దేవాలయం

త్య, జ్ఞాన, ఆనందాత్మకమైన తత్వాన్ని స్థూలంగా ‘దేవ’ అనే పదంతో వ్యవహరిస్తున్నాం. దేవనామ రూపకల్పన ‘శబ్ద బ్రహ్మం’లాగా నిత్య సత్యమైన విషయం. సర్వాంతర్యామి అయిన ఒకే ఒక పద చైతన్యం ఉంది. దాన్ని మానవుడు ఎక్కడ కోరుకుంటే అక్కడ సాక్షాత్కరించుకోవచ్చు. అది వైదిక రుషుల దివ్య సందర్శన నాదం.
దేవతామూర్తిలో భక్తుడు దివ్య చైతన్యాన్నే దర్శించుకుంటాడుగాని జడమైన పాషాణాన్ని కాదు. మనకు అగోచరమైనవాటి భౌతిక ప్రతిరూపాలే దేవాలయాలు. మనిషి ఏది చూస్తాడో, ఏది తనకు అనుభవంలోకి వస్తుందో అది మాత్రమే సత్యమనుకొంటాడు. చాలామంది తాము బతికి ఉన్నంతకాలం జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకుంటున్నారు. వాటితో అనుభవించినవి తప్ప, మరేవీ వారికి వాస్తవం కావు. భౌతికమైనవాటినే అవి గ్రహించగలవు. మన గ్రహణశక్తి అయిదు ఇంద్రియాలకే పరిమితం కావడం వల్ల జీవితంలో మనకు తెలిసేవన్నీ భౌతికమైనవే. మన దేహాలు, మనసులు, ఆవేశాలు, జీవన శక్తులు- అన్నీ భౌతికాలే!
సునిశితంగా పరిశీలిస్తే, దీనిపై విశాలమైన శూన్యం గోచరిస్తుంది. అక్కడా మనం భౌతికరూపాన్నే గుర్తిస్తున్నాం. రాత్రివేళల్లో నక్షత్రాల్ని, చంద్రుణ్ని, పగటిపూట సూర్యుణ్ని భౌతిక పదార్థాలుగా చూస్తున్నాం.
దేవాలయమైనా, మసీదైనా, చర్చి అయినా, వేరొక ఆరాధనా స్థలమైనా భౌతిక విషయాలకు అతీతమైన ప్రపంచంతో మనిషిని అనుసంధానిస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు ప్రాపంచిక మానవుణ్ని భగవంతుడితో అనుసంధానించి, జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. అంతేకాదు- నిత్యం చిత్తశుద్ధితో చేసే ప్రార్థనలు మనిషిని ఉన్నతుణ్ని చేసి దివ్యానుభూతులు పొందేలా చేస్తాయి.
ఒక భక్తుడు విశ్వాసం నిండిన హృదయంతో ప్రార్థనా మందిరాన్ని దర్శిస్తే అతడు మానసిక ప్రశాంతత అనుభవిస్తాడు. దైవాన్ని దర్శించడం, సాధుపుంగవుల మంచి మాటలు వినడం, ప్రార్థన చేయడం వల్ల శాంతి చేకూరుతుంది. ప్రతి మతం తనదైన సంప్రదాయ విధానంలో ఆలయాలను, ప్రార్థనా మందిరాలను నిర్మించుకొంటుంది. అవి పూజలకు స్ఫూర్తికేంద్రాలు.
సమాజాన్ని దృఢతరం చేసి, మనుషులందరిలోనూ పరస్పర విశ్వాసం, విశ్వసనీయత రూపొం దించేవి ఆలయాలు. పాఠశాలలు విద్యను బోధిస్తాయి. మరి ఆత్మను జ్ఞానవంతం చేసేదెవరు? వైద్యశాలలు విరిగిన ఎముకల్ని అతకగలవు గాని, చెదిరిన ఆశలను ఉజ్జీవింపజేయలేవు. చలన చిత్రాలు, ఇతర వినోదాలు ఇంద్రియాలను ఉద్రేకపరచగలవు. మనశ్శాంతి కోసం ఎక్కడికి వెళ్లాలి?
దేవాలయాలు ఆత్మను పరిశుద్ధం చేసి, వ్యాధిపూరితం కాకుండా కాపాడతాయి. కొన్ని వ్యాధులు కనిపించవు. అవి అనుభవం వల్లనే తెలుస్తాయి. మన ధర్మశాస్త్రాలు ఆ రోగాలకు చికిత్సశాలలుగా దేవాలయాలనే చెబుతున్నాయి. పాఠశాలలు, వైద్యశాలలు ఎంత అవసరమో దేవాలయాలు కూడా అంతే అవసరం. మనిషికి దేహం, ఆత్మ రెండూ ఉన్నాయి. దేన్నీ అలక్ష్యం చెయ్యకూడదు.
ఆరాధనా స్థలాలు భగవంతుడి పట్ల మానవుడి వివేకవంతమైన భావనకు ప్రతిరూపాలు.
ఏ మతంవారిదైనా ఆ ప్రార్థనా మందిరంలోకి ఆ భక్తులు ధ్యానం కోసం ప్రవేశించినప్పుడు- వారిలో ఒక దివ్యచేతన జ్ఞానం, ఏకీకృత భావం చోటుచేసుకుంటాయి. దేవాలయంలో అనుసంధానం ద్వారా మనం ఉన్నత పథంలో విహరించగలుగుతాం. మనల్ని మనం నియంత్రించుకోవడానికి తగిన శక్తిని పొందగలుగుతాం.
ఒకప్పుడు దేవాలయాలు విద్యాసాంస్కృతిక కేంద్రాలుగా, జ్ఞాన మందిరాలుగా విలసిల్లాయి. ప్రతి వ్యక్తికీ భుక్తినిచ్చి బతికిస్తూనే, ముక్తిమార్గాన ముందుకు నడిపించగల ఆరాధన, సాధన మార్గాలు అవి. ఎన్నెన్నో వృత్తులు, ప్రవృత్తులు దేవాలయాల వల్ల ప్రారంభ వికాసాలను పొందాయి. ఆలయాలే అన్ని వర్గాలనూ నైతిక మార్గంలో ముందుకు నడిపించాయి. ఏ జాతికైనా దేవాలయాలే సమైక్యతా కేంద్రాలు!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)