సడలని సంకల్పం

వారణాసి పట్టణంలో బోధిసత్త్వుడు పెద్ద వ్యాపారి. ఆయన తన పరివారంతో వెళ్లి దేశవిదేశాల్లో వ్యాపారం సాగించేవాడు. ఒకసారి 500 బండ్ల మీద సరుకులతో, వెయ్యి మంది పరివారంతో ఎడారి మార్గం గుండా ప్రయాణం ప్రారంభించాడు. ఉదయం ఎనిమిది

దాటితే చాలు ఎడారిలో ఎండ మండిపోయేది. గాలికి సన్నటి ఇసుక మేఘాల్లా కప్పేసేది. అందుకే పగటి పూట నీళ్లు దొరికే ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని రాత్రి వేళలో ప్రయాణం చేసేవారు. వారికి మార్గదర్శకుడొకరు సహాయం చేసేవాడు. అతడు ముందు బండిలో ఉండేవాడు. రాత్రి వేళలో ఎడారిలో దిక్కులు తెలియవు కాబట్టి.. ఆకాశంలో నక్షత్రాలను పోల్చుకుంటూ అతడు ముందుకు సాగేవాడు. అతని బండి వెనుకే మిగిలిన బళ్లు అనుసరించేవి.

ఓరోజు మార్గదర్శి వారితో.. ‘ ఒక్కరాత్రి ప్రయాణం చేస్తే ఏడారిని దాటేస్తాం. మన బళ్లలో ఉన్న నీటి కుండలతో ఇక పని లేదు. కుండలు ఖాళీ చేస్తే.. బండిలో బరువు తగ్గుతుంది, వేగంగా వెళ్లొచ్చుఅని చెప్పాడు. మాట ప్రకారం.. తాగడానికి కొద్దిగా నీరు ఉంచుకుని కుండలన్నీ ఖాళీ చేశారు. రాత్రి చల్లగా గాలి వీచింది. మార్గదర్శికి నిద్ర ముంచుకొచ్చి కునుకు తీశాడు. ఎద్దులు దారి తప్పి.. తెల్లవారే సరికి వారిని అంతకు ముందురోజు ఎక్కడ బస చేశారో అక్కడికి చేర్చాయి. మరో రోజు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగేందుకు కూడా నీళ్లు లేకుండా పోయాయి. మార్గదర్శిని తిడుతూ అందరూ కూలబడి పోయారు.

బోధిసత్త్వుడు నిరాశ చెందలేదు. పరిసరాలు గమనించగా.. కాస్త దూరంలో అతడికి గడ్డి మొక్కలు కనిపించాయి. వెంటనే కొందరు యువకులను పిలిచి.. ‘యువకులారా! అక్కడ పచ్చటి గడ్డి ఉందంటే దాని అడుగున నీటి ఊట ఉన్నట్టుంది. మీరు పారలు తీసుకుని తవ్వండి. నీరు లభిస్తుందని చెప్పాడు. వెంటనే వారు తవ్వడం ప్రారంభించారు. కొద్ది సమయంలోనే వారికి తడిమట్టి తగిలింది. సంతోషంతో యువకుడు లోనికి బలంగా పలుగు దించాడు. ఖంగుమని శబ్దం వచ్చింది. మళ్లీ అందరూ నిరాశపడ్డారు. మట్టి కింద రాతి పొర తగిలింది. చేసిన శ్రమంతా వృథా అయిందని అందరూ బాధపడ్డారు. బోధిసత్త్వుడు రాతి పలకపై చెవి పెట్టి ఆలకించాడు. నీటి శబ్దం స్పష్టంగా వినిపించిందతనికి. వెంటనే ఒక బలమైన యువకుడ్ని పిలిచి.. ‘మిత్రమా! నిరాశ చెందకు రాతి పలక కింద కావాల్సినంత నీరుంది. నీ శక్తి చూపించు. అందరినీ బతికించు..’ అని ప్రోత్సహించాడు. యువకుడు బలం కొద్దీ రాతి పలకను గునపంతో మోదాడు. రాతిపలక పగిలింది. నీటిధార పైకి ఎగజిమ్మింది

నిరాశను దరి చేరకుండా చూడటం, పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించడం, ఉత్సాహం, సడలని సంకల్పం ఉంటే ఎంత కష్టమైన పనినైనా సాధించగలం అనే సందేశం ఇచ్చే కథ ఇది. దశ పారమితల్లోవీర్యపారమితికి చెందిన కథ ఇది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

శివుని రూపాల వెనకున్న అంతరార్థం ఇదే!