మానవుడు తనకు తానే మిత్రుడు, శత్రువు
మానవుడు తనకు తానే మిత్రుడు, శత్రువు అంటారు. శారీరక వికాసం ద్వారా మనం శరీరసౌందర్యం, ఆరోగ్యం రెండింటినీ వృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఆర్థిక వికాసం కోసం ధనం వృద్ధి చేసుకోవాలి. వైజ్ఞానిక ఉన్నతి మనకు అనంతమైన వివేకాన్నిస్తుంది. మనిషి రోజురోజుకూ దిగజారిపోవటానికి కారణం భావనాత్మక వికాసం, ఆధ్యాత్మిక వికాసం లోపించటమే.
భావనాత్మక వికాసమంటే ఆలోచనలు, భావనలు, దృష్టికోణం ఉన్నతంగా ఉంచుకోవడం. ఇవి మన ఇంద్రియాల్ని నడిపిస్తాయి. ఈ ప్రపంచాన్ని నియంత్రించటానికి సమర్థవంతమైన ఆత్మికశక్తి అవసరం. ఆ ఆత్మను శక్తివంతంచేసేది పరమాత్మ.
మనసులో ఉత్పన్నమయ్యే క్రోధం, ఈర్ష్య, భావనలు పోటీని కలుగజేస్తాయి. వీటిని అణిచివేస్తే అంతర్గత సంఘర్షణ జరుగుతుంది. వీటిని నియంత్రించి, మంచి మార్గంలో నడిపించడమనేది భావనాత్మక వికాసంతో మాత్రమే వస్తుంది. మనం పెద్ద పెద్ద డిగ్రీలు అందుకుంటాం. ఇతరులతో పోల్చుకుని తాను గొప్పవాడిననే అహంకారంతో వారిని అణిచిపెట్టడం, బాధించడం, కోపగించడం మొదలైన చెడు భావనలు ఉత్పన్నమైనపుడు వాటిని నియంత్రించే జ్ఞానం మనం నేర్చుకోవడం లేదు.
ఈ రోజుల్లో పదో తరగతి చదివే పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న సంఘటనల్ని చూస్తున్నాం. ఇందుకు కారణం వారిలో చంచల భావనను కట్టడి చేసే జ్ఞానం లేకపోవటమే. పాఠ్యాంశాలలో మహా పురుషుల జీవితచరిత్రలు, పౌరాణికగాథలు, ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. గాంధీజీ మార్గమైన సత్యం, అహింస.. లాంటి మంచి విలువలు పాఠాల్లో ఉంటాయి. ఝాన్సీలక్ష్మీభాయి ధైర్యం, మదర్థెరిస్సా ప్రేమ, సేవాభావన ఉంటాయి.
ఉన్నత విలువలుండే పాఠాలు చదివితే ఒక్కసారిగా మనసులో ఉద్వేగం వస్తుంది. వెంటనే సద్భావన ఆకాశంలోని మెరుపులా, సముద్రంలోని అలలా పుడుతుంది. మెరుపు, అల స్థిరంగా ఉండలేవు. అలాగే జీవితచరిత్రలు చదివి గొప్పవారయ్యేవారి మనసు స్థిరంగా ఉంటుందా? ఏదైనా ఆ మెరుపు, అలను స్థిరంగా ఉంచాలంటే విద్యార్థికి సాధన ప్రక్రియ కావాలి. దీని వల్ల చెడుభావనల్ని కట్టడిచేసుకోవచ్చు. మానసిక శక్తిని పెంపొందించుకుని ఉన్నత స్థాయికి చేరటమెలాగో తెల్సుకోవాలి.
గుణాన్ని, బుద్ధినిచ్చేవాడు భగవంతుడు. దేహచింతనకు బదులు సత్యం, శివం సుందరుడైన పరమాత్మ దివ్య చింతనలో మనసును నిమగ్నం చేస్తే ఆ వ్యక్తి భ్రమించే మనసుకు మార్గం లభిస్తుంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి