సమస్యలు మనిషిలోని పోరాటశక్తిని పదునెక్కిస్తాయి
ఒక రైతు తన పొలంలో బంగారు తీగెల రకం ధాన్యం పండించదలచి, పెట్టుబడి ఎక్కువ పెట్టాలి కనుక ఎందుకైనా మంచిదని జ్యోతిష్యం తెలిసిన పండితుణ్ని సంప్రతించాడు. ఆయన వేళ్ల మీద లెక్కలు వేసి, ఆకాశంకేసి చూస్తూ ‘ఉహూ... లాభం లేదు. ఈ ఏడాది వానలు సరిగ్గా పడవు. పంట వెయ్యకు’ అన్నాడు. రైతు నిరాశగా తిరిగి వచ్చేశాడు. ఆశ్చర్యంగా పక్క పొలం రైతు అదే పంట వేశాడు! రైతు తాను విన్న భవిష్యవాణి గురించి అతడికి చెప్పాడు. ఆ రైతు నవ్వి ‘నేను అలాంటివి నమ్మను. నా రెక్కల కష్టాన్నే నమ్ముతాను’ అన్నాడు.
అన్నట్లుగానే తన కృషి మీద పూర్తి నమ్మకంతో ఆ రైతు పంటను శ్రద్ధగా చూసుకున్నాడు. భవిష్యవాణికి విరుద్ధంగా చేను విరగపండింది. వానలు సరిగ్గా పడవనే భవిష్యవాణిని నమ్మిన రైతు మామూలు ధాన్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
స్వయంకృషి వల్ల శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. గట్టి సంకల్పం ఉంటే అసాధ్యమనేదే ఉండదు. విద్యార్థులు శ్రద్ధ, కృషి జోడిస్తే తప్పటమనే ప్రశ్నే తలెత్తదు. ‘నేను మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుణ్ని కావాలి’ అనే పట్టుదలతో ప్రారంభం నుంచే కృషి చేస్తే, ఎవరైనా తప్పకుండా ప్రథమ శ్రేణి సాధించగలుగుతారు.
క్రీడాస్ఫూర్తీ ఇలాంటిదే. ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే విజయం తథ్యం. ఆ మాటకొస్తే, అన్ని రంగాలకూ ఈ సూత్రం వర్తిస్తుంది. కుందేలు-తాబేలు కథ ఇందుకు సంబంధించిందే.
‘నాకు తెలివి ఉంది. రోజూ కష్టపడి చదవాల్సిన పని లేదు’ అని బద్దకిస్తే పరీక్షల్లో అభాసుపాలు కాక తప్పదు. ‘నేను ఏ రోజుకారోజు జాగ్రత్తగా చదువుకోవాలి. లేకపోతే పరీక్షల్లో ఇబ్బంది పడతాను’ అని గ్రహించి కృషి చేసినవారికి ఉత్తమశ్రేణి ఫలితం వచ్చినా ఆశ్చర్యం లేదు.
మన భవిష్యత్తు మన కృషిలోనే దాగి ఉంటుంది. జాతక చక్రాల్లో ఉండదు. దైవాన్ని, స్వయంకృషిని నమ్మినవారు చిన్నచిన్న సమస్యలకు చలించరు. పెద్ద సమస్యలు వచ్చినా ధీరచిత్తంతో నిలుస్తారు. కెరటం లాగా మీదకు వచ్చే సమస్య అంతలోనే తొలగిపోతుంది.
తూటాలకు భయపడేవారు సిపాయిలుగా పనికిరారు. రోగుల్ని చూసి చీదరించుకునేవారు వైద్యులుగా అనర్హులు.
జీవితం నల్లేరుపై నడకలాగా, సమస్యలనేవే లేకుండా వెన్నెల రాత్రుల్లా సుఖమయంగా గడిచిపోవాలనుకోవడం అజ్ఞానం.
సమస్యలు మనిషిలోని పోరాటశక్తిని పదునెక్కిస్తాయి. కష్టాలు మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. నేలను నాగళ్లు చీల్చి విత్తనాలు చల్లినప్పుడే పంట పండుతుంది. నేలమీద చల్లితే కాదు!
ప్రకృతిలో మనకు అనేక జీవన సత్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. గురుచరిత్రలో సిద్ధుడు తన ఆధ్యాత్మికతకు తాను చూసిన ప్రతి జీవీ ఒక బోధ చేసినట్లుగా భావిస్తాడు. మన మనసు అలాంటి స్థితికి చేరుకోవడమే అసలైన ఆధ్యాత్మిక ప్రయోజనం. గతాన్ని పదేపదే గుర్తు చేసుకుంటూ, చీటికిమాటికి భవిష్యత్తు గురించి భయపడుతూ, వర్తమానాన్ని వ్యర్థం చేసుకోవడమే చాలామంది చేసే తప్పు.
మన భవిష్యవాణి, వర్తమాన కృషి మాత్రమే చెప్పగలదు- జాతక శిఖామణులు కారు!
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి