాధను గమనించిన శ్రీరాముడు సైకతలింగాన్ని తొలగించి, రాజతాచలంనుంచి తను తీసుకువచ్చిన లింగాన్ని ప్రతిష్టంచమని చెబుతాడు. రాముని మాటలను విన్న ఆంజనేయుడు ఉత్సాహముతో ఇసుకలింగాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడవుతాడు. చివరకు తోకతో లింగాన్ని పెకిలించడానికి  ప్రయత్నిస్తాడు. ఆంజనేయుని అవస్థలను గమనించిన శ్రీరామచంద్రుడు, సుమూహుర్త బలం, మంత్రబలం సైకత లింగానికి మహత్యాన్ని కలిగించాయని, కాబట్టి కైలాసం నుంచి తీసుకువచ్చిన లింగాన్ని సైకత లింగం పక్కన ప్రత్రిష్టించమని చెప్పాడు. అలా శ్రీరాముడు ప్రతిష్టించిన లింగం రామేశ్వరలింగమని, హనుమంతుడు ప్రతిష్టించిన లింగం హనుమదీశ్వరలింగమని పూజలందుకొంటున్నాయి. రామేశ్వరలింగాన్ని పూజించినవారికి బ్రహ్మహత్యాది దోషాలు తొలగిపోతాయి. కాశీయాత్ర చేసినవారు గంగాజలంతో రామేశ్వరలింగాన్ని అభిషేకిస్తే ఈశ్వరానుగ్రహం కలుగు తుందని ఋషివాక్కు, సమస్త ఐశ్వర్యసిద్ధి కలుగుతుంది.

10. భీమశంకర జ్యోతిర్లింగం
    త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలిసి జీవిస్తూ, ప్రజలను పీడిస్తూండేవాడు. కర్కటి, పుష్కసి కర్కటుల కూతురు. లేక లేక పుట్టిన కూతుర్ని అత్యంత గారాబంగా పెంచసాగారు ఆ రాక్షసదంపతులు. యుక్తవయస్కురాలైన కర్కటిని విరాధునికి ఇచ్చి పెండ్లి చెసారు. ఆ విరాధుడు, శ్రీరామునిటొ జరిగిన యుద్ధంలో మరణించగా, మరలా కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది. ఒకరోజు అగస్త్యుని శిష్యుడైన సుతీక్షణుడు భీమానదిలో స్నానం చేస్తుండగా, కర్కటి తల్లిదండ్రులు అతనిని కబళీంచేందుకు ప్రయత్నించి, అ ముని శాపానికి గురై భస్మమయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా ఆ మిగిలింది. అనాథగా సహ్యపర్వతంపై తిరుగుతున్న కర్కటిని చూసి, మోహావేశుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడు, ఆమెను బలాత్కరించి, లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఫలితంగా కర్కటి గర్భనతై భీమాసురునికి జన్మనిచ్చింది. తన తల్లి కథను విన్న భీమాసురుడు, దీనంతాటికి కారకుడు రామావతారం ధరించిన విష్ణువేనని, విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని, వేయి సంవత్సరాలపాటు బ్రహ్మ గురించి తపస్సుచేసి వరాలను పొందాడు. ఎల్లలోకవాసులను గడగడలాడించిన భీమాసురుడు కామరూప దేశాధిపతి సుదక్షిణుని ఓడించి కారాగృహంలో బంధించాడు.అతని భార్య సుదక్షిణాదేవిని కూడ బంధిస్తాడు. కారాగారంలో సంకెళ్ళతో బంధింపబడినప్పటికీ ఆ దంపతులు, మానస గంగాస్నానం చేస్తూ, ఇసుకలింగాన్ని చేసి ఆరాద్ హించసాగారు. వారి పూజలను చూసిన భీమాసురుడు ఈ లింగం మిమ్ములను రక్షిస్తుందా అంటూ తన కరవాలాన్ని విసురుతాడు. రాక్షసుని కత్తి పార్థివలింగాన్ని తాకినంతనే కోటి సూర్యప్రభలతో స్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, త్రిశూలంతో రాక్షస సంహారం గావించాడు. సకలలోకవాసులు సంతోషించారు. అప్పట్నుంచి స్వామి లోకకళ్యాణార్థం అక్కడనే ఉంటూ భక్తజనా వళిని కరుణిస్తున్నాడు. ఎందరో భక్తుల కోరికలను ఈడేరుస్తున్నాడు.

11. విశ్వేశ్వర జ్యోతిర్లింగం
     ఈ సృష్టికి ముందునుంచే కాశీపురం పరమ పవిత్రమై విరాజిల్లుతోంది. ఇక్కడ పరమశివుడు సగుణరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపం శివశక్తి సమ్మేళనం. స్త్రీ, పురుష రూపాలకు భిన్నంగా ఉన్న ఆ రూపం ప్రకృతి,పురుషులు ఉదయించారు. పరమాత్మ తన నుండి తేజాన్ని వెలువరించి ఐదుక్రోసులమేరగల ఒక మహాపట్టణాన్ని ప్రకృతి పురుషులు తపస్సు చేయడానికి నిర్మించారు. అదే కాశి పట్టణం. పరమాత్మ అదేశానుసారం పురుషుడు సృష్టి నిర్మాణ సామార్థ్యాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేసాడు. పరమపురుషుడైన శ్రీమహావిష్ణువు తపస్సు చేస్తుండగా, ఆ తపస్సు వేడికి అతని శరీరం నుండి నీరు కాలువలై ప్రవహించసాగాయి. ఆ జల ప్రదేశాన్ని చూసి ఆది నారాయణుడు ఆశ్చర్యచకితుడై తల ఊపాడు. ఆ ఊపుకు మణులతో కూడిన చెవి కమ్మ ఊడి ఒకచోట పడింది. ఆ చెవి పోగు ఊడి పడిన స్థలమే మణికర్ణిగా ప్రసిద్ధమైంది. అనంతమైన జలరాశినుండి కాశీపట్టణాన్ని పరమశివుడు తన శూలాగ్రంతో ధరించి కాపాడాడు. జాలం పైభాగంలో యోగనిద్రాపరవశుడైయున్ననారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉదయించి, శివాజ్ఞను అనుసరించి సృష్టి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ముందుగా బ్రహ్మ పంచాశత్కోటి యోజన పరిమితమగు బ్రహ్మాండాన్ని సృజించి, నాలుగు వైపులా పద్నాలుగు భువనాలను నిర్మించాడు. ఆ బ్రహ్మాండం మజ్జిగలో వెన్నముద్ద వలె తేలియాడసాగింది. ఐరావతాదులతో బ్రహ్మాండం సుస్థిరంగా నిలిచి ఉంది. ఈ బ్రహ్మాండంలో సగం మధ్య భాగం, మిగిలిన సగభాగంలో సగం ఊర్థ్వభాగం, ఇక మిగిలిఉన్న పాతికభాగం అథోలోకమని చెప్పబడుతోంది. అప్పుడు దేవతలంతా పరమశివుని ప్రార్థించి, భూలోక వాసులను కాపాడేందుకు ఇక్కడే శాశ్వతంగా ఉండమని విన్నవించుకున్నారు. వారి మొరలను ఆలించిన పరమశివుడు విశ్వేశ్వరనామంతో జ్యోతిర్లింగమై కాశీ పట్టణంలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, అష్టభైరవులు, ఢుంఢితో సహా 56 గణపతులు, నవదుర్గలు కాశీలో కొలువై ఉన్నారు. కాశీలో ంగ్గంగాస్నానం చేసి, విశ్వేశ్వరుని, భిందు మాధవుని, డుంఢిగణపతిని, దండపాణిని, కాలభైరవుని, కుమారస్వామిని, అన్నపూర్ణను సేవించుకోవాలి. కాశీయాత్ర చేయలేనివారు, కాశీ పేరును తలచుకుంటే చాలు, యాత్రాపుణ్యఫలం దక్కుతుంది. కాశీలో మరణించిన వారికి కుడిచెవిలో శ్రీరామ తారక మంత్రోపదేశం లభించి మొక్షం సిద్ధిస్తుంది. రామేశ్వరం నుంచి ఇసుకను తీసుకొచ్చి కాశీ విశ్వేశ్వరుని అభిషేకిస్తే, ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇక్కడ గంగాస్నానం చేసిన వారికి ముక్తి, అన్నపూర్ణాదేవిని పూజించినవారికి భుక్తికి లోటుండదు.

12. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం

     పూర్వం  సమీపంలో సుధర్ముడు సుదేహ అనే దంపతులుండేవారు. వీరికి ఎంతకాలమైనప్పటికి సంతానభాగ్యం కలుగలేదు. ఒకరోజు ఆ ఇంటికి బ్రహ్మతేజోవిరాజితుడైన ఓ యతీశ్వరుడు భిక్ష కోసం వచ్చాడు. అతనిని సాదరంగా ఆహ్వానించిన దంపతులు ఆ యతీశ్వరునికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. భోజనం చేస్తున్న సమయంలో ఆ దంపతులకు సంతాన భాగ్యం లేదన్న విషయాన్ని తెలుసుకున్న యతీశ్వరుడు, సగంలోనే భోజనాన్ని వదిలెసి వెళ్ళసాగాడు. సంతానంలేనివారి ఇంట్లో భోజనం చేయకూడదన్నది యతీశ్వరుని నియమం. ఆ దంపతలు యతీశ్వరుని కాళ్ళపై బడి ప్రార్థించగా, త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుందని దీవించాడు. పెళ్ళికి ముందు సుదేహ జాతక చక్రాన్ని పరశీలించిన పండితులు, ఆమెకు సంతానప్రాప్తి లేదని చెబుతారు. ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న సుదేహ, తన చెల్లెలు ఘశ్మకు పెళ్ళి చేసుకోమని భర్తకు చెబుతుంది. సుధర్ముడు ఒప్పుకోకపోయినప్పటికి, సుదేహ పట్టుబట్టి భర్తకు రెండవ పెళ్ళి జరిపిస్తుంది. అలా కొంతకాలం సుఖంగా ఉన్నారు. పరమపతివ్రతయైన ఘశ్మ, అక్క సుదేహను తల్లిల్లా, భర్త్నను దైవసమానునిగా భావించి సేవిస్తుండెది. అచిరకాలంలోనే ఘశ్మ గర్భవతి అయింది. ఒక శుభదినంలో ఘశ్మ మగబిడ్డను ప్రసవించింది. ఆ పిల్లవాడు దినదినప్రవర్ధమానంగా పెరగసాగడు. అయితే, సుదేహ మనసులో అసూయాజ్వాలలు రేగాయి. తన చెల్లెలు, చెల్లెలి కొడుకుపై ఈర్ష్యాద్వేషాలు పెంచుకోసాగిది. ఒకరోజు రాత్రి సుదేఅ, పసివాని గొతుకోసి, తలను మొండేన్ని వేరువేరుగ చెరువులోకి విసిరివేసింది. ఇదంతా తెలియని ఘశ్మ ఉదయాన్నే లేచి, కాలకృత్యాలను తీర్చుకుని, స్నానం చేసేందుకు సరోవరానికి వెళ్ళింది. అక్కడ ఆమె కుమారుడు తల్లి పాదాల దగ్గరకు ఈదుకుంటువచ్చి, ‘అమ్మా! నేనొక పీడకల కన్నాను. అందులో నేను చచ్చి బ్రతికినట్లు కనిపించింది’. అని చెప్పాడు. కొడుకు చెప్పిన సంగతిని విన్న
     ఘశ్మ దిగ్ర్భమజెంది, ఎందుకిలా జరిగింది? ఇది కలా? నిజమా? అని ఆలొచించసాగింది. అలా ఆమె దీర్ఘాలొచనలోనుండగా, శివుడు ప్రత్యక్షమై, సుదేహ చేసిన ఘోరకృత్యాన్ని చెప్పి, ఆమెను శిక్షిస్తానని పలుకుతాడు. అప్పుడు శివుని కాళ్ళపై బదిన ఘశ్మ, తన అక్కకు ఎటువంటి దండన వద్దని, మారుగా ఆమెకు మంచి బుద్ధి, సౌశీల్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించింది. ఆమె ప్రార్థనను విని సంతసించిన శివుడు, ‘తల్లీ! నీ కోరిక ప్రకారమే జరుగుతుంది. ఇకపై నేను ఘృష్నేశ్వరనామంతో ఇక్కడె కొలువై ఉండగలవాడను. నీవు దీర్ఘసుమంగళివై చిరకాలం వర్థిల్లి, చివరకు నా లోకాన్ని చేరుకుంటావని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు. 
     ఘృష్ణేశ్వర లింగాన్ని పూజించిన వారికి పుత్రశోకం కలుగదని ప్రతీతి.
---------------------------------------------
దేవాలయ ప్రాశస్త్యం

     దేహం దేవాలయం వంటిది. అందులో ప్రతిష్ఠమైన సనాతనుడైన జీవత్మాయే పరమాత్మా. విశ్వవ్యాప్తంగా వెలసియున్న దేవాలయాలన్నీ  మానవ కల్యాణానికై ఏర్పాటు చేయబడినవే. అవి జాతి మాత కులభేదాలకు అతీతంగా నిర్మించబడ్డాయి. అది దేవాలయం, చర్చి, మసీదు, జైన మందిరం, మఠం మరేదైనా కావచ్చు. వాటి లక్ష్యం ఒక్కటే. మానవ మస్తిష్కంలోని దుష్టబుద్ధిని  తొలగించి మానవత్వాన్ని పెంపొందిచడమే.
      మానవుడంటే శారీరిక, మానసిక మహాశక్తులుగల వాడని నేటి శాస్త్ర విజ్ఞానం చెబుతోంది. కాని, తత్త్వం విచారిస్తూ చెప్పుకోవలసిన విషయం మరొక్కటుంది. దేవుడు సత్యం, శాంతం, దయ, జ్ఞానం, తృప్తి, త్యాగం మున్నగు మహానీయ గుణాలు గలవాడని అర్థం. వీటిని కలిగియున్న వాడే మహాత్ముడు. అట్టి సద్గుణ సంపత్తిని కలిగి ఉన్న కారణానే శ్రీషిరిడి సాయిబాబా, శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీవివేకానంద మున్నగువారు మహాత్ములై భగవత్ గుణాలను కలిగి మానవులను ఆదర్శప్రాయులైయ్యారు.
       పైన పేర్కొన్న గుణాలన్నీ మానవులలో కొరవడిన కారణం వల్లనే మానవులు దానవులై మారణహోమాన్ని సృస్తిస్తూ, మహోపద్రవకారకులుగా నేడు ప్రపంచాన్ని కుదిపెస్తున్నారు. పుట్టుక చేత మానవుడు మంచివాడే. పెరుగుదలలో క్రమంగా పరార్థాన్నివీడి స్వార్థాన్ని పెంచుకొని, సత్య, దయాశౌచాలకు తిలోదకాలిచ్చి, సాటి మానవులతో సహకరించిక నికృష్ట జీవితాన్ని గడుపుతున్నాడు. ఈవిధమైన మానవత్వ లేమి చేత ప్రపంచమంతా నేడు అశాంతికి గురౌతోంది.
      దేవాలయాలు శాంతికి నిలయాలు కావాలి. అక్కడి ప్రశాంత వాతావరణం, ధర్మబోధ, మానవ మహోన్నతికి బీజం వేయాలి. వ్యక్తుల దురాలోచనలు వారి నుండి దూరం కావాలి. అవగుణాలను గురించి ఆలోచింపజేసి వాటి నిర్మూలనకు కృషి చేసేటట్లు చూడాలి. ఇట్టి ఆదర్శాలను చిత్తశుద్దితో దేవాలయాలు నిర్వహించగలిగినపుడు వాటి మనుగడ మహోన్నతమై ఉంటుంది. లేనినాడు వాటి ఉనికి నామమాత్రంగా మిగిలిపోతుంది.
     నేటి దేవాలయాలు నిర్వాహణలో ఈ ప్రయత్నం ఏ మాత్రం సాగుతున్నదన్న విషయాన్ని ప్రతి దేవాలయ నిర్వాహకులు ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరమెంతైనా వుంది.
      దైవారాధనపూజ మానసికమైనదిగా మరియు ఆధ్యాత్మికమైనదిగా ఉంటోంది. వీటిని ఆర్భాటంగా నిర్వహించనక్కరలేదు. ఎవరో మనల్ని మెచ్చుకోవలేననిగాని, ఏంటో గొప్పగా నిర్వహింపబడిందని పేరు తెచ్చుకోవడానికి గాని చేయరాదు. అటువంటివి ప్రయోజన శూన్యాలు. భగవంతుడు అటువంటి డాంబిక, ఆరాధనా పూజాకార్యక్రమాలను ఆశీర్వదించడు అనడానికి తార్కాణమైనాకథా వృత్తాంతం గురువాయురులో జరిగిన కథ.
     కేరళరాష్ట్రంలో నేటికీ ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ పుణ్యక్షేత్రం గురువాయూరు. అక్కడ వాసుదేవుడను శ్రీకృష్ణ భక్తుడు గలడు. నిరంతరం శ్రీకృష్ణుని సేవిస్తూ పూజా పురస్కారాలను మిక్కిలి ఆటోపంగా నిర్వహిస్తూ శ్రీకృష్ణుని సందర్శనానికి కాంక్షించుతున్నాడు.

ఒకరోజున భగవంతుని ప్రార్థిస్తూ తన కోర్కెను మన్నించి దివ్యసందర్శన భాగ్యాన్ని కలుగాజేయుమని వేడుకొని నిద్రించాడు. పరమాత్మ వాసుదేవుని భక్తిని పరీక్షించి కరుణింపదలచాడు. అతనికి స్వప్నంలో నేను నిన్నుఅనుగ్రహించడానికి రేపు మధ్యాహ్నం రానున్నాను అనే మాటలు వినిపించాయి.భక్తుని హృదయం ఉప్పొంగిపోయింది. అతనికి నిద్రపట్టలేదు. ఎలాగో రాత్రి గడిచింది. ఉదయాన్నేలేచి శుచియై శ్రీకృష్ణ విగ్రహాన్ని సుగంధ ద్రవ్యాన్ని కలిపినా స్వచ్చమైన జలంతో అభిషేకించాడు. పట్టుపీతాంబరాలను కట్టబెట్టాడు. పరిమళాన్ని వెదజల్లు పుష్పాలతో అలంకరించాడు. మిక్కిలి కాంతివంతమగు దీపాలను వెలిగించాడు. అగరువత్తులను వెలిగించి ధూపం వేశాడు. చందన, కర్పూర సువాసనలను గుబాళింపచేశాడు. షడ్రుచులతో కూడిన ఆహారపదార్థాలను పంచభక్ష్య పరమాన్నాలను సిద్ధపరిచాడు.
     మేళతాళాల రణగోణధ్వనులు ఉత్సవస్ఫూర్తినిస్తున్నాయి. పూజా పురస్కారాలను మిక్కిలి ఆడంబరంగా నిర్వహించాడు. కార్యక్రమమంతా పూర్తియైనది. ఇక భగవంతుని రాక నైవేద్య సమర్పణ మిగిలి ఉంది. శ్రీస్వామివారు చెప్పిన సమయమాసన్నమైనది. భక్తునిలో ఉత్కంట పెరిగింది. చుట్టూ చేరిన జనసందోహం మిక్కిలి ఆతురతతో ఎదురుచూస్తున్నారు.
     ఇంతలో అచ్చటికి ఒక వృద్ధుడు కర్రచేతపట్టుకొని, నడుంవంగిపోయి పొట్ట వెన్నమొక అంటుకొనియుండగా, కాళ్ళు తడబడుచుండగా, ఆకలితో ఆర్తనాదం చేయుచూ మెల్లగా నడిచి వచ్చి భిక్షాన్నమడిగాడు. తానూ ఎదురుచూచుచున్న శ్రీకృష్ణుడు రాకపోగా, ఈ ముదుసలి వచ్చి శ్రీక్రుష్ణునికై ఏర్పాటు చేయబడిన నైవేద్యాన్ని ఆహారంగా అడిగి వాతావరణాన్ని భంగపరిచాడని వాసుదేవ భక్తునికి అసహనమేర్పడింది. కోపంతో మంచి చెడ్డలాలోచించక శ్రీకృష్ణవిగ్రహం వద్ద నున్న దండాన్ని తీసికొని వృద్ధునిపై విసిరాడు. ఆ దండమతనికి నడుంకి గట్టిగా తగులటం వలన నడుం విరిగి కుప్పకూలిపోయాడు. జనసందోహం తన చుట్టుముట్టినంతలో అతడంతర్హిడయ్యారు. జరిగిన అపరాధానికి మిక్కిలి చింతిస్తూ వాసుదేవుడు శ్రీకృష్ణుని విగ్రహంచెంత తలవాల్చాడు. విగ్రహం నడుం కూడా విరిగి క్రింద బదియున్నది. ఎంత వింత దృశ్యం? ఆ దృశ్యం నుండి వినిపించిన పల్కులివి, “వాసుదేవా! ఎంతోకాలంనుండి నారాకకై ఎదురుచూస్తున్నావు. నేను రాగానే నిర్దయుడవై కర్ర విసిరి నాకు దూరమైతివి. దైవం మానవరూపం అన్న విషయం నీకు తెలియదా! అందరియందున్నభగవదాత్మ ఒక్కటేయని నేను భగవద్గీతలో ప్రవచించలేదా? విగ్రహారాధనకు ప్రాధాన్యమిచ్చి ప్రాణమున్న మనుష్యుని హింసించావు. దయగల హృదయమే భాగవన్నిలయం. ఇకమీదట మానవత్వ లక్షణాలను పెంపొందించుకొని దైవత్వంను పొందుమని ఆశీర్వదించాడు. వాసుదేవుడు తన తప్పిదాన్ని తెలుసుకొని మానవ సేవలో తన శేషజీవితాన్ని గడిపి శ్రీకృష్ణ సాయున్యమును పొందాడు. ఈ కథను తెలుసుకొన్న తరువాత ఆరాధనా పూజాకార్యక్రమాలు మానసికమై ఉంది సాటి మానవులపై కరుణాదృష్తి కల్గియుండవలెనని తెలుస్తోంది గదా!
      దేవాలయ ప్రాంగణంలో ప్రశాంతతను ఇచ్చే వాతావరణం ఉంటుంది. భగవంతునిసేవలో కొంత సేదదీరుతాము. తాము చేస్తున్న పనులు సరియైనవా, కావా అని ఆత్మవిమర్శ చేసుకునే వీలవుతుంది. భగవదారాధన చేస్తూ అసత్య దోషాలను అసంబద్ధ కార్యకలాపాలను నిర్వహించడానికి మనసులో జంకుకల్గుతుంది. సాతివారితో మీలాగే తీరు చాల సవ్యంగా ఉంటుంది. తన కష్టాలను భగవంతునికి విన్నవించుకొని భక్తిభావమును పెంపొందించుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ కారణాల వలన ఉదాత్తమైన వ్యక్తిత్వము పెంపొందుతుంది.
     భగవదారాధకులకు కష్టాలు రావా? వారంతా సుఖంగా ఉనారా? వీటికి సమాధానం బాహుళ్యమైనది. త్యాగయ్య, పోతన్న, శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీరమణమహర్షి, నందనారు, కబీరు మున్నగు వారంతా గొప్ప భక్తులు. వారు సైతం అనేక కష్టాలకు గురైయ్యారు. అయినప్పటికీ వారికి వచ్చిన ప్రమాదం లేదు. వారు భగవంతుని సేవలో కృతకృత్యులై అవ్యాజానందాన్ని పొంది మోక్షప్రాప్తిని పొందారు. కొన్ని సందర్భాలలో కష్టాలు వారి వారి సమార్త్యాలను, సాధారణంగా పురాకృత కర్మల వలన వస్తుంటాయి. సామర్థాన్ని పెంచుకొని సత్కర్మలను ఆచరించటం వలన కష్టాలను ఎదుర్కోడానికి శక్తి, నివారణానికిమార్గాలు లభిస్తాయి. భగవంతుని నమ్ముకుని సేవించువాడు తనకు ఎదురయ్యే ఆతుపోట్లును తట్టుకొని దైన్యాన్ని వీడి, ధైర్యమును తెచ్చుకొని, భగవదారాదనలో శాంతిని పొంది స్థిత ప్రజ్ఞుడవుతాడు.

ధరఖర్వాతుడోకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుడై
త్వరతోడన్ బరువెత్తి చేరి నిలిచెన్ తాళద్రుమచ్చాయత
చ్చిరమున్ తత్ఫలపాత వేగమున విచ్చెన్ శబ్దయోగంబుగా
బోరిదైవోపహతుండు పోవుకడకున్ పోవుంగదా యాపదాల్.

    “బట్టతలవాడొకడు ఎండ వేడిమికి తట్టుకొనలేక ఏ చెట్టూ లేని కారణాన, తాటిచెట్టు కన్పించగా, పరుగు పరుగున వెళ్ళి దాని క్రింద నీడకై నిలుచున్నాడు. అదే సమయంలో ఆ తాటిచెట్టు నుండి తాటిపండు అతని తలపై పడటం వలన తల పగిలింది. దైవానుగ్రహం లేని వానికే అలా ఆపదలు సంభవిస్తున్నాయి  అని అన్నారు.
     దీనినిబట్టి దైవోపహతుడెట్టి కార్యం చేయబోయినా ఫలించక ప్రమాదం సంభవిస్తుందనడం అనుభవైకవేద్యం. చాలామంది తాము భగవదారాధకులమని, తమ కష్టాలు తీరటంలేదని, తమ పూజలు ఫలించటం లేదని చెబుతుంటారు. ఈ అనుభవం కూడా సత్యమైనదే.
     మన ప్రార్ధనలకు సమాధానం రాలేదు. కోర్కెలు సఫలము కాలేదు. మనశ్శాంతి కలగటం లేదు. కారణమేమిటి? ప్రార్ధనలో నిశ్చలత్వం అవసరం. అది సంసార బంధాల నుండి విముక్తి కొరకుగానుండుట సమంజసం. ప్రార్ధన లేదా పూజలో నా మనస్సు నిలవటం లేదని చాలామంది చెబుతుండటం జరుగుతుంటుంది. ఇది కూడా యదార్థమే. నిశ్చలతత్త్వమెట్లు కలుగుతుంది? నిస్సంగత్వే నిశ్చలత్వత్త్వమని జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి బోధన.
    కోర్కెలు ఇహలోక సౌఖ్యాల కొరకు మాత్రం పరిమితం గాక జన్మ రాహిత్యాన్ని కోరునట్టివై ఉండటం కూడా ముఖ్యం. పరహితం లేని కోర్కెలు ఫలించవు. ధర్మాన్ని విడిచి ఏ పని జేసినా అది వ్యర్థమే. పరమధర్మాన్నే మహాభారతంలో వివరించిన తీరును గురించి తెలుసుకొందాం.
ఒరులేయవి యొనరించిన
నరవర అప్రియము తన మనంబున కగు తా
నొరులకవి యొనరించకునికి
పరాయణము పరమధర్మ పతమండ్రు జనుల్.
    ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టముండదో అట్టి దానిని నీవు ఇతరులకు చేయకుండుటయే పరమధర్మమని భావం. ఇంతకన్నా మహోదాత్తమైన విషయమేమి ఉంటుంది? మానవత్వం ఈ పద్యంలో వెల్లివిరియటం లేదా దానిని ఆచరణలో పెట్టగలిగినవాడు మానవుడు ఇలలోనే మహానుభావుడవుతాడు కదా!
    భౌతిక సంబంధమైన వాంఛలను విడనాడి, తనకు భగవంతుడిచ్చిన ఆయుర్దాయ కాలాన్ని సద్వినియోగం చేసికొంటూ, జాతస్య మరణం ధృవ మను సత్యాన్ని మరువక, మానవ విధులను సక్రమంగా నిర్వహించి వైరాగ్య భావంతో యోగాభ్యాసాన్ని అవలంబించి తద్వారా మనస్సును భగవంతునిపై లగ్నం చేసిన అదే నిర్వాణపథం. జీవబ్రహ్మైక్య  రహస్యం కూడ. అప్పుడు మానసికస్థితి నిశ్చలముగ ఉండి మానవుడు ఋషితుల్యుడవుతాడు. జీవిత పరమార్ధాన్ని సాధించిన మానవుడే మహాత్ముడైన భగవంతుడి రూపం.
    మనలో ధర్మభావమును నింపడానికి ప్రతిగ్రామంలో, ప్రతీ పట్టణంలో మన పెద్దలు దేవాలయాలను నిర్మించారు. వేదవిదులు, త్రికాలవేత్తలు అయిన మహాఋషులు, విశ్వశాంతికై, సర్వజన ఆత్మోద్ధరనకై, మహిమాన్వితాలైన దేవాలయాలను స్థాపించి, నిత్య సత్య జ్ఞానమర్గాన్ని విశ్వశాంతికి ప్రచారం చేయడానికి దోహదం చేసారు. నిత్యం దేవాలయదర్శనాన్ని చేసుకునేవారు, గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పినట్లు, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావం లేనివాడై, వాటి పట్ల సమభావాన్ని కలిగి ఉంటాడు.
---------------------------------------------
మేఘసందేశం
      ఇది చాలా చాలా పురాతన కాలం నాటి సంఘటన. ఆ కాలంలో దేవ, దానవ, మానవుల మధ్య తరచూ సంఘర్షణలు జరుగుతుండేవి. ఆ సంఘర్షణలలో అనేక మంది చనిపోయేవారు. అనేకులు అంగవికలులై  దుర్భరజీవితాలను గడుపుతుండేవారు. ఈ పరిస్థితిని  గుర్తించి ఆ సంఘర్షణల నుండి ఎలాగైనా బయిటపడి సుఖ శాంతులతో జీవించాలనే ఉద్దేశం వారిలో జ్ఞానవయోవృద్ధులకు కలిగింది. వారు బాగా అలోచించి ఈ ప్రపంచానికి సృష్టికర్త బ్రహ్మదేవుడు. అతడు అందరికీ పితామహుడు. మన అందరిపై పుత్రవాత్సల్యం గలవాడు. కనుక, బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి, తరుణోపాయాన్ని అడగాలని నిశ్చయించుకున్నారు.
      అందరూ కలసి బ్రహ్మదేవుని దెగ్గరకు వెళ్ళారు. వారందరూ పితామహుని వద్దకు ఉపదేశం కోసం బయిలుదేరారు. కనుక, వినీతవేషంతో విధేయులుగా వెళ్ళారు. ఆవిధంగా దేవదానవ మానవులందరూ కలసి తన వద్దకు రావడాన్ని చూసిన బ్రహ్మదేవుడు సంతోషించాడు. 
      వారినుద్దేశించి బ్రహ్మదేవుడు, “వత్సలారా! మీరందరూ కలసి ఇలా వినీత వేషంతో, అత్యంత విధేయులుగా రావడం నాకు ఆనందంగా ఉంది. మీలో ఇట్టి సద్భుద్ది, సమైక్యత కలగడానికి గల కారణమేమి? మీకు ఏమి కావాలి?” అని అడిగాడు. దానికి వారందరూ కలసి రావడానికిగల కారణాన్ని, వారి మధ్య సంఘర్షణలను తొలగించుకొని, సుఖశాంతులతో జీవించాలనే సదుద్దేశాన్ని తెలిపారు. దానికి తగిన ఉపాయాన్ని బోధించమని ప్రార్ధించారు. వారి మాటలు విన్న బ్రహ్మదేవుడు సంతోషించి, “కొంతకాలం నా ఆశ్రమంలో ఉండి మీరు సంయమము, బ్రహ్మచర్యాల ద్వార ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోడానికి తపస్సు చేయండి. మీ ఆచరణ దీక్షా నిష్ఠలను చూచి, తగిన సమయంలో మీరు పరస్పరం  సంఘర్షణల నుండి బయిటపడి సుఖశాంతులతో అన్నదమ్ములవలె కలసి మెలసి జీవించడానికి తగిన ఉపాయాన్ని ఉపదేశిస్తాను. మీ అందరి మనఃస్థితి సమానమైనది కాదు. భిన్న మానసిక స్థితులవారికి ఒకే సమయంలో బోధించరాదు. కనుక, ఉచిత సమయంలో ఒక్కొక్కరికి ఉపదేశించి పంపుతాను" అన్నాడు. వారందరూ పితామహుని ఆదేశాన్ని పాటించి, బ్రహ్మదేవుని ఆశ్రమంలో బ్రహ్మచర్య దీక్ష పూని, ఇంద్రియాలను జయించటానికై కృషిచేస్తూ, తపస్సు చేయసాగారు. కొంతకాలం గడిచింది. వారిలో పరస్పర వైర భావాలు నశించాయి. సోదరభావంతో మెలుగుతున్నారు. ఆశ్రమవాతవరణం వారిలో సత్వగుణాన్ని పెంపొందించింది. నియమనిష్ఠలు శాంతిని, దాంతిని, దయను కలిగించాయి. దేవతల విషయభోగవాంచలు, దానవుల హింసాప్రవృత్తి మానవుల స్వార్థపర్వతం అంతరించాయి.
అది ఒక ప్రశాంత సంధ్యాసమయం. దిక్కులన్నీ సంధ్యారాగంతో నిండి కనుల పండువుగా  కన్పించడం కన్పిస్తున్నాయి.
      ప్రకృతి అంతా ప్రశాంతంగా, గంభీరంగా మనోహరంగా ఉంది. ఆ శుభసమయంలో బ్రహ్మదేవుడు దేవతలకు ఉపదేశం చేయవచ్చునని తలచాడు. అంతః కరణ ప్రేరణతో, దేవతల ప్రతినిధులు బ్రహ్మ దగ్గరకి వచ్చారు. సాష్టాంగనమస్కారం  చేసారు. బ్రహ్మదేవుడు వారిని చిరునవ్వుతో పలకరించారు, ఒక్కక్షణం గంభిరముద్ర వహించి, మేఘ గంభిరస్వరంతో అని ఉచ్ఛరించి,మౌనం వహించాడు. అది ఘంటారావంవలె దేవతల కర్ణరంధ్రాలలో ప్రతిధ్వనించింది. ఇంద్రియభోగాలను అనుభవించడమే పరమార్థమని, భోగాలాలసులైన దేవతలు తమకు బ్రహ్మదేవుడు  అనగా ఇంద్రియ దమముగల వారులకండు (దామ్యత) అని బోధించినాడని తెలుసుకున్నారు. ఇంద్రియనిగ్రహం లేకపోవుట చేత మనం భోగాలాలసులమయి ఈర్ష్య, అసూయలకు లోబడిపోతున్నాం. ఇంద్రియనిగ్రహం కలిగియున్నప్పుడు వైర, ద్రోహాది దుర్గుణములు నుండి బయిటపడగలమని అనుకున్నారు. బ్రహ్మవారి ఆలోచనలను గమనించి దేవతలారా! నా ఉపదేశ తాత్పర్యమును సరిగా గ్రహించినారు. కనుక మీరు మీ లోకానికి వెళ్ళి ఇంద్రియ దమము సాధించి, సుఖ శాంతులతో జీవించండిఅని అనుజ్ఞ ఇచ్చినాడు. దేవతలు తమ లోకానికి చేరుకున్నారు. తమ వారందరికి ఇంద్రియ దమము ప్రాధాన్యాన్ని బోధించి, ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ సుఖశాంతులతో జీవిస్తున్నారు.
      కొంతకాలం గడిచింది. దేవతలు వెళ్ళిన తర్వాత మానవ వృద్ధులు, పితామహుని సేవిస్తూ, బ్రహ్మదేవుని ఆశ్రమంలో తపోనిధులై ఉపదేశ సమయం కోసం నిరీక్షిస్తున్నారు. వారి సాధన పరిపూర్ణ దశకు చేరింది. ఒక శుభ సంధ్యసమయంలో మానవ వృద్ధులు హృదయంలో ప్రేరణ కలిగింది.అంతట వారు బ్రహ్మదేవుని  దగ్గరకు వెళ్ళి, నమస్కరించి దేవా! మాకు ఉపదేశం చేసి, మమ్ము కృతార్థులను చేయండి.అని ప్రార్థించారు. పితామహుడు వారి అర్హతను గుర్తించి ఒక్కక్షణం గంభిరముద్ర వహించి మేఘ గంభిరస్వరంతో  అని ఉచ్చరించి, మౌనం పాటించాడు. ఆ ధ్వని నలుదిక్కులా వ్యాపించి భునభోంతరాళాల మధ్య నిండిపోయింది. ఆ అమృతధ్వని విని, తరించిన మానవులు మనం కర్మ అనుభవించడానికి జన్మించుటచే, స్వార్థపరులమై నిత్యం ధనార్జన యందే ఆసక్తి గల్గియున్నాము. స్వార్తపరత్వమే మన మధ్య అసూయా, ద్వేష, కలహాదులకు కారణంగా ఉంది. కనుక స్వార్థపరులం, లోభులమైన మనకు పితామహుడు  అనగా దత్త -దానం చేయండని ఉపదేశమిచ్చినాడు అని తలంచారు. ధర్మసారమంతా దానగుణంలో ఉంది. ఈ విశిష్టగుణం లేకపోవడం వల్లనే మనోవాక్కాయుకర్మలు అధర్మ వికారాన్ని పొందుతున్నాయి. చిత్తదోషాలను తొలగించి, దాన్ని పవిత్రం చేసే సాధనాలలో దానము ప్రముఖమైంది. అంతేకాదు, మనిషిని పట్టి పీడిస్తున్న మమతా జాడ్యాన్నిక్రమంగా తగ్గించే ఔషధంగా దానగుణం పనిచేస్తుంది. మొదట గడ్డిపోచతో అయినా మొదలుపెట్టి దానగుణాన్ని అభ్యాసం చేసుకుంటూ పొతే, చివరకు తన తలనైనా దానం చేయగల్గిన స్థాయికి మనిషి ఎదుగుతాడని మానవ వృద్ధులు తలచారు. వారి ఆలోచనలను గమనించిన బ్రహ్మదేవుడు, నా ఉపదేశసారాన్ని సరిగ్గా గ్రహించారు. మీరు మీ లోకానికి వెళ్ళి, దానగుణం అభ్యసించి, స్వార్థలాభాలను పరిత్యజించి సుఖ శాంతులతో  జీవించండని బోధించి, పంపించినాడు. మానవులు తమ లోకానికి వెళ్ళి దానగుణం పాటిస్తూ సుఖశాంతులతో జీవించసాగారు.
     ఆవిధంగా దేవతలు, మానవులు వెళ్ళిపోయిన తర్వాత రాక్షసులు బ్రహ్మ బోధించిన నియమనిష్టలను పాటిస్తూ ఆశ్రమజీవితం గడుపుతూ బ్రహ్మదేవుని ఉపదేశంకోసం ఎదురు చూస్తున్నారు. కొంత కాలానికి వారి సాధన పరిపూర్ణదశకు  చేరింది. వారిలో హింసాప్రవృత్తి నశించి అహింస,క్షమ, ఉపకార స్వభావం మొదలగు సద్గుణాలు ఏర్పడినాయి. ఒక శుభ సంధ్యాసమయంలో పితామహుని తలంపుతో రాక్షసులలో ప్రేరణ గలిగి, బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. పితామహా! మాకు ఉపదేశమిచ్చి  కృతార్థులను చేయండి అని ప్రార్దించారు. మాతో వచ్చిన దేవతలు, మానవులు తమ దివ్య ఉపదేశాన్ని పొంది, తమ లోకాలకు వెళ్ళి తమతమ జాతులను ఉద్ధరించుకుంటున్నారు. సుఖశాంతులతో జీవిస్తున్నారు. మాకు అట్టి అవకాశాన్ని అనుగ్రహించండని ప్రాధేయపడ్డారు.

సాత్వికబుద్ధితో దానవులు పలికిన మాటలు విని, బ్రహ్మదేవుడు సంతోషించి, ఒక్కక్షణం గంభీరంగా ఉండి, మేఘగర్జన సదృశ గంభీర ధ్వనితో  అని పలికి మౌనం దాల్చాడు. ఆ దివ్యాక్షరం దానవులలో ప్రవేశించి, హృదయంలో స్తిరపడింది. దానిచే వారు  ప్రభావితులై మనం మొదటి నుండి హింసాప్రవృత్తిని కలిగియున్నాము. హింసా క్రోధాలతో మన జీవితాలను అశాంతిమయం, దుఃఖమయం చేసుకున్నాము. కనుక తరుణోపాయంగా పితామహుడు  అనగా దయధ్యం- ప్రాణుల యెడ దయగలిగి  ఉండమని ఉపదేశించాడు. హింసాకృత్యం అధర్మం. దయ ఉత్తమధర్మం. దయాగుణమే  అహింస, ఔదార్యం, క్షమ మొదలగు అనేక రూపాల్లో భాసిస్తుంది. సస్యముల వృద్ధికి వర్ణం కారణమైనట్లు దయ అనేక సుగుణాలకు పోషకంగా ఉంది. దయతో నిండిన మనస్సులో ద్రోహచింతనకు తావులేదు. దయాహృదయుని వాక్కు మధురంగా ఉంటుంది. శరీరం దర్శనీయంగా ఉంటుంది. భగవంతుడు దయాస్వరూపుడు. కనుక, దయను మించిన సుగునం లేదని తలచారు. బ్రహ్మదేవుడు వారి ఆలోచనలను గుర్తించి, వత్సలారా! నా ఉపదేశాన్నిమీరు సరిగ్గా గ్రహించారు. ఇకపై దయాగుణ సంపన్నులై మీ జీవితాలను, తోటివారి జీవితాలను సుఖశాంతులతో వర్థిల్లజేయండి. అని భోదించి అనుగ్రహించాడు. దానవ వృద్ధులు తమ లోకానికి వెళ్ళి దయాగుణ విశిష్టతను తమ వారికి భోదించి, అందరూ దయాగుణమును పాటించి సుఖశాంతులతో జీవిస్తున్నారు. తోటి ప్రాణులకు సుఖశాంతులుల జీవితాన్ని అనుగ్రహించారు.
     బ్రహ్మదేవుడు ఉపదేశించిన ద-ద-ద కార త్రయం దేవతలకు దామ్యత ఇంద్రియనిగ్రహంగా, మానవులకు దత్త దానంగా, దానవులకు దయధ్వం దయగా అర్థమయింది. దీనికి వారి జీవనవిధానం, మానసిక స్థితి, నైసర్గిక స్వభావాలు కారణాలుగా ఉన్నాయి.
     అప్పటినుండి వర్షాకాలపు మేఘం ద-ద-ద అంటూ బ్రహ్మవాక్కునే పలుకుతుంది. ఇది దైవ వాక్కు. ఈ మేఘసందేశం జనులకు దామ్యత-దయ-దయధ్యం అని హితం బోధిస్తుంది. మానవులకంటే వేరుగా దేవదానవులు లేరు. వారు మానవులలోనే ఉన్నారు. కనుక, మనుష్యులలోనే సమస్త గుణాలు గలిగి ఇంద్రియనిగ్రహం లేని దేవతలా వంటివారిని ఇంద్రియనిగ్రహం కలిగి ఉండమని, దానగుణంలేక లోభగుణంగల మానవులకు దానం చేయండని, రాక్షస ప్రవృత్తిగల దానవులకు ప్రాణులయందు దయ గలిగి ఉండమని వర్షాకాలపు మేఘగర్జన ద-ద-ద అని బ్రహ్మదేవుని ఉపదేశాన్ని మరలా మరల వినిపిస్తోంది. ఇదే మేఘసందేశం. మానవులందరూ ఇంద్రియనిగ్రహము, దానగుణాన్ని, భూతదయను కలిగి సుఖశాంతులతో జీవించాలని వర్షాకాలపు మేఘం యొక్క ఆశ! అయినా, నేటి మానవులు వర్షాకాలపు మేఘగర్జన వినిపిస్తున్న దైవ సందేశాన్ని విని అర్ధం చేసుకొని, ఆ గుణ త్రయమును అలవరచుకొని, పెంపొందించుకొని, ఆచరణలో పెట్టి బాగుపడేరా? హింస, దారిద్ర్యం, అసూయాద్వేషాలు లేకుండా సుఖశాంతులతో జీవించేరా??సృష్టికర్తయగు పితామహునికే ఎరుక! ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ బ్రహ్మదేవుని ఉపదేశాన్ని అర్ధం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నిద్దాం.

--------------------------------------------- 



అయ్యప్పస్వామి!…… 5 స్వరూపాలు




శ్రితజనప్రియం స్వామి చించితప్రదం
శ్రుతి విభూషణం స్వామి సాధుజీవనం
శ్రుతి మనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
     నారాయణుడు, పరమశివుడు వీరిద్దరూ తత్త్వతః ఒక్కరే అని పురాణాలు ఘోషిస్తున్నాయి. అయ్యప్ప పూజలో శంకరుని ఇష్టమైన క్షీరాభిషేకం ఉంటే, విష్ణువుకు ఇష్టమైన హోమము ఉంది. తలపై ధరించే మున్ ముడిలో శంకరునికి సంబంధించిన  మూడునేత్రాలున్న కొబ్బరికాయ, నేయి ఉండగా, పిన్ ముడిలో జీవించడానికి అవసరమైన వస్తువులున్నాయి. విష్ణువు స్థితికారుడు కాదా మరి! శంకరుని నిరాడంబరమైన నేలపడక, తెల్లవారుఝామున స్నానం, చెప్పులులేని నడక, భస్మధారణ వంటివి కనిపిస్తుండగా, మెడలో పుష్పమాల శ్రీవారి మెడలోని వనమాలను తలపిస్తుంది.
     పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్ప, ఎడమచేతి వయ్యారపు వంపుతో  విష్ణువు మోహిని అవతారానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు. ఒంటినిండా భస్మం హరరూపాన్ని తలపిస్తుంటే, ముఖాన ఉండే తిరునామం హరి రూపాన్ని చూపిస్తుంది. మెడలో రుద్రాక్షమాల శంకరునిరైతే, తులసిమాల శ్రీహరికి ప్రితిపాత్రమైనది. అయ్యప్పస్వామి దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీకమాసంలో ప్రారంభమై, శ్రీహరికి ఇష్టమైన మార్గశిరమాసంలో ముగుస్తుంది.
     అయ్యప్ప దర్శనానికి మండలకాలం(40 రోజులు) దీక్షను పాటిస్తారు. మన శారీరిక, మానసిక వ్యవస్థ భక్తితో చైతన్యవంతం కావాడానికి సుమారు 40 రోజులు పడుతుంది. అందుకే ఆయుర్వేదంలో మందులను మండల కాలం పాటు ఉపయోగించమంటుంటారు. ఆ మందులను మండల కాలంపాటు వాడితే బాగా ఒంట పడతాయన్న మాట. అలాగే మంత్ర, దీక్ష నియమాలకు కూడా మండల కాలాన్ని నిర్ణయించారు. భారతీయ శాస్త్ర సంప్రదాయంలో మండలకాల దీక్షకు ఉన్న శక్తి అటువంటిది.
     అయ్యప్ప స్వామి గుడికి ఉన్న పద్దెనిమిది మెట్లు, మోక్షమనే మేడకు ఉన్న పద్దెనిమిదిమెట్లు  అని శాస్త్రవచనం . ఇంకా ఈ 18 గురించి ఇలా చెబుతున్నారు. ఆవాహన సమయంలో అష్టదిక్పాలకులు (8), త్రిమూర్తులు (13), వారి భార్యలు (3), ఇంద్రుడు (1), బృహస్పతి (1), ఆదిపరాశక్తి (1), సూర్యుడు (1) అంటూ మొత్తం పద్దెనిమిది మంది దివినుండి భువికి దిగిరాగా, దేవాలయ ప్రతిష్ఠనాడు మృదంగ-భేరి-కాహళ-దుందుభి-తుంబుర-మర్దల-వీణ-వేణు-నూపుర-మట్టుక-డింఢిమ-ఢమరుక-ఢక్క-ధవళ-శంఖ-పటహ-జజ్జరి-జంత్ర వాయిద్యాలనే 18 వాయిద్యాలను మ్రోగించారట.
     అయ్యప్ప దీక్షను మొదలుపెట్టిన స్వాములు, వర్ణాశ్రమ ధర్మభేదం లేకుండా, మండలకాలం పాటు చెప్పే శరణు ఘోష ఓ పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని మన ముందు సాక్షాత్కారింపజేస్తుంటుంది. దీక్ష ప్రారంభించిన రోజునుంచి అయ్యప్ప స్వాములు విడివిడిగా, విడువకుండా శరణుఘోష చేయడం,అక్కడక్కడ దేవాలయాలలో చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి శరణుఘోష చేస్తూ,  వన యత్రదారులతో, కొండదారులలో శరణుఘోష చేస్తూ నిరంతరం ఆ స్వామి శరణు ఘోషను చేస్తుంటారు. ఈ ఘోష ఓ మహా శబ్ద కదలివలె శబరిమలకు చేరుకొని, ఆ శబరిగిరీశుని జ్ఞానరూపంలో ఐక్యమౌతోంది. అక్కడ శరనాభిషేకం జరిగి, భక్తుల మనసు నిర్మలమౌతుంది.
     అయ్యప్ప పూజలో దీక్షకు ఒక విధమైన తాత్కాలిక సన్యాసం. ఈ దీక్ష నిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ క్రమశిక్షణకు దూరమైన వ్యక్తులకు క్రమశిక్షణను గుర్తు చేసే క్రియ. తనను తానూ పరిశుద్ధం చేసుకోవడమే ఈ దిక్షలోని అంతరార్థం. వ్రత నియమాలను అయ్యప్ప భక్తులు ఎత్తి పరిస్థితుల్లో అతిక్రమించారు. ఆ నియమాలనుసరించి,
  • తులసి మాలను ధరించడం
  • నీలం, నలుపు వస్త్రాలు ధరించడం 
  • బ్రహ్మచర్యాన్ని పాటించడం
  • మాంసాహారం మాని, మితాహారం భుజించడం
  • చెప్పులను వేసుకోకపోవడం
  • పొగత్రాగడం, మద్యపానాలు వదిలేయడం
  • నిరాడంబరంగా జీవించడం
  • శుభ్రంగా ఉండటం
  • ఉదయం, సాయింత్రం స్నానం చేయడం
  • పరుపులు, దిండ్లు ఉపయోగించకపోవడం
  • తక్కువగా మాట్లాడటం
  • అన్నదానం చేయడం
  • బృందాలుగా ప్రార్థించడం
  • మరణం, దుఃఖాలకు దూరంగా ఉండటం
  • శాంతి స్వభావంతో మెలగడం
  • స్త్రీలను మాత్రుముర్తిగా, చెల్లెలిగా భావించడం
       గురుస్వామి ఆశీర్వచనములతో దీక్ష  ప్రారంభించిన రోజు నుండి ఒకరికొకరు ఎదురైనప్పుడు స్వామి శరణం -అయ్యప్ప శరణంఅని చెప్పుకోవడం ద్వార ఓ విధమైన ఆధ్యాత్మిక ఆనందం వెల్లివిరుస్తుంటుంది.
    ఈ విధంగా శబరిమల యాత్ర భక్తుల జీవనాన్ని ఓ క్రమపద్ధతిలో పెట్టే యాత్ర అని చెప్పొచ్చు.
    మనిషి జీవిన్నీ ఐదు దశలుగా మన పెద్దలు చెబుతుంటారు.ఈ ఐదు దశలకు ప్రాతినిధ్యం వహించే విధంగా అయ్యప్ప అవతారాలున్నాయి. ఆయన కేరళలో ఐదు చోట్ల ఈ నాలుగు రూపాలలో దర్శనమిస్తున్నారు.
1.     బాల్యం కుళత్తుపుళా
2.     యవ్వనం ఆరియంగావు
3.     గృహస్థాశ్రమం అచ్చన్ కోవిల్
4.     వానప్రస్థం శబరిమల
5.     ఏకాంతం కాంతి మలై
కుళత్తుపుళా
    పూర్వం కొట్టార్కర అనే ప్రాంతాన్ని పరిపాలించిన రాజు, ప్రస్తుతం మనకు కనబడుతున్న ఆలయాన్ని నిర్మించాడు. ఆయన వేటకోసం  ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు వచ్చిన వంటవాళ్ళు, మూడు రాళ్ళతో పొయ్యని పెట్టారట. అందులో ఒక రాయి  కాస్త పెద్దదిగా ఉండడంతో, దాన్ని సరిగ్గా పెట్టేందుకు వాళ్ళు రకరకాలుగా ప్రయత్నించారు. కానీ, వారి వల్ల కాలేదు. సరే ఈ రాయిని పగుల గొడదామనుకొని, ఆ రాయిపై ఇంకొక రాయి వేసి కొట్టారు. కానీ పోయ్యకోసం వీళ్ళనుకున్న రాయి పగులకపోగా, వీళ్ళు తీసి కొట్టిన రాయి పగిలింది. అంతకంటే ఆశ్చర్యం. ఆ రాయి నుంచి రక్తం కారడం. వెంటనే ఈ విషయాన్నీ రాజుకు చెప్పగా రాజు వేద పండితులను, నంబూద్రిలను పిలిపించారు.
విరుగగోట్టింది అయ్యప్ప విగ్రహం అని వారు చెప్పడంతో, జరిగిన అపరాధానికి  మన్నించమని అయ్యప్పను వేడుకున్న రాజు, వెంటనే ఆ ప్రాంతంలో ఓ గుడిని కట్టించాడు. ఆ ప్రాంతమే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న కుళత్తుపుళా, ఇక్కడ అయ్యప్ప బాలకునిగా వెలసినప్పటికి, ఎనిమిది ముక్కలుగా చేయబడ్డ ఆ రాళ్ళను గర్భ గృహంలో నేటికి చూడొచ్చు. పూజ చేసేటప్పుడు ఒక్కటిగా చేర్చబడే ఆ రాళ్ళు, పూజానంతరం దూరంగా జరుపబడుతుంటాయి. ఈ ఆచారం నేటికి కొనసాగుతోంది. ఈ ఆలయంలో మకర విళక్కు, విషు పండుగలు గొప్పగా జరుపబడతాయి. కుళత్తుపుళా తిరువనంతపురం నుండి సుమారు 45 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయానికి విరివిగా భక్తులు వస్తుంటారు.
అరియంగావు
    బ్రహ్మచారి అయిన అయ్యప్పకు కల్యాణోత్సవం జరిగే ఒకే ఒక పుణ్యస్థలం అరియంగావు. ఇందుకొక కారణం ఉంది. ఈ ఆలయంలో అయ్యప్ప గృహస్థాశ్రమంలో వెలసి ఉన్నాడు. అయ్యప్ప పుష్పకళాదేవిని పరిణయమాడాడు. అయితే, ఘోటక బ్రహ్మచారి అయిన అయ్యప్పకు పెళ్ళెప్పుడు జరిగిందనే సందేహం కలుగుతుంది కదూ! యోగనిష్ఠలో ఉన్న అవతారంలో ఆయనకు వివాహం జరగలేదు. శాస్తాకు మరొక అవతారంలో వివాహం జరిగిందట.
    ఈ కధనం ప్రకారం, ఓ సౌరాష్ట్రీయుడు పట్టు  వస్త్రాలను నేసి, ట్రావెన్  కూర్ మహారాజుకు సమర్పించి, ఆయన నుంచి కానుకలను పుచ్చుకుంటుండేవాడు. అలా ఒకసారి ఆ వ్యాపారి తన కూతురు పుష్పకళని కూడా పిలుచుకొని వెళుతుండగా, ఆరియంగావు వచ్చేసరికి చీకటి పడింది. దాంతో వారు అక్కడున్న ఆలయంలో తలదాచుకున్నారు. మరునాడు ట్రావెన్ కూర్ బయలుదేరిన తండ్రితో పుష్పకల, తనకు స్వామిని వదిలి కదలబుద్ధి కావడం లేదని, అందుకని తండ్రిని ట్రావెన్ కూర్  వెళ్ళి రమ్మని, ఆయన తిరిగి వచ్చేదాకా తను దేవాలయంలోనే ఉంటానని చెప్పింది. మరుమాట్లాడలేని ఆ వ్యాపారి ఆలయ మేల్ శాంతి(అర్చకుడు) దగ్గర పుష్పకలను వదలి రాజు దగ్గరకు బయలుదేరాడు. అలా వెళ్తున్నపుడు ఆ వ్యాపారి ఓ మదపటేనుగు బారిన పడగా, ఓ యువకుడు అతడిని కాపాడతాడు. మెరుపులా దూసుకొచ్చి తన ప్రాణాలు కాపాడిన ఆ యువకునుకి, తన దగ్గరున్న పట్టువస్త్రంతో అలంకరించిన ఆ వ్యాపారి, ఏం కావాలో కోరుకోమ్మంటాడు. అప్పుడా యువకుడు నీ కూతురిని నాకిచ్చి పెళ్ళి చేయమని చెప్పి, అరియంగావు గుడిలో తనను కలుసుకోమని వెళ్ళిపోతాడు. అరియంగావు గుడికి వచ్చిన ఆ వ్యాపారికి, ఎంత వెదికినా తన కూతురు కనబడదు. మేల్ శాంతి దగ్గర ఆరా తీస్తే, ఆమె స్వామిలో ఐక్యమైనట్లు చెబుతాడు. ఆ తెల్లవారుఝామున ఆలయ ద్వారాలు తెరచి, లోపలకి వెళ్ళిన పూజారి, వ్యాపారులకు ఆశ్చర్యం! అడవిలో తను ఇచ్చిన శాలువాతో ప్రత్క్షమైన స్వామిని చూసి అ స్వామి సాష్టాంగ పడతాడు. ఈ ఆలయములో స్వామివారి శ్రీకల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ ఉరికి తిరువనంతపురం నుంచి విరివిగా బస్సు సౌకర్యాలున్నాయి.
అచ్చన్ కోవిల్

     శబరిమలలో వలె ఈ ఆలయానికి పద్దెనిమిది మెట్లున్నాయి. పూర్ణ, పుష్కళలతో అయ్యప్ప దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయములో ప్రత్యేకత బంగారపు కత్తి. ఇది సాక్షాత్ దేవతలు భూమికి తీసుకువచ్చిన కత్తి అని చెప్పబడుతుంది. మిగతా రెండు దశలకు శబరిమల, కాంతిమలై  ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)