మనుషులకు అదొక మౌన సందేశం!
ప్రవహించే
నదిలా కాలం మన కళ్లముందు కదిలిపోతుంటుంది. ఏ నదైనా సముద్రంలో కలిసేదే. ఆలోగా అది
దారిలోని వృక్షాలకు, పంట
పొలాలకు ప్రాణప్రదమైన జలాల్ని ఉదారంగా ఇస్తూ వెళుతుంది. ప్రవహించినంత కాలమూ నది-
లోకానికి ఉపకారం చేస్తుంది.
మనుషులకు
అదొక మౌన సందేశం!
కాలంతో
మనిషి జీవితం ముడివడి ఉంది. రోజులు గడుస్తున్నకొద్దీ అతడు శారీరకంగా ఎదుగుతుంటాడు.
అతడితో పాటు మొక్కలూ ఎదిగి చెట్లుగా మారుతుంటాయి. అవి తమ ఫలాల్ని ఉదారంగా
అందిస్తుంటాయి. తమకు ఉన్న అన్నింటినీ సమభావంతో పక్షులకు, ఇతర
ప్రాణులకు సమర్పిస్తుంటాయి. మొక్కలు సైతం తాజా పుష్పాల్ని నిస్వార్థంగా దైవపూజ
కోసం సిద్ధం చేస్తుంటాయి. వాయువుదీ ఉదార స్వభావమే. అది ఉదయ, సాయంసంధ్యా
సమయాల్లో ఉల్లాసంగా వీస్తుంటుంది. ఆ పవనాల్లో భగవంతుడి పట్ల ఆరాధ్యభావం
కనిపిస్తుంటుంది. వీటన్నింటినీ చాలామంది పెద్దగా పట్టించుకోరు!
మనిషి
పుడుతూనే ఆర్తి (దుఃఖం) వ్యక్తపరుస్తాడు. ఆకలి తీర్చాలని రోదిస్తూ జీవనయానం
ప్రారంభిస్తాడు. ఆ క్షణం నుంచీ అతడికి అన్నీ కోరికలే! వాటిని ఎలా తీర్చుకోవాలా అని
ఎప్పుడూ దారులు వెతుకుతుంటాడు. ఆ ఆశలు తీరేందుకు, కోరికలు నెరవేర్చుకొనేందుకు తన తెలివితేటల్ని
వెచ్చిస్తాడు. సాధారణ పరిభాషలో, ఎంత
అధికంగా ఆస్తిపాస్తులు సంపాదిస్తే అంత తెలివిగలవాడిగా ప్రపంచంలో చలామణీ అవుతాడు.
అతడి దృష్టిలో ప్రయోజకత్వం అంటే అదే! ప్రయోజకుడు కావడమంటే- ప్రపంచంలో గొప్ప
సంపన్నుడిగా, గౌరవ
హోదాలు కలిగినవాడిగా రూపొందడమే అనే బలమైన భావన మనిషిని నడిపిస్తోంది.
ఆధ్యాత్మికంగా
ఎంత సంపాదించామన్న లెక్కలు ఎవరి దగ్గరా ఉండవు. ఆ తరహా ఆస్తిపాస్తులు బహిరంగమయ్యేలా
ప్రపంచంలో సంచరించే వారంతా ఆధ్యాత్మిక సంపన్నులు కారు. విలువైన వస్త్రాలు, నగలు
ధరించినంత మాత్రాన ఎవర్నీ ఆ సంపన్నులుగా భావించలేం. నిజమైన సంపద- ఆడంబరాల్లో
ఉండదు.
సద్గుణ
సంపదే అసలైన సంపద అని పెద్దలంటారు. సంపద అంటే, మనిషిని కేవలం సంతోషపెట్టేది కాదు. అందరికీ, అన్ని
ప్రాణులకు ఆనందం కలిగించేదే సంపద. అది ఉన్నప్పుడే మనిషి- లోకంలో అందరికీ
అభిమానపాత్రుడిగా మారతాడు.
అన్ని
సద్గుణాల్లోనూ ముఖ్యమైనది భగవంతుడి పట్ల అచంచల విశ్వాసం. మనుషుల్లో ఎక్కువమందిది
చంచల విశ్వాసం. ఏ దైవంమీదా స్థిరభక్తి ఉండదు. ‘మ్రొక్కిన
వరమీని వేల్పు మనకేల’ అనుకుంటూ వేర్వేరు దేవుళ్లకు మొక్కుతుంటాడు. ‘అందరు
దేవతలూ ఆ పరమాత్మ అంశలే’ అనే ప్రాథమిక సత్యం అతడికి గుర్తుండదు. అందువల్ల
చంచలభక్తి పీడితుడిగా ఉంటాడు. అమూల్య జీవనకాలాన్ని వ్యర్థం చేసుకుంటాడు. మరో తరహా
భక్తులు ‘మేం ఉత్తమ భక్తులం కాము... అందుకే మమ్మల్ని
దేవుడు అనుగ్రహించటం లేదు’ అని నిరాశతో కుంగిపోతుంటారు.
నిజభక్తి
అంటే, భగవంతుణ్ని
ఎటువంటి కోరికలూ కోరకపోవటం. ‘ఈ కోరిక తీరిస్తే నిన్ను దేవుడిగా నమ్ముతా’
అని భగవంతుడికి పరీక్ష పెట్టకపోవడం!
భగవంతుడు
అనుక్షణం మనిషికి పలు ఉపకారాలు చేస్తూనే ఉన్నాడు. అది గ్రహించగల జ్ఞాన సంపదను
సొంతం చేసుకోవడమే మనిషి పని. ఆ జ్ఞాన సంపాదనకు ప్రయత్నించడమే ఆధ్యాత్మిక కృషి. అది
ఎప్పుడూ నిస్వార్థంగా ఉండాలి. అప్పుడే దైవానుగ్రహం తప్పక లభిస్తుందని పురాణగాథలు
విశదీకరిస్తున్నాయి.
కొందరు
వ్యక్తిగత జీవితంలో ఘనవిజయాలు సాధిస్తుంటారు. తమ తమ రంగాల్లో ఉన్నత స్థితికి ఎదిగి
ప్రశంసలందుకుంటారు. అటువంటివారికే ప్రపంచంలో జీవన సాఫల్య పురస్కారాలు
లభిస్తుంటాయి.
ఉత్తమ
ఆధ్యాత్మిక ప్రగతి సాధనే మనిషికి జీవిత లక్ష్యం కావాలి. అటువంటి ఉదాత్త జీవనం
గడిపినవారిపైనే భగవంతుడి చల్లని చూపులు ప్రసరిస్తాయి. వారినే జీవన సాఫల్యం
అనుగ్రహిస్తుంది!
-
కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి