జీవిత సత్యం


జీవిత లక్ష్యం ఏమిటిఅని ఎప్పుడైనా ఓ ప్రశ్న వేసుకుంటే, మనలో చాలామందికి ఒకటే సమాధానం వస్తుంది- జీవించడంఅని. కాని- జీవించడం కంటే ముఖ్యమైనది, విలువైనది ఏమైనా ఉందా అని ఎంతమందికి అనిపిస్తుంది?
తినడం, తిరగడం, నిద్రపోవడం, చేసిన పనులే చెయ్యడం- ఇంతకు మించి జీవితంలో ఇంకేమీ కనిపించడం లేదు. అలాంటప్పుడు ఈ జీవితంలో గొప్పతనం ఏముందిఅని చాలా అరుదుగా, అతి తక్కువమంది వ్యక్తులకు అనిపిస్తుంటుంది.

జీవించక తప్పదు. జీవిస్తూనే మనిషి తన జీవితం గురించి తెలుసుకోవాలి.
మామూలుగా జీవించాలని మనం అనుకోవడం లేదు. ఏ ఆశయం కోసమో జీవించాలనుకుంటున్నాం. జీవించడమే మన పరమావధిగా ఉంది. దాన్నే ఓ లక్ష్యంగా మార్చుకోవాలని అనుకుంటున్నాం. ఆశయాల కోసం తీస్తున్న పరుగులే అంతటినీ విషపూరితం చేస్తున్నాయి. అనేక ఆశయాల సాధనకు పెడుతున్న ఉరకలు పరుగులు చివరికి మానవ జీవిత సంగీతాన్ని ధ్వంసం చేస్తున్నాయి.

ఓ ఆశయం పెట్టుకుంటే, జీవితంతో మనం యుద్ధంచెయ్యాలి. ఘర్షణ పడాలి. అవసరమైతే సుఖశాంతులు వదులుకోవాలి. ఒక బరువు మోసినంతగా జీవితయాత్ర సాగించాలి.

జీవితంలో అనేక సంఘటనలు, మార్పులు సంభవిస్తుంటాయి. మనిషి వాటిని గమనిస్తుండాలి. అన్ని ఆందోళనల్నీ విడిచిపెట్టాలి. జీవిత ప్రవాహ గమనాన్ని చక్కగా గమనించాలి. ఆ విధమైన సాక్షిత్వం అతడికి కచ్చితంగా బ్రహ్మానందాన్ని రుచి చూపిస్తుంది.

జీవితం కేవలం జీవించడానికే ఉంది. ఇది ఎవరి కోసమో కాదు. దేని కోసమో కాదు. ఎందుకోసమో కాదు. వాస్తవంలో ఉండే వ్యక్తే నిజంగా జీవిస్తున్నవాడు. అతడే జీవితసత్యం గ్రహించగలడు. జీవిత లక్ష్యాన్ని అందుకునేదీ ఆ మనిషే!

సముద్రంమీదకు వెళ్లేముందే, తీరాన కట్టి ఉన్న నావకు కట్టు విప్పాలని ప్రతి నావికుడికీ తెలుసు. అదేవిధంగా మానవుడూ పరిపూర్ణత్వ కాంతి సాగరంలోకి తన జీవితపు పడవ ప్రయాణం ప్రారంభించాలి. తీరం వద్ద తన పడవను కట్టాలి. కోరికల గొలుసుల్ని, ఆశయాల ముడుల్ని అతడు విప్పి తీరాలి. ఆ తరవాత తెడ్డు వేయాల్సిన అవసరం అతడికి రాదు.

శ్రీరామకృష్ణ పరమహంస జీవితయానంలో నావ లంగరును ఎత్తి ఉంచు. తెరచాపల్ని లేపి సిద్ధపరచు. దివ్యమైన అనుకూల పవనాలు అనుక్షణం నీ జీవితాన్ని నడిపించేందుకు సంసిద్ధంగా ఉన్నాయిఅనేవారు.

కేవలం పట్టాలమీదనే నడిచే రైలుబండి కాదు జీవితం. అది ఎత్తుగా ఉండే పర్వతాల నడుమ సాగుతూ, పరవళ్లు తొక్కుతూ, సాగరం వైపు పరుగులు పెట్టే నదిలాంటిది.

ఓషో అన్నట్లు- రాత్రిపూట నక్షత్రాలతో ఆకాశం నిండి ఉన్నప్పుడు, మరేమీ ఆలోచించకుండా మనిషి కేవలం వాటిని దర్శించాలి. విశాలమైన కడలిమీద అలలు నాట్యాలు చేస్తున్నప్పుడు, ఏ విధమైన ఆలోచనలూ అతడు చేయకూడదు. ఆ నాట్యాన్ని తిలకిస్తూ ఉంటే చాలు. ఓ మొగ్గ... పువ్వుగా విచ్చుకుంటున్నప్పుడు, ఎటువంటి ఆలోచనలూ చేయక, పూర్తిగా అటువైపు చూస్తూనే ఉండాలి. సరిగ్గా అప్పుడే ఓ మహా రహస్యం వెల్లడవుతుంది. ప్రకృతి ద్వారం నుంచి ప్రవేశించే అనుమతి మనిషికి లభించి, దివ్య మర్మం అవగతమవుతుంది.

ప్రకృతి అనేది దైవాన్ని ఆవరించి ఉన్న ఓ ఆచ్ఛాదన. అంతే తప్ప, అది మరొకటి కానే కాదు. దాన్ని పక్కకు తొలగించే విధానం తెలుసుకున్న వారు జీవితసత్యంతో పరిచయం పెంచుకుంటారుఅంటారు ఓషో!
- ఆనందసాయి స్వామి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)