వ్యాస పౌర్ణమి

వ్యాసుడి విజ్ఞానం ఎవరినైనా సంభ్రమాశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించాడు. అవి విడదీయడానికి సాధ్యం కానట్లుగా కలిసిపోయాయి. వ్యాసుడు వేదాలను విభజించి, తిరిగి మనకు ప్రసాదించాడు. ఆయన గొప్ప శాస్త్రవేత్త.

భారత ఇతిహాసాన్ని రచించిన వ్యాసుడు, మన ప్రాచీన పవిత్ర గాథలకు మూలమైన పద్దెనిమిది పురాణాలను వెలువరించాడు. ఇవన్నీ చేయడం మానవమాత్రుడికి సాధ్యమా? అందుకే భక్తులు ఆయనను మహావిష్ణువుగా భావిస్తారు.

జగద్గురువుల్లో ప్రథముడు వ్యాసుడే. వ్యాస పూజ అంటే వేద పూజ, ఈశ్వర పూజ! దైవానుగ్రహం కావాలంటే, గురువు ఆశీస్సు లభించాలి. మనలోని అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి, వెలుగు చూపినవాడే గురువు. ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించిన జ్ఞాన సంపన్నులను గురువులుగా పరిగణించి, శిష్యులు వారికి పూజ చేస్తారు. వ్యాస పూర్ణిమనాడు మనం పూజించేవ్యాసుడుఫలానా వ్యక్తి అని ఒక్కర్ని గురించి చెప్పేపదంకాదు. అదిపదవి’! అది సకల కళానిధి, మహాజ్ఞాని అయిన వేదవ్యాసుడి పరంపరలో వచ్చిన, వస్తున్న, రానున్న గురువులందరికీ చెందుతుంది. అందువల్ల వ్యాసపూర్ణిమనాడు ఎవరి గురువులను వారు ఆరాధించుకోవచ్చు. కలియుగంలో పండుగను పాటించే సంప్రదాయాన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చెబుతారు.

ఒకప్పుడు యతీశ్వరులు, సర్వసంగ పరిత్యాగులు పాటించిన పర్వదినం, ఇప్పుడు జన సామాన్యంలోకి వచ్చింది. నేపాలులో ఇది ముఖ్యమైన పండుగ. మన దేశంలోనూ అనేక విద్యాలయాల్లో గురుపూజ, వ్యాసపూజ జరుగుతాయి. శంకర పీఠాల్లో గురుపూర్ణిమ భక్తి ప్రపత్తులతో జరుగుతుంది.

ప్రస్తుతం 28 మహాయుగంలోని కలియుగంలో జీవిస్తున్నాం. ప్రతి మహాయుగంలోనూ మహావిష్ణువువ్యాసుడుగా అవతరిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మొదటి వ్యాసుడు స్వాయంభువుడు; 27 వ్యాసుడు జాతూకర్ణుడు. ఇప్పటి వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు.

మానవజాతికి మహోపదేశం చేసేవి వేదాలు. సోమరితనం పాపమని, కృషిచేసేవాడికే దైవం తోడ్పడతాడని, శ్రమలోనే సంపద ఉన్నదని, ఉత్సాహవంతుడికి విద్య లభిస్తుందని, మనసు ఎప్పుడూ శుభాన్ని కోరాలని, అన్ని ప్రాణుల్నీ స్నేహబుద్ధితో చూడాలని... వేదం పలుకుతున్నది. ధార్మిక సేవకు వేదం మూలమని మనుస్మృతి పేర్కొంది. ఇలాంటి అద్భుత వైదిక వాంగ్మయం నేటికీ మనకు లభిస్తుండటానికి కారకుడు వ్యాసుడు!

మన పవిత్ర పారాయణ గ్రంథం భగవద్గీత. తిలక్‌, గాంధీలను కర్తవ్య దీక్షాదక్షుల్ని చేసిన భగవద్గీత మహాభారతంలోది. వేదసారాన్ని పిండిపంచమవేదమైన మహాభారతాన్ని అందించిన మహర్షి- వేదవ్యాసుడు. కొత్త పురాణం రచించినవారినివ్యాసుడుఅనడం రివాజు. వేదబోధను సామాన్యుల వద్దకు చేర్చడానికి భారతాన్ని రచించి, మళ్ళీ భారత ఉపదేశాన్ని భగవద్గీత ద్వారా ఆయన సరళ సుందరంగా సంక్షిప్తీకరించాడు. శంకరాచార్యుల భాష్యంతో భగవద్గీతా జ్ఞానం అందరికీ మరింత చేరువ అయింది.

సత్యవతీ పరాశరుల పుత్రుడైన వ్యాసుడు భారతాన్ని రచించడమే కాదు, మహేతిహాసంలో తానూ ఒక పాత్రగా పలు పర్యాయాలు దర్శనమిస్తాడు. భారత రచనతో సంతృప్తి చెందని వ్యాసుడు, భాగవతాన్నీ రచించి ధన్యుడయ్యాడు.

వేదం ప్రభువులా శాసించి చెబుతుంది. పురాణం మిత్రుడిలా కథారూపంలో ప్రబోధిస్తుంది. ఇటువంటి భారతీయ సాంస్కృతిక మూలస్తంభాల నిర్మాతగా వ్యాసుడు అందరికీ వందనీయుడయ్యాడు. ఆయన జన్మతిథి ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఆధ్యాత్మిక జ్ఞాన ప్రదాతలందరికీ ఆద్యుడైన వ్యాసుడి పుట్టినరోజు పండుగను గురుపూజోత్సవంగా, కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమా వ్రతంగా ఆచరిస్తారు. శివభక్తులు శివ శయన వ్రతాన్ని పాటిస్తారు. ఆధ్యాత్మికవేత్తలకే పరిమితమైనవ్యాసపూర్ణిమనేడు సర్వజన హృదయాహ్లాదకరమైనగురుపౌర్ణమిగా వ్యాప్తి చెందడం శుభ పరిణామం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

శివుని రూపాల వెనకున్న అంతరార్థం ఇదే!