అన్ని ప్రాణుల్లో దేవుడు
మనందరమూ దేవుడి కన్నా వేరుగా లేము అనే విషయాన్ని ఒక స్వామీజీ ఆసక్తికరంగా వివరించాడు. దేవుడు అంటే ఎవరో ఆకాశంలో ఉన్న వ్యక్తి అని కాకుండా ఒక అనంతమైన తత్వం అని మనం ఒప్పుకుంటే అలాంటి అనంతానికి మొదలంటూ ఏదీ లేదు. అంచులు లేవు. మధ్యభాగం లేదు. అలాంటి అనంతానికన్నా వేరుగా మరొక పదార్థం ఉండటానికి లేదు. మరో పదార్థం ఉంది లేదా మనం ఉన్నామని చెబితే దేవుడికి మనం ఇచ్చిన నిర్వచనం దెబ్బతింటుంది. దేవుడికి పరిమితుల్ని చెప్పినట్లవుతుంది. అలాకాక దేవుడు అనంతమే అయినా నేను వేరు అన్నామంటే నేను అనేది జీరో అవుతుంది. ఎందుకంటే అనంతం కంటే వేరుగా ఏదీ ఉండలేదు కాబట్టి.
పై విశ్లేషణ గణితంలోని ఒక సమీకరణం (ఈక్వేషన్) రూపంలో ఉంది. అయినా ఒప్పుకోవడానికి మనసు అంగీకరించదు. భగవంతుడు అంటూ ఒకాయన మనల్ని పరిశీలిస్తూ, రక్షిస్తూ ఉన్నాడు అన్నప్పుడే మనకు సంతృప్తి, ఊరట. అయినా వేదాంతం పై రీతిలోనే చెబుతుంది. అందువల్ల పై సమీకరణాన్ని కొంత పరిశీలించాలి.
భగవంతుడు సృష్టి చేశాడు అన్నప్పుడు ఆయనకు కొంత ముడిసరుకు అవసరం. ఆ ముడిసరుకు అతనికన్నా వేరుగా ఉందా లేదా అతనిలో భాగమా అనే ప్రశ్న వస్తుంది. అతనికన్నా వేరుగా ఉంది అంటే అతనొక వ్యక్తిలా కూర్చొని ఉంటాడనీ, కొంత పదార్థం ఆయనకెదురుగా ఉంటుందనీ భావించాల్సి వస్తుంది. కుమ్మరి కుండను చేయాలంటే మట్టి అవసరం. మట్టిని ఉపాదాన కారణం అంటారు. ఉపాదానం అంటే ముడిసరుకు. కుమ్మరి అతను తెలివి ఉన్నవాడు. తయారీకి నిమిత్తమైనవాడు కాబట్టి నిమిత్త కారణం అన్నారు. అలాగే దేవుడు కూడా సృష్టికి కారణం అన్నామంటే దేవుడు అనంతమైన తత్వం అనే నిర్వచనాన్ని దెబ్బతీస్తుంది. అలాకాదు, భగవంతుడు తనలోనే ఒక భాగాన్ని బయటకు తీసి సృష్టించాడు అంటే ఆయన కూడా అవయవాలున్న ఒక వ్యక్తి అని తేలుతుంది. అవయవాలున్న వ్యక్తి అనంతమైన తత్వం కావడానికి వీలులేదు. మరికొందరు భగవంతుడే ప్రపంచ రూపంలో మారాడు లేదా పరిణామం చెందాడు అన్నారు. దీన్ని పాంథిజమ్ అన్నారు. అంటే మనం సృష్టిలో చూసే ప్రాణులు, రాయి, రప్ప ఇదంతా భగవంతుడే అనడం. పరిణామం చెందే వస్తువు ఒక జడపదార్థమే అవుతుంది కానీ చైతన్యస్వరూపం కాదు. కాబట్టి దీన్నీ అంగీకరించలేం.
దీన్ని వివరించడానికి వేదాంతులు కొందరు చైతన్యంలోనే ఒకానొక శక్తి ఉందనీ, ఆ శక్తియే పదార్థ రూపంలో కనిపిస్తుందనీ చెప్పారు. మనం విష్ణువనీ, శివుడనీ, పరాశక్తి అనీ మిగతా ఏ పేరుతో పిలిచినా ఈ శక్తినే పిలుస్తుంటాం. స్థూలంగా చెప్పాలంటే చైతన్యమే సృష్టిగా కనిపిస్తుంది అని వీరి వాదన. చైతన్యాన్ని గూర్చి, సృష్టిని గూర్చి అనేక వాదనలు మనకు ఉపనిషత్తుల కాలం నుంచి కనిపిస్తాయి.
మనిషికీ, అన్ని ప్రాణులకూ తెలివి అనే అంశముంది. చైతన్యమంటే ఇదే. ఈ దృష్టికోణం నుంచి చూస్తే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఈ తెలివి అన్నది శరీరంలో పుట్టిందా లేదా శరీరానికి బయటి నుంచి వచ్చిందా అని ప్రశ్న. భౌతికవాదులు శరీరంలోని వివిధ అవయవాల కలయిక వల్ల చైతన్యం ఏర్పడిందని చెబుతారు. ప్రయోగశాలలో కొన్ని పదార్థాలు కలిసినప్పుడు ఒక కొత్త పదార్థం ఏర్పడినట్లు, లేదా మద్యం తాగినప్పుడు మత్తు కలిగినట్లు చైతన్యం ఏర్పడుతుందని వీరి వాదన. భౌతికవాదులు కాక మిగతావారంతా చైతన్యం వేరుగా ఉందని ఒప్పుకున్నవారే. చైతన్యమనేది కొత్తగా పుట్టేది కాదు. ఎల్లప్పుడూ ఉండేది అని వీరి వాదన.
వేదమంత్రాలు ఈ చైతన్యమే మనిషి (ప్రతి ప్రాణి యొక్క) బుద్ధి అనే గుహలో ఉందని చెబుతాయి. బుద్ధిని గుహ అనడం కూడా ఒక ఆసక్తికరమైన ప్రయోగం. శరీరాన్ని స్థూలంగా చూస్తే రక్తమాంసాలతో కూడిన ఒక అంశం మొట్టమొదటగా కనిపిస్తుంది. దీనిలో ప్రాణం అనేది తరవాత, దాని తర్వాత ఇంద్రియాలు, మనసు ద్వారా ఒక ప్రాణి ఆలోచించడం కనిపిస్తాయి. ఇవన్నీ ఒకదాని లోపల ఒకటి సొరుగుల్లాగా భావించవచ్చు. ఉపనిషత్తులు ఈ సొరుగుల్నే కోశాలు అన్నాయి. ఈ కోశాలన్నింటికన్నా లోపల ఉన్నట్లుగా తెలిసేది బుద్ధి. అందువల్ల దీన్ని గుహ అన్నారు. ఈ గుహ గురించిన వేదమంత్రాలను ప్రతిరోజూ మనం దేవాలయాల్లో వింటూంటాం. పరమాత్మ చైతన్యమే ఈ బుద్ధి అనే గుహలో కనిపిస్తుందని ఈ మంత్రాల భావన. స బ్రహ్మ, స శివః, స హరిః, సేంద్రః అంటూ ఇదే బ్రహ్మ, ఇదే శివుడు, ఇదే హరి, మనం చెప్పుకునే దేవుడి రూపాలన్నీ ఈ చైతన్యమే. ఇదే నీ స్వరూపం అని వీటి అర్థం. అర్చకులు పూజ తర్వాత చిట్టచివర చెప్పే మంత్రపుష్పంలో కూడా త్వం బ్రహ్మ, త్వం రుద్రః, త్వం ప్రజాపతిః మొదలైన మంత్రాల్లో ఇదే భావాన్నే చెబుతుంటారు. కానీ మనకు వాటి అర్థం తెలియదు కాబట్టి వాటిలోని తత్వచింతన బోధపడదు.
మనిషికి మతంలో ఉన్న కట్టుబాట్లు, మతం చెప్పే పూజా విధానాలూ మొదలైన వాటితోనే సంతృప్తి కలుగుతుంది. తనకున్న కోర్కెల్ని సఫలం చేసుకోవడానికి యజ్ఞాలు, వ్రతాలు సులభంగా చేయగలడు. తత్వాన్ని గురించి ఆలోచించమంటే కష్టమైన విషయం. దీన్ని గమనించిన వేద ఋషులు పనిలోపనిగా ఆ వ్రతాలకు సంబంధించిన మంత్రాల్లోనే తత్వాన్ని గురించిన విషయాలన్నీ చెప్పారు. మనిషి తన స్వభావం కొద్దీ కర్మలు చేస్తూ ఉంటే, ఎప్పుడో ఒకప్పుడు తత్వంపైకి మనసు మళ్లుతుందని వారి ఆశ.
పరమాత్మ చైతన్యం కన్నా మనం వేరు కాదు అని చెప్పడానికి వేదాంతులు మరొక ఉదాహరణ చెబుతుంటారు. సముద్రంలో అలలు ఏర్పడుతుంటాయి. ఈ అలల స్వరూపం కూడా నీరే. అయినా అల అంటూ ఒక ఆకారం, పేరు ఉన్నాయి. అలాగే బంగారం ముద్ద నుంచి తయారయ్యే పలురకాల ఆభరణాలకు ఆకారాలు, పేర్లు ఉన్నాయి. కానీ వాటి అసలు స్వరూపం బంగారమే. అలాగే భగవంతుడు ఒక సముద్రం లేదా ఆకాశం లాంటి చైతన్య స్వరూపం. ఆ ఒకే చైతన్యమే అనేక రూపాల్లో కనిపిస్తుందని వీరి వాదన. చైతన్యానికీ, మనిషికీ ఉన్న ఈ సంబంధాన్ని ప్రస్తుతం భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, జీవశాస్త్రం ఇవన్నీ కలిసి వాటివాటి పరిధిలో పరిశీలిస్తున్నాయి. శాస్త్రవేత్తలు appearance and reality అనే విషయంపై మన వేదాంతులు చెప్పిన అనేక విషయాలతో ఏకీభవించడం కూడా గమనించాల్సిన విషయం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి