తొలి ఏకాదశి

తిథుల్లో ఏకాదశి శుభప్రదమైనది. ఆషాఢమాసంలో శుక్లపక్షమిలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా ఆధ్యాత్మికగ్రంథాలు పేర్కొంటున్నాయి. పవిత్ర దినాన్ని శయన ఏకాదశిగా లేదా సర్వేషాంశయనైక ఏకాదశిగా కూడా పిలుస్తారు. రోజు నుంచే చాతుర్మాస్య వత్ర దీక్షలు ప్రారంభమవుతాయి. పాలకడలిలో శేషపాన్పుపై పవళించిన శ్రీమహావిష్ణువు తొలి ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. అందుకనే ఏకాదశిని పరమ పవిత్రంగా పేర్కొంటారు. భాగవత పురాణంలో ఏకాదశి వ్రతానికి సంబంధించిన ఒక కథ వుంది. అంబరీషుడనే రాజు శ్రీమహావిష్ణువుకి పరమభక్తుడు. ఒక రోజు ఆయన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తుండగా దుర్వాసమహాముని వస్తాడు. ద్వాదశి నాడు ఆతిథ్యాన్ని స్వీకరిస్తానని దుర్వాసుడు చెప్పడంతో అంబరీషుడు ఆనందభరితుడవుతాడు. ద్వాదశ ఘడియలు వచ్చే సమయంలో దుర్వాసముని స్నానానికి వెళతాడు. ఇంతలో ద్వాదశ ఘడియలు వచ్చాయి. ముని ఎంతకు రాకపోవడంతో ద్వాదశ ఘడియలు వెళ్లిపోతే ఏకాదశి వ్రత ఫలం దక్కదని హితులు చెప్పడంతో అంబరీషుడు తులసీతీర్థం పుచ్చుకుంటాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన దుర్వాసుడు ఆగ్రహంతో నేను రాకుండానే తీర్థం స్వీకరిస్తావా అంటూ అంబరీషుడిపై ఒక కృత్యను సృష్టించి వదులుతాడు. శ్రీమహావిష్ణువు ధ్యానంలో వున్న రాజు దగ్గరకు కృత్య చేరుకోగా సుదర్శన చక్రం వెంటనే కృత్యను సంహరించి దుర్వాసుడిపైకి వెళుతుంది. దీంతో భీతిల్లిన దుర్వాసుడు త్రిమూర్తులైన ఈశ్వరుడు, మహావిష్ణువు, బ్రహ్మ దగ్గరకు వెళ్లి ప్రాణభిక్ష కోరుకుంటాడు. అయితే వారు అభయమివ్వకపోవడంతో చివరకు అంబరీషుడి దగ్గరకు వచ్చి తనను రక్షించమని వేడుకోవడంతో రాజు వినతి మేరకు సుదర్శనచక్రం తిరిగి విష్ణువును చేరుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే భగవత్శక్తికి మించిన తపోశక్తి లేదని అవగతమవుతుంది. శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శుక్ల ఏకాదశి అని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కృష్ణ ఏకాదశి అని పరిగణిస్తారు. తిథుల్లో 11 రోజున ఏకాదశి తిథివస్తుంది. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సును కలిపి 11 ఇంద్రియాలుగా పేర్కొంటారు. ఏకాదశి నాడు భగవత్స్మరణతో పాటు ఉపవాసముంటే పరమాత్మ వైపు నడవడమే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

శివుని రూపాల వెనకున్న అంతరార్థం ఇదే!